– ప్రధాన ఎన్నికల అధికారి సుదర్శన్రెడ్డి
హైదరాబాద్, నవంబర్ 6, 2025: జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గానికి ఈనెల 11న జరగబోయే ఉప ఎన్నికలో ఓటు వేయడానికి వచ్చే ప్రతి ఓటరు తప్పనిసరిగా ఫోటో గుర్తింపు కార్డు తీసుకురావాలని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి సి.సుదర్శన్రెడ్డి విజ్ఞప్తి చేశారు. భారత ఎన్నికల సంఘం ఆదేశాల ప్రకారం ప్రతి ఓటరు పోలింగ్ కేంద్రంలో ఓటు వేయడానికి ముందు తమ ఓటరు ఫోటో ఐడీ కార్డు చూపించాలని, అది లేని వారు కింద పేర్కొన్న 12 ఫోటో గుర్తింపు పత్రాలలో ఏదైనా ఒకదాన్ని చూపించవచ్చని తెలిపారు.
ఆధార్ కార్డు, ఎంఎన్ఆర్ఈజీఎ ఉద్యోగ కార్డు, బ్యాంకు లేదా పోస్టాఫీస్ జారీ చేసిన ఫొటో ఉన్న పాస్బుక్, హెల్త్ ఇన్ష్యూరెన్స్ స్మార్ట్ కార్డు (ఆయుష్మాన్ భారత్ కార్డు సహా), డ్రైవింగ్ లైసెన్స్, పాన్ కార్డు, నేషనల్ పాపులేషన్ రిజిస్టర్ (ఎన్పీఆర్) కింద జారీ చేసిన స్మార్ట్ కార్డు, భారత పాస్పోర్టు, ఫొటోతో ఉన్న పెన్షన్ పత్రం, ప్రభుత్వ, పీఎస్యూ లేదా పబ్లిక్ లిమిటెడ్ కంపెనీలు జారీ చేసిన ఉద్యోగి గుర్తింపు కార్డు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల అధికార గుర్తింపు కార్డు, సామాజిక న్యాయ శాఖ జారీ చేసిన వికలాంగుల యూనిక్ ఐడీ కార్డు, విదేశీ ఓటర్లు (రిప్రజెంటేషన్ ఆఫ్ ద పీపుల్ యాక్టు 1950 సెక్షన్ 20 ప్రకారం నమోదైన వారు) తమ మూల భారత పాస్పోర్టు చూపించాలి.
కాగా, ఓటరు సమాచారం స్లిప్లు పోలింగ్కు కనీసం ఐదు రోజుల ముందుగానే పంపిణీ చేస్తారని, వాటిని గుర్తింపు పత్రాలుగా ఉపయోగించరాదని తెలిపారు. ఈ నియోజకవర్గంలోని ఓటర్లు ఓటరు జాబితాలో తమ పేరు ఉందో లేదో ధ్రువీకరించుకుని చెల్లుబాటయ్యే ఫోటో ఐడీతో పోలింగ్ కేంద్రాలకు వచ్చి నవంబర్ 11న బా ధ్యతగా ఓటు వేయాలని సుదర్శన్రెడ్డి సూచించారు.



