కార్మిక శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి
హైదరాబాద్, ప్రజాతంత్ర, జూన్ 27: గిగ్ వర్కర్ల హక్కుల కోసం కొత్త చట్టం తెస్తామని తమ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ హామీ ఇచ్చారని, ఈ క్రమంలో వారి కోసం త్వరలో రాష్ట్ర ప్రభుత్వం చట్టం తేనున్నదని కార్మిక శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి విలేకరుల సమావేశంలో పేర్కొన్నారు. ఇప్పటికే రాజస్థాన్, కర్ణాటకలో గిగ్ వర్కర్ల కోసం చట్టాలు ఉన్నాయన్నారు. గిగ్ వర్కర్ల హక్కుల కోసం ప్రత్యేకంగా బోర్డు ఏర్పాటు చేయాలని ఆలోచన చేస్తున్నామన్నారు. వీరి హక్కుల అమలు కోసం 66 సలహాలు, సూచనలు వచ్చాయని, వీరి హక్కుల పరిరక్షణలో ప్రభుత్వం మొదటి అడుగు వేయబోతోందని మంత్రి వివరించారు. తరచూ చర్చలు జరిపి సలహాలు, సూచనలు తీసుకుంటున్నామని, గిగ్ వర్కర్ల యాక్ట్ను త్వరలోనే కేబినెట్కు పంపబోతున్నామని చెప్పారు. రాష్ట్రంలో నాలుగున్నర లక్షల మంది గిగ్ వర్కర్లు ఉన్నారని తెలిపారు. కొత్త చట్టం వీరికి ఎంతో ఉపయోగపడుతుందని, బిల్లులో 1 లేదా 2 శాతం సెస్ పెట్టడానికి, బోర్డు ద్వారా అమలు చేసేందుకు కసరత్తు చేస్తున్నామని మంత్రి వెంకటస్వామి చెప్పారు.





