ఉనికిని చాటుకోవడానికే హరీష్‌ తాపత్రయం

పీసీసీ చీఫ్‌ మహేష్‌కుమార్‌

హైదరాబాద్‌, ప్రజాతంత్ర, జులై 17: నిన్నటి దిల్లీి మీటింగ్‌లో ఏం జరిగిందో కేంద్ర మంత్రి సీఆర్‌ పాటిల్‌ చెప్పిన తర్వాత కూడా బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే హరీష్‌ రావు ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని పీసీసీ అధ్యక్షుడు మహేష్‌కుమార్‌ గౌడ్‌ మండిపడ్డారు. మీటింగ్‌లో ఏయే అంశాలు మాట్లాడారో సీఎం రేవంత్‌ రెడ్డి కూడా ప్రెస్‌మీట్‌ పెట్టి చెప్పారని, అయినా అవేవీ హరీష్‌ రావుకు పట్టనట్టు ఉంది అంటూ సెటైర్‌ విసిరారు. హరీష్‌ అడ్డగోలు వాదనతో, అర్థం లేని తర్కంతో పిచ్చి ప్రేలాపనలు చేస్తున్నారంటూ ఫైర్‌ అయ్యారు. సీఎం మాట్లాడినదానిపై ఏదో ఒకటి మాట్లాడి తన ఉనికిని చాటుకోవాలన్న తపన తప్ప హరీష్‌రావుకు రాష్ట్ర ప్రయోజనాలు ముఖ్యం కాదన్నారు. సీఎం రేవంత్‌ రెడ్డి ముఖ్యమంత్రి హోదాలో మాజీ సీఎం, బీఆర్‌ఎస్‌ పార్టీ అధ్యక్షుడు కేసీఆర్‌కు సవాల్‌ విసిరారన్నారు. అసెంబ్లీకి వచ్చి చర్చల్లో పాల్గొనండి లేదా తామే ఫామ్‌హౌస్‌కు వచ్చి అక్కడ మాక్‌ అసెంబ్లీ పెడతాం.. పాల్గొనండి అని సవాల్‌ చేస్తే అక్కడినుంచి ఆయన నోరు మెదపలేదన్నారు. మళ్ళీ సిగ్గులేకుండా సవాళ్ల గురించి మాట్లాడుతున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘ఆంధ్ర ప్రాజెక్టులు కట్టుకున్నా సమస్య లేదు.. రాయలసీమను రతనాల సీమ చేస్తాను.. బేసిన్లు లేవు, భేషజాలు లేవు అని కేసీఆర్‌ అంటేనే కదా ఈరోజు వాళ్ళు బనకచర్ల, రాయలసీమ ఎత్తిపోతల పథకాలు కడుతున్నది. తెలంగాణకు ద్రోహం చేసి మళ్లీ మీరే కాంగ్రెస్‌ మీద, ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి, నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డిపై ఆరోపణలు చేస్తున్నారు.. మీకు దమ్ముంటే అసెంబ్లీలో పెట్టే చర్చలకు నువ్వు, మీ మామ కేసీఆర్‌ వచ్చి మీ వాదన చెప్పండి.. అప్పుడు ఎవరు ఏంటో తెలుస్తుంది’ అని మహేశ్‌కుమార్‌ సవాల్‌ చేశారు. ప్రెస్‌మీట్లు పెట్టి కోడిగుడ్డు మీద ఈకలు పీకుదామని చూస్తే జనం నమ్మరన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *