19న చీఫ్‌ జస్టిస్‌గా ఏకే సింగ్‌ ప్రమాణస్వీకారం

హైదరాబాద్‌, ప్రజాతంత్ర, జులై 15: తెలంగాణ హైకోర్టు నూతన ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్‌ అపరేశ్‌ కుమార్‌ సింగ్‌ (ఏకే సింగ్‌) ఈనెల 19న ప్రమాణస్వీకారం చేయనున్నారు. రాజ్‌భవన్‌లో మధ్యాహ్నం 12.30 గంటలకు గవర్నర్‌ జిష్ణుదేవ్‌ వర్మ జస్టిస్‌ ఏకే సింగ్‌తో ప్రమాణస్వీకారం చేయించనున్నారు. కార్యక్రమానికి హైకోర్టు న్యాయమూర్తులు, శాసనమండలి చైర్మన్‌, శాసనసభ స్పీకర్‌, ముఖ్యమంత్రి ఎ.రేవంత్‌రెడ్డి, పలువురు మంత్రులు హాజరుకానున్నారు. జస్టిస్‌ ఏకే సింగ్‌ ప్రస్తుతం త్రిపుర హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా ఉన్నారు. తెలంగాణ హైకోర్టుకు బదిలీ చేస్తూ రాష్ట్రపతి ఆమోదముద్ర వేయడంతో సోమవారం కేంద్ర న్యాయ శాఖ గెజిట్‌ విడుదల చేసిన విషయం తెలిసిందే.

నేడు యాక్టింగ్‌ చీఫ్‌ జస్టిస్‌కు వీడ్కోలు

హైకోర్టు యాక్టింగ్‌ చీఫ్‌ జస్టిస్‌గా చేస్తున్న జస్టిస్‌ సుజోయ్‌పాల్‌ కోల్‌కతా హైకోర్టుకు బదిలీ అయిన నేపథ్యంలో ఆయనకు హైకోర్టు బుధవారం వీడ్కోలు పలకనుంది. హైకోర్టులోని మొదటి కోర్టు హాల్‌లో మధ్యాహ్నం 3.45 గంటలకు వీడ్కోలు సమావేశం జరగనుంది. గత చీఫ్‌ జస్టిస్‌ అలోక్‌ అరాధే జనవరిలో బదిలీపై బాంబే హైకోర్టుకు వెళ్లడంతో ఆదే నెల 11 నుంచి జస్టిస్‌ సుజయ్‌పాల్‌ యాక్టింగ్‌ చీఫ్‌ జస్టిస్‌గా వ్యవహరిస్తున్నారు. యాక్టింగ్‌ సీజే బదిలీ అయ్యాక నూతన సీజే జస్టిస్‌ ఏకే సింగ్‌ ప్రమాణస్వీకారం చేసే శనివారం (19వ తేదీ) వరకు రెండు రోజులపాటు యాక్టింగ్‌ చీఫ్‌ జస్టిస్‌గా పి.శ్యాం కోషి వ్యవహరించనున్నారు. మరో న్యాయమూర్తి జస్టిస్‌ తడకమళ్ల వినోద్‌కుమార్‌ మద్రాస్‌ హైకోర్టుకు బదిలీ అయిన నేపథ్యంలో ఆయనకు కూడా హైకోర్టు న్యాయమూర్తులు (ఫుల్‌ కోర్టు) సమావేశం వీడ్కోలు పలకనున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *