ఆహార కల్తీ నియంత్రణకు సరికొత్త వ్యవస్థ

– ఈగల్‌, ‌హైడ్రా తరహాలో ఏర్పాటు ఆలోచన
– నిత్యావసరాలు అక్రమ నిల్వ చేస్తే కఠిన చర్యలు
– సన్న బియ్యం పంపిణీతో బ్లాక్‌ ‌మార్కెట్‌ ‌తగ్గింది
– వాణిజ్య పంటల వైపు రైతులను ప్రోత్సహిస్తున్నాం
– 50 శాతం సీట్లు పెంపు వెనక పెద్ద కుట్ర
– దక్షిణ భారత దేశానికి తీవ్ర అన్యాయం చేసే ఎత్తుగడ
– దీని కోసం బిజెపి లక్ష్మణ్‌ రాజీనామా చేయాలి
– కెసిఆర్‌ ‌వల్లనే తనకు మంచి పేరు వస్తోంది
– మీడియా చిట్‌చాట్‌లో సిఎం రేవంత్‌ ‌రెడ్డి

హైదరాబాద్‌,‌ ప్రజాతంత్ర, మార్చి 30: ఈగల్‌, ‌హైడ్రా తరహాలో ఆహార కల్తీ నియంత్రణకు సరికొత్త వ్యవస్థను తీసుకొస్తామని సీఎం రేవంత్‌రెడ్డి అన్నారు. దేశంలో చట్టాలను అధ్యయనం చేసి పకడ్బందీ వ్యవస్థను రూపొందిస్తామన్నారు. మరోవైపు పంటకు ధర నిర్ణయించే అవకాశం రైతుకు లేకుండా పోయిందని, వారి అవసరాలను ఆసరాగా చేసుకొని దళారులు దోపిడీ చేస్తున్నారని సీఎం వ్యాఖ్యానించారు. రైతుల హక్కులను కాపాడేందుకు కనీస మద్దతు ధర చట్టం తీసుకొచ్చినట్లు గుర్తు చేశారు. సోమవారం ఆయన డియాతో చిట్‌చాట్‌గా మాట్లాడారు. నిత్యావసరాలను అక్రమంగా నిల్వ ఉంచడం హత్యానేరం కంటే ఎక్కువే. ప్రజలకు దొడ్డుబియ్యం ఇవ్వడం వల్ల ప్రయోజనం లేదని గ్రహించాం. 86 శాతం ప్రజలు సన్నబియ్యం పొందుతున్నారు. అర్హులందరికీ  రేషన్‌కార్డు ఇచ్చాం. రైతులకు లాభం చేకూర్చడమే కాదు..పేదల ఆకలి తీరుస్తున్నాం. సన్నబియ్యం పంపిణీతో బ్లాక్‌ ‌మార్కెట్‌ ‌మాఫియా తగ్గింది. వాణిజ్య పంటలవైపు రైతులను ప్రోత్సహిస్తున్నాం అని అన్నారు.పంట మార్పిడి విషయంలో రైతులపై ఒత్తిడి తీసుకురామని.. వారికి అవగాహన కల్పిస్తామని తెలిపారు. పేదలకు ఇచ్చే సన్న బియ్యం కోసం రూ.14,560 కోట్లు ఖర్చు పెడుతున్నామని, దాంట్లో కోతలు పెట్టమని స్పష్టం చేశారు. సన్న బియ్యం పక్కదారి పట్టడం లేదని తెలిపారు. మంత్రి ఉత్తమ్‌ ‌కుమార్‌ ‌రెడ్డి సన్న బియ్యంతో అసెంబ్లీలో అందరికీ మంచి భోజనం పెట్టారన్నారు. పేదలందరికీ ప్రభుత్వ పథకాలు కచ్చితంగా అందుతాయని పేర్కొన్నారు ముఖ్యమంత్రి. వరి వేస్తే ఉరే అని కేసీఆర్‌ అన్నారని.. తాము మాత్రం వరి వేస్తే బోనస్‌ ఇస్తున్నామని చెప్పారు.

50 శాతం సీట్లు పెంచితే దక్షిణాదికి తీవ్ర అన్యాయం

నియోజకవర్గాల పునర్‌వ్యవస్థీకరణలో భాగంగా 50 శాతం సీట్లు పెంచితే.. దక్షిణ భారతదేశానికి తీవ్ర అన్యాయం జరుగుతుందని పునరుద్ఘాటించారు. దక్షిణాదిపై ఉత్తరాది ఆధిపత్యం చెలాయిస్తుంది. దక్షిణాదిలో ఒక్క సీటు రాకున్నా కేంద్రంలో సర్కారు ఏర్పాటు చేసుకోవచ్చు. రాష్ట్రాల సీట్ల మధ్య అంతరం.. పెంచిన తర్వాత కూడా అంతే ఉండాలి. నియోజకవర్గాల పునర్‌వ్యవస్థీకరణ పార్టీల సమస్య కాదు. 50శాతం సీట్ల పెంపుపై విస్తృతంగా చర్చ జరగాలన్నారు. పార్టీలకు అతీతంగా దక్షిణాదిలో కార్యాచరణ ఉండాలి. దేశంలో నియంత పాలన రాకూడదన్నదే నా ఉద్దేశం. దక్షిణాదికి బలం లేదని పెత్తనం చేస్తామంటే.. అది ఎంతకాలమో కొనసాగదు. జాతీయ పార్టీ అయినా అన్యాయంపై మాట్లాడే స్వేచ్ఛ మాకుందని సీఎం రేవంత్‌రెడ్డి అన్నారు. నియోజకవర్గాల పునర్విభజనపై బీజేపీ ఎంపీ లక్ష్మణ్‌ ఏదేదో మాట్లాడుతున్నారని.. తెలంగాణలో రాష్ట్రపతి పాలన పెడతామని అంటున్నారని మండిపడ్డారు. మరి బీజేపీ పాలిత రాష్ట్రాల్లో పెట్టరా అంటూ ప్రశ్నించారు.  దక్షిణ భారత ప్రజల కోసం లక్ష్మణ్‌ ‌రాజీనామా చేయాలని.. సౌత్‌, ‌నార్త్ ‌మధ్య అంతరం పెరగొద్దని హితవుపలికారు. తిరుగులేని పాలన వస్తే నియంతృత్వం వస్తుందని.. అది జరగటానికి వీల్లేదని తేల్చి చెప్పారు. దేశంలో బ్రూటల్‌ ‌మెజార్టీ కోసం ప్రయత్నాలు జరుగుతున్నాయని.. బీజేపీ నాయకులు దీనిపై అవగాహన తెచ్చుకోవాలని హితవుపలికారు. బాగా పని చేస్తున్న సౌత్‌ ఇం‌డియాను శిక్షించాలని చూస్తున్నారని మండిపడ్డారు.

కేసీఆర్‌ ‌వల్లే తనకు గుర్తింపు 

బీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌ ‌వల్లే తనకు గుర్తింపు వచ్చిందని సీఎం రేవంత్‌ ‌రెడ్డి అన్నారు. కేసీఆర్‌ ‌లేకపోతే తాను చేసిన మంచి పనులు ప్రజలకు తెలిసేవి కాదని చెప్పారు. రావణుడి చెడు వల్లే రాముడి గొప్పతనం తెలిసిందని చెప్పుకొచ్చారు. కేసీఆర్‌ ‌విశ్రాంతి తీసుకొంటున్నారని అందరూ అంటున్నారని.. ఆయన్ను గృహ నిర్బంధం చేశారని తనకు అనుమానంగా ఉందన్నారు. రేపటి నుంచి రెండు రోజులపాటు తాను కేరళలో ఎన్నికల ప్రచారం చేయనున్నట్లు తెలిపారు. తనకు, కేసీఆర్‌కు పోలిక లేదని, ఎన్నికల వేళ తాము ఏం చెప్పామో అదే చేస్తున్నట్లు తేల్చి చెప్పారు. కేసీఆర్‌ ‌చెప్పిన దానికి చేసిన దానికి సంబంధం లేదని.. ఆయన ఉండటం వల్లే తనకు పేరొచ్చిందని ఎద్దేవా చేశారు.  అన్ని పథకాలు కలిపితేనే ప్రజాపాలన అని, రైతులకు అవగాహన కల్పించడంలో డియా కీలకపాత్ర పోషించాలని విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా మీడియా సామాజిక బాధ్యత తీసుకోవాలని సూచించారు. రూ.500ల గ్యాస్‌ ‌విధానంలో ఎలాంటి మార్పులు లేవని గుడ్‌ ‌న్యూస్‌ ‌చెప్పారు. కేంద్రం సెస్‌ ‌పేరుతో వసూలు చేస్తున్న డబ్బులు రాష్ట్రానికి ఇవ్వడం లేదని.. 34 శాతం మాత్రమే తిరిగి ఇస్తున్నారని మండిపడ్డారు. కేంద్రానికి నచ్చిన రాష్ట్రాలకు మాత్రమే సెస్‌ ఇస్తున్నారని ఆరోపించారు.

సన్న బియ్యం క్రెడిట్ రేవంత్‌కే : మంత్రి ఉత్తమ్

ఏటా రూ.14,560 కోట్లు సన్న బియ్యం కోసం ఖర్చు చేస్తున్నామని, సన్న బియ్యంతో పేదలకు కడుపు నిండా భోజనం పెట్టే ఆలోచన చేస్తున్నామని పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్ రెడ్డి అన్నారు. ప్రభుత్వానికి ఎంత భారమైనా పేదలకు మేలు చేయాలని ఆలోచన చేస్తున్నామన్నారు. జనం తినే ఆహారమే అందించాలనేది తమ ఆలోచన అని, 86% జనాభాకు సన్న బియ్యం అందుతున్నాయని చెప్పారు. సోనియా గాంధీ తెచ్చిన ఫుడ్ సెక్యూరిటీ బిల్లుకు తెలంగాణలో న్యాయం జరుగుతుందన్నారు. ఇప్పటివరకు తమ ప్రభుత్వం రైతుల ఖాతాలోకి రూ.40,000 కోట్లు జమ చేసిందని, ధాన్యం కొనŸ్న48 గంటల్లో రైతుల ఖాతాలోకి డబ్బులు వస్తున్నామని, రాజకీయాలకుతీతంగా రేషన్ కార్డులు ఇస్తున్నామని, ఇప్పటివరకు మూడు కోట్ల 39 లక్షల మంది సన్న బియ్యం లబ్ధిదారులున్నారని వివరించారు. అడిగిన అందరికీ రేషన్ కార్డులను ఇస్తున్నామన్నారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *