న్యూదిల్లీ, డిసెంబర్18: భారత ప్రధాని నరేంద్ర మోదీకి అంతర్జాతీయ స్థాయిలో మరో అరుదైన గౌరవం దక్కింది. బుధవారం ఇథియోపియా అత్యున్నత పురస్కారాన్ని అందుకున్న ప్రధాని మోదీ.. మరుసటి రోజే మరో అరుదైన ఘనతను దక్కించుకున్నారు. ఒమన్ దేశం కూడా తన అత్యున్నత పౌర పురస్కారంతో ప్రధాని మోదీని గౌరవించడం విశేషం. ప్రధాని మోదీ తన మూడు దేశాల పర్యటనలో భాగంగా చివరిగా ఒమన్లో పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా ఇరు దేశాల మధ్య పలు ఒప్పందాలు ఖరారయ్యాయి. భారత్, ఒమన్ దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలను బలోపేతం చేయడంలో చేసిన కృషికి గుర్తింపుగా ఒమన్ సుల్తాన్ హైతం బిన్ తారిక్.. మోదీకి ‘ఆర్డర్ ఆఫ్ ఒమన్’ పురస్కారాన్ని ప్రదానం చేశారు. ‘ఆర్డర్ ఆఫ్ ఒమన్’ అనేది ఒమన్, విదేశీయులకు ఇచ్చే అత్యంత విశిష్టమైన పౌర పురస్కారం.భారత్ – ఒమన్ దేశాల మధ్య దౌత్య సంబంధాలు ఏర్పడి 70 ఏళ్లు పూర్తయిన సందర్భంగా మోదీ ఒమన్లో పర్యటిస్తున్నారు. కాగా, ప్రధాని మోదీ ఇప్పటివరకు వివిధ దేశాల నుంచి 29 అత్యున్నత పౌర పురస్కారాలను అందుకున్నారు. ఇటీవల కువైట్ ప్రభుత్వం కూడా ’ఆర్డర్ ఆఫ్ ముబారక్ అల్-కబీర్’తో ఆయనను గౌరవించింది. బుధవారం ఇథియోపియా తన అత్యున్నత పురస్కారమైన ‘నిషాన్ ఆఫ్ ఇథియోపియా’తో ప్రధాని మోదీని సత్కరించింది.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్సైట్ ను సందర్శించండి. తాజా అప్డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.





