– పదోసారి ప్రమాణం చేయబోతున్న నితీశ్
– ఎన్డీయే నేతగా ఏకగ్రీవంగా ఎంపిక
– గవర్నర్కు రాజీనామా సమర్పణ
– హాజరుకానున్న ప్రధాని మోదీ, అమిత్ షా తదితరులు
పాట్నా,నవంబర్ 19: బీహార్లో నితీశ్ కుమార్ సారథ్యంలో ఎన్డీయే కొత్త ప్రభుత్వం గురువారం కొలువుతీరనుంది. ప్రస్తుత అసెంబ్లీ గడువు ముగియనుండటంతో ముఖ్యమంత్రి పదవికి నితీశ్ కుమార్ బుధవారం సాయంత్రం రాజీనామా చేశారు. తన రాజీనామా లేఖను గవర్నర్ ఆరిఫ్ మహమ్మద్ ఖాన్ను సమర్పించారు. ఎన్డీయే సభ్యుల మద్దతు లేఖను గవర్నర్కు అందజేశారు. ప్రభుత్వ ఏర్పాటుకు తమను ఆహ్వానించాలని కోరారు. ఇందుకు గవర్నర్ సానుకూలంగా స్పందించారు. నితీశ్ రాజీనామాను వెంటనే ఆమోదించారు. నితీశ్ వెంట గవర్నర్ను కలిసి వారిలో ఎల్జేపీఆర్వీ చీప్ చిరాగ్ పాశ్వాన్, ఆర్ఎల్ఎం చీఫ్ ఉపేంద్ర కుష్వాహ తదితరులు ఉన్నారు. కొత్త ప్రభుత్వం ఏర్పాటు దిశగా బుధవారం ఉదయం నుంచి పాట్నాలో వేగంగా పరిణామాలు చోటుచేసుకున్నాయి. జేడీయూ ఎమ్మెల్యేలు సమావేశమై పార్టీ శాసనసభా పక్ష నేతగా నితీశ్ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. బీజేపీ లెజీస్లేచర్ పార్టీ సైతం సమావేశమై పార్టీ నేతలు సామ్రాట్ చౌదరి, విజయ్ సిన్హా ఉప ముఖ్యమంత్రులుగా తిరిగి కొనసాగించాలని నిర్ణయించారు. అనంతరం ఎన్డీయే సమావేశం జరిగింది. ఈ సమావేశంలో దిలీప్ జైశ్వాల్, సామ్రాట్ చౌదరి, చిరాగ్ పాశ్వాన్, కేశవ్ ప్రసాద్ మౌర్య, విజయ్ కుమార్ సిన్హా, రాజు తివారి సహా ఎన్డీయేకు చెందిన 202 మంది ఎమ్మెల్యేలు హాజరయ్యారు. ఎన్డీయే లెజిస్లేచర్ పార్టీ నేతగా నితీశ్ కుమార్ పేరును సామ్రాట్ చౌదరి ప్రతిపాదించగా ఎమ్మెల్యేలంతా బలపరిచారు. దీంతో నితీశ్ 10వ సారి ముఖ్యమంత్రిగా పగ్గాలు చేపట్టేందుకు మార్గం సుగమమైంది. నంతరం నితీశ్ సారథ్యంలోని పలువురు నేతలు గవర్నర్ను కలుసుకున్నారు. మరోవైపు పా ట్నాలోని గాంధీ మైదానంలో 20వ తేదీ మధ్యాహ్నం 11.30 గంటలకునితీశ్ ప్రమాణస్వీకార కార్యక్రమానికి భారీ ఎత్తున ఏర్పాట్లు జరుగుతున్నాయి. ప్రమాణస్వీకారం ఉంటుంది. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర హోం మంత్రి అమిత్షా, పలువురు కేంద్ర మంత్రులు, ఎన్డీయే పాలిత ప్రాంతాల ముఖ్యమంత్రులు ఈ ప్రమాణస్వీకారోత్సవానికి హాజరవుతున్నారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్సైట్ ను సందర్శించండి. తాజా అప్డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.





