– బెట్టింగ్ యాప్స్ను ప్రమోట్ చేసేలా పైరసీ
– పైరసీ ద్వారా రూ.20కోట్లు సంపాదించిన రవి
– రూ.3 కోట్లు అకౌంట్లో ఫ్రీజ్ చేశామన్న సిపి సజ్జన్నార్
– కమిషనర్ను కలిసి కృతజ్ఞతలు తెలిపిన సినీ పెద్దలు
హైదరాబాద్, ప్రజాతంత్ర, నవంబర్ 17: పైరసీతో సినీ పరిశ్రమకు భారీ నష్టం కలిగిందని నగర పోలీస్ కమిషనర్ సజ్జన్నార్ అన్నారు. పైరసీని అరికట్టే క్రమంలో ఐ బొమ్మ రవిని అరెస్ట్ చేశామన్నారు. ఐ బొమ్మ రవిపై మూడు పైరసీ కేసులున్నాయని తెలిపారు. రవి.. వెబ్ సైట్ డిజైన్, డెవలపింగ్లో ఆరితేరాడని, సీక్రెట్ కెమెరాలతో కొత్త సినిమాలను పైరసీ చేస్తాడని తెలిపారు. దమ్ముంటే పట్టుకోండి అంటూ పోలీసులకు ఛాలెంజ్ చేసిన ఐ బొమ్మ రవి ప్రస్తుతం జైల్లో ఊచలు లెక్కపెడుతున్నాడు. రవి అరెస్ట్పై సజ్జనార్ సినీ ప్రముఖులతో కలిసి మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన పైరసీపై సంచలన విషయాలు బయటపెట్టారు. ఐ బొమ్మ రవి హార్డ్ డిస్క్ లలో దాదాపు 21 వేలకు పైగా సినిమాలు ఉన్నాయని తెలిపారు. పైరసీ ద్వారా రవి రూ. 20 కోట్లు సంపాదించాడని, అందులో రూ.3 కోట్లు ఫ్రీజ్ చేశామని చెప్పారు. రవికి ఇంటర్నేషనల్ లింక్స్ ఉన్నాయని, ఈ కేసు చేధించేందుకు జాతీయ స్థాయి సంస్థల సహకారం తీసుకుంటామని స్పష్టం చేశారు. ఐ బొమ్మ రవి దగ్గర 50 లక్షల మంది సమాచారం ఉందని వెల్లడించారు. డేటా కలెక్షన్ కోసం ఐ బొమ్మ రవి మాస్టర్ మైండ్ ఉపయోగించాడని సీపీ వివరించారు. ఒక సైట్ను బ్లాక్ చేస్తే.. మరో సైట్ను డెవలప్ చేస్తాడని వెల్లడించారు. రవి సైట్ ఓపెన్ చేయగానే బెట్టింగ్ యాప్స్ అట్రాక్ట్ చేస్తాయని, బెట్టింగ్ యాప్స్తో జనం వేల కోట్లు నష్టపోయారని వ్యాఖ్యానించారు. కస్టడీకి ఇస్తే ఐ బొమ్మ రవి నుంచి పూర్తి వివరాలు రాబడుతామని, ఆయన నెట్వర్క్లో ఉన్న మిగతా వారిని కూడా అరెస్ట్ చేస్తామని సీపీ సజ్జనార్ పేర్కొన్నారు. ఇదిలావుంటే సోమవారం హైదరాబాద్ నగర సీపీ సజ్జనార్తో సినీ పెద్దలు భేటీ అయ్యారు. అగ్ర కథానాయకులు చిరంజీవి, నాగార్జునలతో పాటు దర్శకుడు రాజమౌళి, నిర్మాత దిల్రాజు, దగ్గుబాటి సురేశ్ ఈ భేటీలో పాల్గొన్నారు. ఇటీవల పైరసీ వెబ్సైట్ ఐబొమ్మ నిర్వాహకుడు ఇమ్మడి రవిని హైదరాబాద్ సైబర్క్రై పోలీసులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో సినీపెద్దలు సజ్జనార్కు కృతజ్ఞతలు తెలిపారు. అనంతరం సజ్జనార్ డియాతో మాట్లాడారు. పైరసీతో సినీ రంగానికి చాలా నష్టం జరిగిందని తెలిపారు. దీన్ని కట్టడి చేయడంలో భాగంగా ఐబొమ్మ నిర్వాహకుడు ఇమ్మడి రవిని అరెస్టు చేసినట్లు తెలిపారు. అతడిపై ఐటీ యాక్ట్, కాపీ రైట్ యాక్ట్ కింద మరో 4 కేసులు నమోదు చేసినట్లు చెప్పారు. పైరసీకి సంబంధించి అంతకు ముందు ప్రశాంత్, శివరాజ్ను కూడా అరెస్టు చేశాం. ఇమ్మడి రవి సమాజానికి చాలా నష్టం చేకూర్చాడు. పైరసీ ద్వారా నష్టం చేయడమేకాక బెట్టింగ్ యాప్లను ప్రమోట్ చేస్తున్నాడు. దీంతో చాలామంది చనిపోయారు. ఒక వెబ్సైట్ను బ్లాక్ చేస్తే కొత్త సైట్ను తయారు చేశాడు. ఇలా65 మిర్రర్ వెబ్సైట్లు నిర్వహించాడు. 21 వేల సినిమాలు అతడి హార్డ్ డిస్క్లో ఉన్నాయి. 1972లో విడుదలైన గాడ్ఫాదర్ నుంచి మొన్న వచ్చిన ఓజీ వరకు అందులో ఉన్నాయి. రూ.20 కోట్లు పైరసీ ద్వారా సంపాదించాడు. అందులో రూ.3 కోట్లు సీజ్ చేశాం. 50 లక్షల మంది సబ్స్క్రైబర్ల డేటా రవి వద్ద ఉంది. ఇంత డేటా అతడి వద్ద ఉండటం ప్రమాదకరం. దీన్ని సైబర్ నేరగాళ్లు వాడుకునే అవకాశం ఉందని సజ్జనార్ వెల్లడించారు. విశాఖకు చెందిన ఇమ్మడి రవి బీఎస్సీ కంప్యూటర్స్ చదివాడు. అతడు వేరే పేర్లతో మహారాష్ట్రలో డ్రైవింగ్ లైసెన్స్, పాన్ కార్డులు తీసుకున్నాడు. మొదటి నుంచి నేర ప్రవృత్తితో ఉన్నాడు. సినీరంగం అప్రమత్తమై ఫిర్యాదు చేసినప్పుడు పోలీసులు అతడి వెంట పడ్డారు. దీంతో భారత పౌరసత్వాన్ని వదిలి కరేబియన్ దీవుల్లో ఉన్న సెయింట్ కిట్స్ అండ్ నెవిస్ దేశ పౌరసత్వం తీసుకున్నాడు. ఫ్రాన్స్లో ఉంటూ వివిధ దేశాలు తిరిగేవాడు. 2019లో ఐబొమ్మ ప్రారంభించి 21 వేల సినిమాలు పైరసీ చేశాడు. అమెరికా, స్విట్జర్లాండ్, నెదర్లాండ్స్లో సర్వర్లను పెట్టాడు. 110 డొమైన్స్ కొనుక్కున్నాడు. ఒకటి బ్లాక్ చేస్తే మరొకటి ఓపెన్ చేస్తూ పైరసీ సినిమాలు విడుదల చేశాడు. ఈ రాకెట్లో ఉన్న మిగతా వాళ్లను కూడా బయటకు తీసుకువస్తాం అని సజ్జనార్ తెలిపారు. ఇదిలావుంటే ఈ కేసులో కీలకంగా వ్యవహరించి రవిని అరెస్ట్ చేసిన పోలీస్లను సినీ ప్రముఖులు చిరంజీవి, రాజమౌళి తదితరులు సన్మానించారు.
సైబర్ క్రైమ్ పోలీసుల కృషి అభినందనీయం: హోం శాఖ స్పెషల్ సెక్రటరీ ఆనంద్
ఐ బొమ్మ ఇమ్మడి రవిని హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు అరెస్ట్ చేసి జైలుకు పంపారు. పోలీసులకు దమ్ముంటే తనను పట్టుకోవాలని కొన్ని రోజుల ముందు రవి సవాల్ చేశాడు. ఆయన కదలికలపై నిఘా పెట్టిన పోలీసులు శనివారం అదుపులోకి తీసుకున్నారు. ఈ క్రమంలో రవి అరెస్ట్పై రాష్ట్ర హోం శాఖ స్పెషల్ సీఎస్ సీవీ ఆనంద్ స్పందించారు. రవి అరెస్ట్పై ఎక్స్ వేదికగా ట్వీట్ పెట్టారు. దమ్ముంటే పట్టుకోండి అన్నోడిని హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు పట్టుకున్నారంటూ సైబర్ క్రైమ్ పోలీసులకు అభినందనలు తెలిపారు. రవిని పట్టుకోవడానికి జూన్ నుంచి సైబర్ క్రైమ్ టీమ్ రేయింబవళ్లు కష్టపడిందని ప్రశంసించారు. అప్పట్లో రవిని తప్ప ఈ పైరసీకి సంబంధించిన వాళ్లందరినీ పట్టుకుందని గుర్తుచేశారు. డీసీపీ కవిత, సీపీ సజ్జనార్లకు ఆనంద్.ప్రత్యేకంగా అభినందనలు తెలిపారు .
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్సైట్ ను సందర్శించండి. తాజా అప్డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.





