శూన్యంలోని అనంతం…

నాలుగు మాటలు పురుడు పోసుకునేది / గాఢ నిశ్శబ్దంలోనే / అస్తిత్వ రహిత సంలీనంలోనే అని ఒక కవితలో ప్రఖ్యాత కవి ఆచార్య కెయెస్ రమణ అన్నారు. నిగూఢ ఆలోచనల జడిలో నిరంతరం ఉక్కిరిబిక్కిరయ్యే కవికి సజీవ నిర్జీవాలన్నిటితో విడదీయరాని అనుబంధం ఉంది. కవి మనసు శూన్యం అయితే అనంత విశ్వం అతని అంతరంగంలో ఒదిగిపోతుంది. మౌన, నిశ్శబ్ద, అస్తిత్వ ఆరాట కేంద్రంగా కవి మనసు రాహిత్యం నుండి అనంతం వరకు యాత్ర చేసి సత్య సందర్శన చేస్తుంది. మెలకువ ఒలికిన చైతన్యంతో, పరివేదనలో పడి కొట్టుకుపోకుండా పరిణామాలను పరిశీలించిన తెలివిడితో, శాస్త్రీయతతో కూడిన ఆధునిక నిత్య జీవిత స్పృహతో మనసును తట్టిన ఎన్నో అంశాల్ని
నిర్మాణ నిపుణతతో ఆలోచనాత్మకమైన కవితలుగా కవి ఫిజిక్స్ అరుణ్ కుమార్ మలిచి పేరొందారు. ఒక నిర్దిష్టమైన కవిత్వ వాతావరణాన్ని సృష్టించుకుని, ఆ ఆవరణాన్ని నిశితంగా అవలోకించి స్పష్టంగా సత్యావిష్కరణ చేసిన ఎన్నదగిన కవితల సమాహారంతో శూన్యం పేరిట ఈ కవి కవితా సంపుటి వెలువడింది . గుండె లోలకంలో కొట్టుకుంటూ ఫిజిక్స్ పరిభాషలో కవి కవిత్వ లయ పరుగులు పెడుతుంది.
వ్యక్తీకరణలో వినూత్నతను ప్రదర్శించి శూన్యం ఆవరించిన అంతరంగపు అంతరిక్షంలో ఆలోచనలను రగిలించే 58 కవితలు ఈ సంపుటిలో ఉన్నాయి.
    విశ్వాన్ని విశ్వాసానికి ప్రతీకగా చేసి ఆగస్టు 23, 2023 విశిష్టతను కవితామయం చేశారు. దశాబ్దాల ప్రయత్నాల ప్రయాణం/ దాటి మనమంతా పున్నమి/ వెన్నెల గుండె గుర్తులపై నిలబడ్డాం అని జాబిలి పై అడుగులు వేసి కలల రెక్కలను విప్పిన విక్రం ల్యాండర్ విజయాన్ని అక్షరీకరించారు. శాస్త్ర సాంకేతిక అంశాలను కవితా వస్తువులుగా స్వీకరించే ప్రత్యేకత ఉన్న కవి ఇంకోచోట అగ్నిపర్వతాల మధ్య ఇస్రో శాస్త్రవేత్తల / నిశ్శబ్దపు ఆత్మవిశ్వాసపు శోభ / చంద్రోదయాన్ని మేలుకొలుపుతుంది అన్నారు. భౌతిక శాస్త్ర ప్రేమికునిగా, తాత్వికునిగా మారేందుకు ఆకాశంలో చిన్ననాడు చూసిన నక్షత్రాలు తోడ్పడ్డాయని చెప్పారు. సత్య శాంతి ప్రయోగాలతో తనకు తానే ప్రకాశించే ఫిజిక్స్ ను విశ్వ గురువుగా సంబోధించారు. విశ్వ సమానత్వపు యవనిక పై విశ్వకవి గీతాంజలి వెలుగును అక్షరీకరించి చూపారు. చరిత్రకు నువ్వే ఓ ట్యాగ్ లైన్ అన్న కవితలో మహాకవుల మహాకావ్యాలు అక్షరాలు తడబడకుండా ఎలా నిలబడ్డాయి అని ప్రశ్నించారు. జీవితం ఎప్పుడూ ఓ పరీక్షే / పారిపోవడం, చనిపోవడం/ ఎప్పటికీ పరిష్కారం కాదు / ఫలితం ఏదైనా కానీ.. అని ప్రయత్నాల పరంపర కొనసాగించు అని భరోసా ఇచ్చారు. ఎన్ని సమస్యలు ఉన్నా ఆమె స్వేచ్ఛగా ధైర్యంతో ముందడుగే వేస్తుంది అని ట్రోలింగ్ పై రాసిన కవితలో ధీరతను ప్రదర్శించి చూపారు. అపజయాల నిశీధి నుండి బయటపడి కలల జ్ఞానశిఖరంపై ప్రాణం పెట్టమన్నారు.
జీవన పుడమిపై ప్రేమ పైరు మొలకెత్తడం మానేయడమే చివరికి మిగిలిందని వేదన చెందారు. అమ్మ జాతీయ జెండాను ముద్దాడింది కవిత ఉద్వేగాల ఊపిరిలో దేశ సేవకు సమర్పితమై జీవించలేని తన కొడుకును మరో భగత్ సింగ్ అనుకొని గర్వంతో అమ్మ భావించడాన్ని వివరించారు. అవనిపై అడవులు అభివృద్ధి మాటున అంతరించిపోతున్నాయని అన్నారు. ప్రకృతి పరిరక్షణ నినాదమే నవ ప్రపంచపు పదం కావాలని ఆకాంక్షించారు. ప్రయాణాన్ని ఓ అనితర సాధ్యంగా చూపిన కవి ఫిజిక్స్ ను తన తీరని దాహం అన్నారు. మత సామరస్యమే నా దేశపు వారసత్వమని చెప్పారు. పడిన చోటనే లేచి నిలబడమని యుగాది పాఠం కవితలో మనిషికి ధైర్యపు ఊపిరి పోసి ఉరిమే ఉత్సాహంతో మళ్లీ నీ జీవిత ఉద్యమం ఆరంభించమన్నారు. ఓటమి శబ్దం ఎంతసేపు?/ చీకటి ప్రభావం ఎంతసేపు? అనడం కవిలోని ఆశావాహ దృక్పథానికి నిదర్శనం. నవభారత నిర్మాతలైన పిల్లలను మెరిసే తారలతో, కపటమెరుగని పసి మొగ్గలతో పోల్చారు.ఉగ్గుపాలతో ఊపిరి పోసుకున్న గోరుముద్దల భాష ఐన తెలుగును పోటీ ఏదైనా, గడ్డ ఏదైనా గెలిపించి, గొప్పగా కీర్తించమన్నారు. అరుణోదయ కిరణాన్ని నేను అని మనిషి పక్షాన ఆత్మవిశ్వాసం ప్రకటించారు.
పర్యావరణ హితమే జీవన పోరాటంలో మెరుపులాంటి నవ మార్పు అవుతుందని ఆకాంక్షించారు. అంబేద్కర్ మార్గం మరో బుద్ధుడిలా మనిషికి దారి చూపిస్తూనే ఉంటుందని చెప్పారు. స్వేచ్ఛ, సమానత్వపు శిఖరమే త్రివర్ణ పతాకం అన్నారు. అన్నదాత దుస్థితికి నేను సైతం… రైతన్న కోసం కవిత అద్దం పట్టింది. ఇకనైనా రైతు దేవోభవ అని దేశాన్ని నినదించమని ఈ కవిత కోరింది. తాను నమ్మిన గణితం జ్ఞాపకాల గానమై గుండె లోలకమైందని చెప్పారు. పేద, మధ్యతరగతి జీవితాలకు న్యాయమైన తీర్పును ఇచ్చేందుకు జీఎస్టీ తీరు ఇప్పటికైనా మారాలని అన్నారు. జెండాకు గుండె నిండిన దేశభక్తితో సెల్యూట్ చేద్దాం రా రమ్మని బాలలోకానికి పిలుపునిచ్చారు. విశ్వశాంతి సౌధంలో అరుణోదయం కోసం, ధరణిపై ఆకుపచ్చని ధనం కోసం కవులంతా నిర్మలత్వంతో,కరుణ హృదయంతో ముందుకు సాగాలన్నారు.అంతరంగపు అంతరిక్షంలో చెలరేగే యుద్ధ సామ్రాజ్య గర్జనలు వినమన్నారు. అవని పై ఆక్సిజన్ అందక ఆయువు దీపాలు ఆరిపోవడమేంటి అని దేశ రాజధాని ఢిల్లీని తలుచుకొని వాపోయారు. గగనయాన్ గా నూతన చరిత్ర సిద్ధమైందని అన్నారు. జీవితంలో కాలంతో కాలక్షేపం కాదు/ కదనరంగం నేర్చుకో / నీ చేతలతో కాలం పై చెరగని ముద్ర వేసుకో అని మార్గదర్శనం చేశారు.చాలీచాలని జీతాలతో కడుపు నింపుకొని విద్యార్థుల జీవిత దీపాలను వెలిగిస్తున్న ప్రైవేటు టీచర్ల కడగండ్లను కవిత్వీకరించారు. ఆధునిక ప్రపంచపు ఆత్మకు రాణి చరవాణి అన్నారు. నవభారతపు లౌకికవాదం వికసించాలని ఆకాంక్షించారు. సమస్తమైన అమ్మకు అక్షర నమస్సులు అర్పించారు.
త్రివర్ణ పతాకాన్ని సగర్వంగా చూసి జనగణమన గీతం పాడుతూ నా గుండె ఆగిపోయినా పరవాలేదన్న ధీరతను చూపారు. పర్యావరణ పరిరక్షణ మానవ జీవన మనుగడకు ఎర్రజెండాగా మారిన హెచ్చరికను గమనించమన్నారు. గాంధీజీ ప్రవచించిన ప్రకృతి వైద్యమే అనుసరణీయ మార్గం అన్న మననం మళ్లీ ఇప్పుడు కలుగుతోందన్నారు. వేసవి సెలవుల్ని సార్ధకంగా గడిపేందుకు చేయాల్సిన పనులను మొక్కలు నాటుదాం కవితలో ఒక్కొక్కటిగా ఎంతో చక్కగా చెప్పారు. విభిన్నతలోని జీవన ఏకత్వాన్ని చూడమన్నారు. కావాలంటే చరిత్రను అడిగి చూడు ఆరడుగుల చివరి అంతిమ స్థానాన్ని కూడా అది నీకు చూపి వాస్తవాన్ని చెబుతుందని తెలిపారు. భౌతిక శాస్త్రంలో కొలతలేవు అన్న కవితలో మా దేహంలోని దైవం మీరే / మీ దేహంలోని దేశం మేమే అన్న అనంత స్పష్టతను చెప్పారు. ధ్యానంలోని జ్ఞాన ప్రవాహం మానవ సంస్కరణ మార్గమని అన్నారు. సినీ కవి సిరివెన్నెలను విధాత తలపున ప్రభవించిన అక్షర అరుణోదయంగా అభివర్ణించారు.
జనగణమన తరతరాలకు స్ఫూర్తి గీతంగా ప్రకాశించాలన్నారు. వారసత్వమా, బానిసత్వమా తేల్చుకొమ్మని ఈ తరానికి ప్రశ్నను సంధించారు. గుండె శబ్దాలను కలిపి అన్న కవితలో ఇంజనీర్ల దేశభక్తిని చాటారు. యుద్ధ సమయంలో వలస బ్రతుకులను అమ్మ గెలుస్తుంది కవిత చిత్రిక పట్టింది. నిశ్శబ్దంగా మండటం నేర్చుకుంటే ల్యాండర్లా దూసుకెళ్లి విశ్వగమనాన్ని మార్చే ఫిజిక్స్ సూత్రమై మిగిలిపోతావు అని యువతకు ప్రేరణాత్మకమైన సందేశం ఇచ్చారు. రైతు ముఖంలోని ఆకుపచ్చ నవ్వే దేశాన్ని గెలిపిస్తుందని తెలుసుకోమన్నారు. వరద బాధితులను ఆదుకోవాలని సూచనతో రాసిన కవితలు మానవత్వపు తేజంతో బాధితులను ఆదుకునేందుకు వట్టి మాటలు కట్టిపెట్టి గట్టిమేలు తలపెడదాం రమ్మని పిలుపునిచ్చారు. మే 13.. సెలవు దినం కాదు అన్న కవిత ఓటరు గురుతర బాధ్యతను గుర్తు చేసింది. మేరా భారత్ మహాన్ కవిత అమర మహనీయుల్ని స్మరించి భారతీయతను అఖండ శక్తిగా ఆవిష్కరించింది.
కరోనా కాలపు ప్రాణాంతక గడియల్లో ప్రాణాల్ని లెక్కచేయక పారిశుద్ధ్య సేవలు అందించి జీవితాల్ని కాపాడిన భూలోకపు దేవుళ్ళైన పారిశుద్ధ్య కార్మికులకు శతకోటి దండాలను కృతజ్ఞతగా సమర్పించారు.ట్వంటీ, ట్వంటీ విశ్వవిజేతగా భారత్ నిలిచిన సందర్భంగా రాసిన కవితలో భారతమాత కళ్ళల్లో సగర్వపు కన్నీళ్లు వచ్చాయన్నారు. శూన్యమే జీవిత స్వప్నం, సత్యమని, ఆలోచనల అన్వేషణ అని,విశ్వ వికాసమని తెలిపారు. చెట్లను కాపాడటమే భవిష్యత్తుకు బ్రతుకు అని గ్లోబల్ వార్నింగ్ కవిత నిర్ధారించింది. లక్షల భ్రమణాల తర్వాత ప్రేమతో నిర్మితమైన మానవ జీవన కృష్ణ బిలమే భౌతిక శాస్త్రం అని నిర్వచించారు. పుట్టుకలోని చావు/ చావులోని పుట్టుక అంతు చిక్కని పర్యాయపదాలే అంటూ సాపేక్షతా సిద్ధాంతం అన్న చివరి కవితలో శూన్యమే సత్యం / అనంతం దాని నైజం అని తేల్చారు. అన్నదాతల ఆత్మహత్యలు ఉండవద్దని, ఆకలి చావులు లేని ఆనంద సమాజం కావాలని, మొక్కలను నాటి పర్యావరణాన్ని జాగ్రత్తగా పరిరక్షించాలని, శాస్త్ర సాంకేతికతను శాంతి సౌభాగ్యాలతో కూడిన జీవన ప్రగతి సూత్రంగా మలచుకోవాలని ఈ కవితల్లో కవి ఆకాంక్షించారు. వినూత్నత, ప్రామాణికతలను ను పాటించి శాస్త్రీయ జీవన ప్రయోజనాన్ని ప్రవచించిన కవిత్వమిది.
— డా. తిరునగరి శ్రీనివాస్
    9441464764

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *