“ఉల్లిపాయల ధరలు పడిపోవడానికి ప్రధాన కారణం, 2023 నుండి అమలులో ఉన్న ఎగుమతులపై ఆంక్షలు, నిషేధాల కొనసాగింపు ప్రభావమే. ఉల్లి ఉత్పత్తి దాదాపు 20% తగ్గుతుందని అంచనా వేయడంతో, ధరలను అదుపులో ఉంచడానికి ప్రభుత్వం చర్యలు తీసుకుంది. మొదటగా 2023 ఆగస్ట్ లో 40% ఎగుమతి సుంకం, ఆ తర్వాత 2023 అక్టోబర్లో టన్నుకు 800 డాలర్ల కనీస ఎగుమతి ధర విధించారు, చివరకు 2023 డిసెంబర్లో ఉల్లిపాయల ఎగుమతిపై పూర్తిగా నిషేధం విధించారు. ఈ నిషేధాన్ని 2024 మే నాటికి ఎత్తివేశారు, కానీ కొన్ని ఆంక్షలు కొనసాగాయి. చివరకు ఉల్లిపాయలపై విధించిన 20% సుంకాన్ని ఈ ఏడాది ఏ్రపిల్లో కేంద్రం ఎత్తేసింది. ఈ ఆర్థిక సంవత్సరంలో ఉల్లి దిగుబడి బాగా పెరగడంతో, మార్కెట్లో సరఫరాను కేంద్రం పునరుద్ధచించినప్పటికీ, ఎగుమతుల్లో క్షీణత కొనసాగింది.”
తాజాగా ధరలు పడిపోవడంతో పాటు, భారీ వర్షాల వల్ల పంట నష్టం జరగడంతో నష్టాలను చవిచూసిన రైతులు, ఉల్లిపాయలను రోడ్లపై పారబోస్తున్నారు. ఇలాంటి దృశ్యం భారతదేశంలో కొత్తేమీ కాదు, కానీ ఈ సంవత్సరం, ఉల్లి ఎగుమతిపై కేంద్ర ప్రభుత్వం విధించిన ఆంక్షల విధించిన నేపథ్యంలో ధరల పతనం కావడం, రైతుల ప్రస్తుత కష్టాలకు ప్రధాన కారణం. ఉల్లి ధరల్లో తరచుగా హెచ్చు తగ్గులు నమోదు కావడం సహజ ప్రక్రియగా మారింది. దేశ ప్రజల ఆహారంలో ఉల్లికి వున్న ప్రాధాన్యత తెలిసిందే. ఈ నేపథ్యంలో ఉల్లి ధరల్లో పెరుగుదల లేదా ఉల్లి కొరత ఏర్పడినప్పుడు అది రాజకీయ రంగు పులుముకుంటోంది. గత ఐదేళ్ల కాలంలో ఉల్లి ధరలో ఒక పరిధిలో కొనసాగినప్పటికీ, ఈ ఏడాది వీటి ధర బాగా పతనమైంది.
ఉల్లిపాయల ధరలు పడిపోవడానికి ప్రధాన కారణం, 2023 నుండి అమలులో ఉన్న ఎగుమతులపై ఆంక్షలు, నిషేధాల కొనసాగింపు ప్రభావమే. ఉల్లి ఉత్పత్తి దాదాపు 20% తగ్గుతుందని అంచనా వేయడంతో, ధరలను అదుపులో ఉంచడానికి ప్రభుత్వం చర్యలు తీసుకుంది. మొదటగా 2023 ఆగస్ట్ లో 40% ఎగుమతి సుంకం, ఆ తర్వాత 2023 అక్టోబర్లో టన్నుకు 800 డాలర్ల కనీస ఎగుమతి ధర విధించారు, చివరకు 2023 డిసెంబర్లో ఉల్లిపాయల ఎగుమతిపై పూర్తిగా నిషేధం విధించారు. ఈ నిషేధాన్ని 2024 మే నాటికి ఎత్తివేశారు, కానీ కొన్ని ఆంక్షలు కొనసాగాయి. చివరకు ఉల్లిపాయలపై విధించిన 20% సుంకాన్ని ఈ ఏడాది ఏ్రపిల్లో కేంద్రం ఎత్తేసింది. ఈ ఆర్థిక సంవత్సరంలో ఉల్లి దిగుబడి బాగా పెరగడంతో, మార్కెట్లో సరఫరాను కేంద్రం పునరుద్ధచించినప్పటికీ, ఎగుమతుల్లో క్షీణత కొనసాగింది. గత ఎనిమిది నెలలుగా కూరగాయల ధరలు సంవత్సరంతో పోలిస్తే తగ్గుతూ వస్తున్నాయి. 21 ముఖ్య కూరగాయలలో, 10-16 కూరగాయలు ధరలు ప్రతిద్రవ్యోల్బణాన్ని చవిచూశాయి. ఫలితంగా మొత్తంమీద ధరలు డోలాయమాన స్థితికి లోనయ్యాయి. వీటిలో, భారతీయ వినియోగానికి కీలకమైన, దాదాపుగా భర్తీ చేయలేని మూడు ముఖ్యమైనవి: బంగాళాదుంప, టమోటా మరియు ఉల్లిపాయ.
సెప్టెంబరు వరకు ఇటీవలి నెలల్లో ఉల్లిపాయలు అత్యంత తీవ్రమైన ధరల క్షీణతను చవిచూశాయి. ఇటీవలి వారాల్లో, ఉల్లి ధరల పతనం మరింత తీవ్రమైంది. వినియోగదారుల వ్యవహారాల శాఖ డేటా ప్రకారం, బంగాళాదుంప టోకు ధరలు 35-36% తగ్గాయి, టమోటా 24-44% మరియు ఉల్లిపాయ 54-56% తగ్గాయి. గమనించదగిన విషయం ఏమిటంటే, టమోటో ధరల పతనం గత సంవత్సరం అధికంగా జరిగింది. కానీ ఇది ఉల్లిపాయల విషయంలో జరగలేదు. ప్రస్తుతం ఉల్లిపాయల టోకు ధరలు కిలోకు ₹20-21 వరకు తక్కువగా ఉన్నాయి, ఇది 2023 వేసవి నుండి చూడని స్థాయి. ఈ తీవ్ర పతనం వెనుక కారణం, ఇటీవలి సంవత్సరాలలో ఉల్లిపాయల అధిక ఉత్పత్తి, 2023 నుండి దాని ఎగుమతులపై వరుసగా విధించిన ఆంక్షలు, నిషేధాల కారణంగా దేశీయ మార్కెట్లోకి పెద్దమొత్తంలో ఉల్లి సరఫరా కావడమే!
మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, కర్ణాటకల్లోని కొన్ని ప్రాంతాల్లో మాత్రమే అత్యధికంగా సాగయ్యే బంగాళాదుంప తర్వాత ముఖ్యమైన వాణిజ్యపరమైన కూరగాయ ఉల్లి మాత్రమే. ప్రధానంగా రబీ లేదా శీతాకాలంలో సాగు చేసే ఉల్లిపాయలకు గరిష్టంగా ఏడు నుండి ఎనిమిది నెలల నిల్వ సామర్థ్యం ఉంటుంది. అందువల్ల, ప్రతికూల వాతావరణం, నిల్వ సమస్యలు, ప్రభుత్వ జోక్యాల వంటి కారణాల వల్ల డిమాండ్-సరఫరాల మధ్య అంతరం ఏర్పడినప్పుడు వీటి ధరలు అస్థిరతకు లోనవుతాయి. సంవత్సరాలుగా, ఉల్లిపాయల రిటైల్ ద్రవ్యోల్బణం తీవ్రంగా పెరగడం, ఆ తర్వాత ఒకేసారి తగ్గడం వంటి ధోరణులు కనిపించాయి.
ఈ ఏడాది, సెప్టెంబరులో వరుసగా ఐదవ నెలలో ఉల్లిపాయల ధరలు దారుణంగా పడిపోయాయి. ఇది గత మేలో 10.7% పడిపోవడంతో ప్రారంభమై, సెప్టెంబరులో ఏకంగా 49.9% పతనమైంది. చారిత్రక ధోరణులతో పోలిస్తే, ఇది 2021, 2022లో కనిపించిన 21 నెలల పాటు కొనసాగిన ధరల తగ్గుదల ధోరణి 2016 , 2017లో కనిపించిన 18 నెలల ధోరణి కంటే తక్కువ తీవ్రత కలిగిందనే చెప్పాలి. ఉల్లి ధరలు ఇప్పటికే పడిపోయాయి. మహారాష్ట్ర, కర్నాటకల్లో ఉల్లిని రెండు సీజన్లలో పండిస్తారు. అయితే ఈ ఏడాది భారీ వర్షాలు ఉల్లి పంటలను దెబ్బతీసాయి. ఫలితంగా రైతులు తీవ్రంగా నష్టపోయారు. ఈ నేపథ్యంలో తమకు మద్దతు కావాలని డిమాండ్ చేస్తున్నారు. దీంతో ఆయా రాష్ట్రాలు పంట నష్టాలకు పరిహారం చెల్లించడం, విక్రయ ధర, మద్దతు ధరకు మధ్య వ్యత్యాసాన్ని చెల్లించడం వంటి చర్యలు చేపట్టడానికి ఉపక్రమించాయి. అయితే కేంద్రం ఈ విషయంలో ఎటువంటి చర్యలు తీసుకోబోయేదీ ఇప్పటివరకు వెల్లడించలేదు.
ఉల్లిపాయల ధరల్లో అధిక అస్థిరత కారణంగా, వినియోగదారుల ధరల సూచిక లో వాటి వాటా కేవలం 0.64% ఉన్నప్పటికీ, మొత్తం ద్రవ్యోల్బణాన్ని ప్రభావితం చేసే శక్తి ఉల్లిపాయలకు ఉంది. సెప్టెంబరులో, రిటైల్ ద్రవ్యోల్బణం 1.54%గా నమోదైంది. ఉల్లిపాయలు ఈ బాస్కెట్ నుండి తొలగిస్తే, రిటైల్ ద్రవ్యోల్బణం 2.24%కి పెరుగుతుంది, అంటే ఆ నెలలో ఉల్లిపాయలు 70 బేసిస్ పాయింట్ల (మొత్తం ద్రవ్యోల్బణంలో 30%) దిగువకు లాగే శక్తిగా ఉన్నాయి. 2020 డిసెంబర్ నుండి పరిశీలిస్తే ఇది అత్యంత బలమైన దిగువకు లాగే శక్తి. దీనికి వ్యతిరేకం కూడా విశ్లేషిస్తే ఉల్లి ధరలు పెరిగినప్పుడు, అవి ద్రవ్యోల్బణాన్ని విపరీతంగా పెంచుతాయి. 2019 డిసెంబర్లో, ఉల్లి ద్రవ్యోల్బణం 300% దాటి పెరిగినప్పుడు, అది ద్రవ్యోల్బణానికి 200 బేసిస్ పాయింట్ల కంటే ఎక్కువ జోడించి, రేటును 7% దాటి పెంచింది. మొత్తం ద్రవ్యోల్బణం మరియు ద్రవ్యోల్బణ అంచనాలపై ఉల్లిపాయల తీవ్ర ప్రభావం కారణంగా విధాన నిర్ణేతలు దాని ధరలను అదుపులో ఉంచాలి. ప్రజా ఆగ్రహాన్ని నివారించడానికి ధరలు పెరిగినప్పుడు ప్రభుత్వాలు తక్షణం స్పందిస్తాయి. ఇప్పుడు, రైతుల కష్టాలను నివారించడానికి, తక్కువ ఉత్పత్తిని నివారించడానికి మరియు ధరల పెరుగుదల చక్రాన్ని నివారించడానికి చర్యలు అవసరం కావచ్చు.
నిపుణుల అభిప్రాయం
మార్కెట్లో ఉల్లిపాయల అధిక సరఫరానే ధరలు తగ్గడానికి ప్రధాన కారణం. ఐడీఎఫ్సీ ఫస్ట్ బ్యాంక్ ముఖ్య ఆర్థికవేత్త గౌరా సేన్గుప్తా అభిప్రాయం ప్రకారం, ప్రస్తుత పరిస్థితుల్లో, ధరల పతనాన్ని అరికట్టడానికి ప్రభుత్వం ఎగుమతులను ప్రోత్సహించవచ్చు. ప్రాంతాలవారీగా మెరుగైన పంపిణీపై దృష్టి సారించవచ్చు. బ్యాంక్ ఆఫ్ బరోడా ముఖ్య ఆర్థికవేత్త మదన్ సబ్నవీస్ ప్రకారం, ఈ సమస్యలను పరిష్కరించడానికి ప్రభుత్వం పెద్దగా ఏమీ చేయలేదు. “తార్కికమైన మరియు సులభమైన మార్గం ఎగుమతులను పెంచడం, మరియు రెండవది మరొక బఫర్ స్టాక్ను సృష్టించడం” అని ఆయన అన్నారు. పెద్దగా జోక్యం లేకుండా, ఈ సీజన్లో ధరలు తక్కువగా ఉండే అవకాశం ఉంది. ఆ తర్వాత, ఈ తక్కువ ఆదాయాల కారణంగా రైతులు వచ్చే సీజన్లో తక్కువ ఉల్లిపాయలను పండిస్తారు, దీనితో స్వీయ-సర్దుబాటు ప్రారంభమవుతుంది అని ఆయన అన్నారు.
–ప్రగ్యా శ్రీవాస్తవ,’మింట్’ సౌజన్యం తో





