– హైకోర్టుకు వెళతామన్న మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి
హైదరాబాద్, ప్రజాతంత్ర, ఏప్రిల్ 8: కాంగ్రెస్ సర్కార్ ప్రజాపాలనలో అప్రజాస్వామిక విధానాలు కొనసాగుతున్నాయని బీఆర్ఎస్ నేతలు మండిపడుతున్నారు. పరిగి రైతుల పరామర్శకు వెళ్తున్న బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను అక్రమ అరెస్టు చేసిన సర్కార్ వనపర్తిలో హరీష్ రావు బహిరంగ సభకు అనుమతులను రద్దు చేసింది. వనపర్తి నియోజకవర్గం రేవల్లి మండలంలో గొల్లపల్లి రిజర్వాయర్ నిర్మాణానికి వ్యతిరేకంగా గత వంద రోజులుగా రైతులు దీక్షలు చేస్తున్నారు. వారికి మద్దతుగా ఈ నెల 9న హరీశ్రావు బహిరంగ సభను ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ఈ మేరకు సమావేశానికి అనుమతి ఇవ్వాలని పోలీసులను కోరారు. ప్రభుత్వం నుంచి అనుమతి రావడంతో రైతులు, బీఆర్ఎస్ శ్రేణులు సభ కోసం అన్ని ఏర్పాట్లు చేసుకున్నారు. కానీ అకస్మాత్తుగా గతంలో ఇచ్చిన అనుమతులను ప్రభుత్వం రద్దు చేసింది. దీనిపై మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. హైకోర్టుకు వెళ్లి సభకు అనుమతులు తెచ్చుకుంటామని తెలిపారు. ప్రజలు, రైతాంగం తరఫున ప్రశ్నిస్తున్న ప్రతిపక్షం గొంతు నొక్కేందుకు ఈ ప్రభుత్వం ప్రయత్నిస్తున్నదని మండిపడ్డారు. బీఆర్ఎస్ పార్టీకి ఉద్యమాలు కొత్త కాదని తెలిపారు. తాము కేసులు, బెదిరింపులకు భయపడితే ఈ తెలంగాణ వచ్చేది కాదని స్పష్టం చేశారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్సైట్ ను సందర్శించండి. తాజా అప్డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.