– 27మంది మంత్రులు కూడా ప్రమాణం
– ప్రమాణం చేయించిన గవర్నర్
– హాజరైన ప్రధాని మోదీ, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా
పాట్నా,నవంబర్ 20: బిహార్ సీఎంగా జేడీయూ అధినేత నితీశ్ కుమార్ గురువారం ప్రమాణస్వీకారం చేశారు. సిఎంగా ఆయన ప్రమాణస్వీకారం చేయడం ఇది పదోసారి. పట్నాలోని గాంధీ మైదానంలో నితీశ్తో పాటు 27 మంది మంత్రులు ప్రమాణస్వీకారం చేయగా.. సామ్రాట్ చౌదరీ, విజయ్ కుమార్ సిన్హాలకు డిప్యూటీ సీఎం పదవులు దక్కాయి. గవర్నర్ అరీఫ్ మహ్మద్ ఖాన్ సిఎం, మంత్రులతో ప్రమాణం చేయించారు. ఈ కార్యక్రమానికి ప్రధాని నరేంద్ర మోదీ, అమిత్ షా, ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు తదితరులు హాజరయ్యారు. బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్డీయే కూటమి అదరగొట్టింది. మొత్తం 243 అసెంబ్లీ సీట్లకు నితీశ్ కుమార్ నేతృత్వంలో ఎన్డీయే ఏకంగా 202 సీట్లు దక్కించుకుంది. బీజేపీ 101 సీట్లలో పోటీ చేసి 89 చోట్ల గెలుపొందింది. 101 సీట్లలోనే పోటీ చేసిన జేడీయూ 85 చోట్ల విజయం సాధించింది. తాజాగా ప్రమాణస్వీకారం చేసిన 27 మంత్రుల్లో.. 14 మంది బీజేపీ నుంచి కాగా, 9 మంది జేడేయూకు చెందిన నేతలు. బిహార్లో సీఎం నితీశ్ కుమార్ దాదాపు 19 ఏళ్లు పదవిలో ఉన్నారు. 2000 సంవత్సరంలో ఏడు రోజులు మాత్రమే సీఎంగా పని చేశారు. ఇప్పుడు ఎన్డీయే కూటమి మళ్లీ ఆయనకే పగ్గాలు అప్పగించడంతో పదోసారి సీఎంగా ప్రమాణం చేశారు. పదోసారి బిహార్ సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన నితీశ్ కుమార్కు ప్రధాని నరేంద్ర మోదీ శుభాకాంక్షలు తెలిపారు. ’సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన నితీశ్ కుమార్కు నా హృదయపూర్వక శుభాకాంక్షలు. నితీశ్ రాజకీయంలో ఎంతో అనుభవం ఉన్న నాయకుడు. రాష్ట్రంలో మంచి పాలన అందించిన వ్యక్తి అనే అద్భుతమైన రికార్డు ఆయనకు ఉందని ఎక్స్ వేదికగా పోస్ట్ పెట్టారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్సైట్ ను సందర్శించండి. తాజా అప్డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.





