– స్వాతంత్య్ర సమరయోధుల స్ఫూర్తితో ముందుకు సాగాలి
– రానున్న రోజుల్లో విశ్వగురు స్థాయికి భారత్
– విస్తరించిన జాతీయ రహదారులు
-దేశంలో పెరిగిన కనెక్టివిటీ
– బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు ఎన్. రాంచంద్రరావు
79వ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా శుక్రవారం హైదరాబాద్లోని బిజెపి తెలంగాణ రాష్ట్ర కార్యాలయంలో వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పార్టీ రాష్ట్ర అధ్యక్షులు శ్రీ ఎన్. రాంచందర్ రావు జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి, దే స్వాతంత్య్రం కోసం ప్రాణత్యాగం చేసిన అమరవీరులను, పోరాట యోధులను స్మరించుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తాను బిజెపి తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించిన తరువాత మొట్టమొదటి జెండా ఆవిష్కరణ కార్యక్రమమని అన్నారు. గతంలో దివంగత ప్రధానమంత్రి జవహర్లాల్ నెహ్రూ 17 సార్లు ఎర్రకోటపై త్రివర్ణ పతాకాన్ని ఆవిష్కరించారు. ఆ తర్వాత కాంగ్రెస్సేతర ప్రధానిగా నేడు , 2047 వికసిత భారత్ విజన్తో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వరుసగా 12వ సారి ఎర్రకోటపై జాతీయ పతాకాన్ని ఎగురవేశారు. అంతేకాకుండా, చారిత్రక ఎర్రకోట నుంచి అత్యధిక సమయం ప్రసంగించిన ప్రధానిగా మోదీ గారు రికార్డు సృష్టించారన్నారు. దేశంలో పాలించే హక్కు మా కుటుంబానిదే అనుకునే పరిస్థితిలో, ఒక చాయ్ అమ్మే వ్యక్తి భారత ప్రధానమంత్రిగా అవతరించి, ఎర్రకోటపై 12వసారి జాతీయ జెండా ఎగురవేయడం సామాన్యుడికి గర్వకారణమన్నారు. మన దేశ స్వాతంత్య్రం ఎవరో ప్రసాదించినది కాదు. దీని వెనుక అనేకమంది స్వాతంత్య్ర సమరయోధుల త్యాగాలు ఉన్నాయన్నారు. భగత్ సింగ్, చంద్రశేఖర్ ఆజాద్, రాజ్ గురు, సుఖ్ దేవ్, నేతాజీ సుభాష్ చంద్రబోస్ వంటి అనేక మంది మహనీయులు భారతమాతను దాస్య శృంఖలాల నుంచి విడిపించడానికి ప్రాణత్యాగం చేశారని గుర్తు చేశారు. స్వాతంత్య్ర సమరయోధుల త్యాగాలతో పాటు, దేశ విభజన సమయంలో జరిగిన అనేక విషాద గాథలను కూడా మనం గుర్తుంచుకోవాలన్నారు.




