– మొదటిసారిగా పైరసీ గ్యాంగ్ను పట్టుకున్నాం : సీపీ ఆనంద్
హైదరాబాద్, ప్రజాతంత్ర,సెప్టెంబర్29: సినిమాల పైరసీ వల్ల నిర్మాతల కష్టం వృథా అవుతోందని.. ఈ పరిశ్రమ బాగా ప్రభావానికి గురవుతోందని హైదరాబాద్ సీపీసీవీ ఆనంద్ వ్యాఖ్యానించారు. పైరసీపై తెలుగు ఫిలిం చాంబర్ ఆఫ్ కామర్స్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టామని పేర్కొన్నారు. నాలుగు నెలలు కష్టపడి దర్యాప్తు చేశామని గుర్తుచేశారు. దేశంలో మొదటి సారి పైరసీ చేస్తున్న ఓ గ్యాంగ్ను పట్టుకున్నామని వెల్లడించారు. 2023లో భారత దేశంలోని చిత్ర పరిశ్రమ రూ. 22,400 కోట్లు పైరసీతో నష్టపోయిందని చెప్పుకొచ్చారు సీపీ సీవీ ఆనంద్. 2024లో తెలుగు చిత్ర పరిశ్రమ రూ. 3700 కోట్లు నష్టపోయిందని తెలిపారు. ఈ అంశాలన్నీ దృష్టిలో ఉంచుకుని సమగ్ర దర్యాప్తు చేశామని పేర్కొన్నారు. పైరసీ మూవీస్ వల్ల ఆన్లైన్ బెట్టింగ్లకు కూడా ప్రేక్షకులు అలవాటు పడుతున్నారని చెప్పుకొచ్చారు. ఓ వెబ్సైట్, టెలిగ్రామ్ ద్వారా పైరసీ మూవీలు స్ట్రీమింగ్ చేస్తున్నారని వివరించారు. సర్వర్స్ హ్యాకింగ్తో పాటు క్యామ్ కార్డర్ ద్వారా నిందితులు సినిమాలను పైరసీ చేస్తున్నారని తెలిపారు. బెట్టింగ్ గేమింగ్ యాప్స్ నిర్వాహకులు పైరసీ చేసేవారికి డబ్బులు ఇచ్చి ప్రోత్సహిస్తున్నారని పేర్కొన్నారు సీపీ సీవీ ఆనంద్. బెట్టింగ్ యాప్ నిర్వాహకులు పైరసీ మూవీల ద్వారా వారి యాప్లను ప్రచారం చేసుకుంటున్నారు. తెలుగు ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఫిర్యాదు అందుకున్న వెంటనే ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశాం. తమిళ్ బ్లాస్టర్స్, ఫైవ్ మూవీ రూల్స్, తమిళ్ మూవీ వెబ్సైట్ లలో పైరసీ సినిమాలను అందుబాటులో ఉంచుతున్నారు. ఈ కేసులో హైదరాబాద్కు చెందిన జానా కిరణ్ కుమార్ అత్తాపూర్లోని మంత్ర మాల్ థియేటర్లో సినిమా కాపీ చేశాడు. ఫిర్యాదు అనంతరం 44 మంది అనుమానితులను విచారించిన తర్వాత అసలు నిందితుడు జానా కిరణ్ కుమార్గా తేలింది. చాలా సినిమాలని అత్తాపూర్లోని మంత్ర థియేటర్లో మొబైల్తో రికార్డ్ చేసి సిరిల్ అనే వ్యక్తికి అందచేశారు. నలబై మూవీలు థియేటర్లో కాపీ చేశాడు. ప్రతి సినిమాకు 300 నుంచి 400 డాలర్లను బిట్ కాయిన్స్ రూపంలో కిరణ్ కుమార్ తీసుకుంటున్నాడు. అనంతరం క్రిఫ్టో కరెన్సీ ట్రేడింగ్ ఫ్లాట్ ఫాంని ఉపయోగించి ఇండియన్ కరెన్సీలోకి మార్చుకుంటున్నారు. సినిమా పైరసీ చేయడానికి అనువైన సీటు చూసుకుని.. టికెట్ బుక్ చేసుకుని హై ఎండ్ కెమెరా ఉన్న ఫోన్తో రికార్డ్ చేస్తారు. స్క్రీన్ ఆఫ్ ఉన్నా కెమెరాల్లో వీడియో రికార్డ్ చేసే యాప్ ద్వారా అనుమానం రాకుండా ఇదంతా చేస్తున్నారు. అలాగే, బీహార్కు చెందిన అర్సలన్ అహ్మద్ కూడా హిందీ భోజ్పురి సినిమాలు రికార్డ్ చేసి సిరిల్కు పంపుతాడు’ అని హైదరాబాద్ సీపీ సీవీ ఆనంద్ పేర్కొన్నారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్సైట్ ను సందర్శించండి. తాజా అప్డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.





