ప్రజా పాలనపై ప్రజలు సంపూర్ణ విశ్వాసం ఉంచారు

– రేవంత్‌ రెడ్డి కార్యదీక్షకు జూబ్లీహిల్స్‌ ఫలితం నిలువుటద్దం
– సమష్టి కృషితో సత్ఫలితాలు సాధించాం
` విజేత నవీన్‌ యాదవ్‌కు అభినందనలు
– రెవెన్యూ, సమాచార పౌరసంబంధాల శాఖ మంత్రి పొంగులేటి

హైదరాబాద్‌, ప్రజాతంత్ర, నవంబర్‌ 14: జూబ్లీహిల్స్‌ ఉప ఎన్నిక ఫలితంతో కాంగ్రెస్‌ ప్రభుత్వ రెండేళ్ల పాలనపై ప్రజలు సంపూర్ణ విశ్వాసం ఉంచారన్న విషయం స్పష్టమైందని రెవెన్యూ, హౌసింగ్‌, సమాచార, పౌరసంబంధాల శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. అబద్దాలు, అవాస్తవాలు, విషప్రచారాలు చేసిన పార్టీలకు జూబ్లీహిల్స్‌ ఓటర్లు కర్రుకాల్చి వాతపెట్టారని అన్నారు. ఇప్పటికైనా ప్రజాతీర్పును పరిగణనలోకి తీసుకొని తమ నోటికి తాళం వేసుకోవాలని హితవు పలికారు. ఈమేరకు శుక్రవారం ఆయన ఒక ప్రకటన విడుదల చేసి విజేత నవీన్‌ యాదవ్‌కు శుభాకాంక్షలు తెలిపారు. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి కార్యదక్షతకు ఈ ఫలితం ఒక రెఫరెండమ్‌గా నిలిచిందన్నారు. ప్రజలు ఇచ్చిన ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని జూబ్లీహిల్స్‌ ప్రజల సేవలో విజేత నవీన్‌యాదవ్‌ నిమగ్నం కావాలని పిలుపునిచ్చారు. ఇందుకు ప్రభుత్వం తరపున అన్నివేళలా సహకారం ఉంటుందని, ఎన్నికలో ఇచ్చిన హామీలను వీలైనంత త్వరగా నెరవేరుస్తామని అన్నారు. ముఖ్యంగా తాను ఇన్‌చార్జిగా వ్యవహరించిన రెహ్మత్‌ నగర్‌ డివిజన్‌లో కాంగ్రెస్‌కు అత్యధిక మెజారిటీ రావడం పట్ల ఆయన సంతోషం వ్యక్తం చేశారు. అసెంబ్లీ , పార్లమెంట్‌, కంటోన్మెంట్‌, ఇప్పుడు జూబ్లీహిల్స్‌ ఫలితాలే వచ్చే సాధారణ ఎన్నికల్లోనూ పునరావృతమవుతాయని ధీమా వ్యక్తం చేశారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *