హైదరాబాద్, ప్రజాతంత్ర, ఏప్రిల్ 6 : మేఘాలయలోని కేంద్ర హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖకు చెందిన నార్త్ ఈస్టర్న్ పోలీస్ అకాడమీలో ప్రాథమిక శిక్షణ పొందుతున్న తొమ్మిదిమంది ప్రొబేషనరీ డీఎస్పీలు, ఐదుగురు క్యాడెట్ సబ్ ఇన్స్పెక్టర్ల బృందం ‘భారత దర్శన్’ అధ్యయన యాత్రలో భాగంగా తెలంగాణ రాష్ట్ర డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ బి. శివధర్ రెడ్డిని సోమవారం నాడు కలిసింది. డిజిపి కార్యాలయంలో జరిగిన సమావేశంలో వారు తెలంగాణ రాష్ట్ర పోలీస్ పనితీరును, ఇక్కడ అమలు చేస్తున్న అత్యాధునిక సాంకేతిక విధానాలను మరియు శాంతిభద్రతల పరిరక్షణలో అనుసరిస్తున్న విధానాలను గురించి తెలుసుకున్నారు. వివిధ రాష్ట్రాల్లోని పోలీస్ వ్యవస్థల పనితీరు, అక్కడి వృత్తిపరమైన సంస్కృతిని అధ్యయనం చేయడం ద్వారా తమ నైపుణ్యాలను మెరుగుపరుచుకోవడం ఈ శిక్షణ యాత్ర ప్రధాన ఉద్దేశమని అధికారులు తెలిపారు. దేశంలోని భిన్నత్వాన్ని గమనిస్తూ, జాతీయ సమగ్రతను కాపాడటంలో పోలీసుల పాత్రను అర్థం చేసుకోవడం ఈ పర్యటనలో మరో కీలక అంశమని పేర్కొన్నారు. ఈ సందర్భంగా డిజిపి బి. శివధర్ రెడ్డి శిక్షణార్థులతో మాట్లాడుతూ… వృత్తిపరమైన మెళకువలను వివరించడమే కాకుండా, ప్రజా సేవలో అంకితభావంతో పనిచేయాలని వారికి దిశానిర్దేశం చేశారు. తెలంగాణ పోలీసు విభాగం సాధించిన ప్రగతిని, ఫ్రెండ్లీ పోలీసింగ్ విధానాలను యువ అధికారులు అడిగి తెలుసుకున్నారు. శాంతిభద్రతల అదనపు డిజిపి మహేష్ ఎం భగవత్, డిప్యూటీ అసిస్టెంట్ డైరెక్టర్ పర్వేజ్ షేక్ తదితరులు కార్యక్రమంలో పాల్గొన్నారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్సైట్ ను సందర్శించండి. తాజా అప్డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.


