– వికసిత్ భారత్ రోజ్గార్, ఆజీవికా హామీ మిషన్
- బిల్లును ప్రవేశపెట్టిన మంత్రి శివరాజ్ సింగ్
- బిల్లుపై భగ్గుమన్న విపక్ష సభ్యులు.. పోడియం వద్ద నిరసన
– ప్రభుత్వ తీరును ఏకిపారేసిన కాంగ్రెస్ ఎంపి ప్రియాంక
– గాంధీ పేరు మార్చడంపై మండిపడ్డ శశిథరూర్
- ప్రభుత్వ తీరుకు నిరసనగా విపక్ష సభ్యుల వాకౌట్
న్యూదిల్లీ, డిసెంబర్ 16: మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం చట్టం ఎంజీ నరేగా రద్దుపై పార్లమెంటులో తీవ్ర గందరగోళం చెలరేగింది. నరేగా రద్దును నిరసితిస్తూ విపక్ష సభ్యులు స్పీకర్ పోడియం వద్దకు వచ్చి ఆందోళనకు దిగారు. ఇది గాంధీని అవమానించడమేనని అన్నారు. నరేగా స్థానంలో కేంద్రం కొత్త చట్టాన్ని తీసుకొస్తున్న సంగతి తెలిసిందే. ఇందుకు సంబంధించిన ’వికసిత్ భారత్ రోజ్గార్, ఆజీవికా హా మిషన్ (గ్రామీణ్) (వీబీ-జీ రామ్ జీ) బిల్లు- 2025’ను కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహన్ మంగళవారం లోక్సభలో ప్రవేశపెట్టారు. ఈ బిల్లును ప్రతిపక్షాలు తీవ్రంగా వ్యతిరేకించాయి. ఈ సందర్భంగా కాంగ్రెస్ ఎంపీ ప్రియాంక గాంధీ మాట్లాడుతూ కేంద్రంపై విమర్శలు గుప్పించారు. ఇది ఎంజీ నరేగా చట్టాన్ని బలహీనపర్చడమేనని దుయ్యబట్టారు. ప్రభుత్వ పథకాల పేర్లను మార్చడం అనేది చాలా ఖర్చుతో కూడుకున్న పని.. అయినా కేంద్రం మారుస్తూనే ఉంది. .పథకాల పేర్లను మార్చడం అంటే మోదీ ప్రభుత్వానికి ఎందుకంత ఇష్టమో అర్థం కావట్లేదని అన్నారు. ఎంజీ నరేగా చట్టం పేదలకు 100 రోజుల ఉపాధి హామీ కల్పిస్తోంది. ఈ కొత్త బిల్లుతో ప్రస్తుత చట్టాన్ని బలహీనపర్చే ప్రయత్నం చేస్తున్నారు. ఈ బిల్లులో ఒకటో, రెండో కొత్త విషయాలు చేర్చారు. పని దినాలను పెంచారు. అంతేగానీ వేతనాన్ని పెంచారా అని ప్రియాంక ప్రశ్నించారు. గతంలో గ్రామ పంచాయతీలు ఈ పథకం కింద పనిచేయించేవి. ఇప్పుడు కొత్త బిల్లుతో పంచాయతీలకు ఆ హక్కును దూరం చేస్తున్నారు. ఇక ఈ బిల్లుతో ఉపాధి హామీ పథకంపై కేంద్రం నియంత్రణను పెంచి నిధులను తగ్గించే ప్రయత్నం చేస్తున్నారు. ఎవరి ఇష్టానుసారంగానో బిల్లులను ఆమోదించుకుంటామంటే కుదరదు. ఈ బిల్లును తక్షణమే కేంద్రం ఉపసంహరించుకోవాలని ప్రియాంక అన్నారు. ప్రియాంక మాట్లాడుతుండగా ట్రెజరీ బెంచ్లో కొందరు ‘ఫ్యామిలీ’ అంటూ వ్యాఖ్యలు చేశారు. దీనికి ఆమె స్పందిస్తూ మహాత్మా గాంధీ మా కుటుంబానికి చెందిన వ్యక్తి కాదు కానీ, మా కుటుంబ సభ్యుడితో సమానం. గాంధీజీని యావత్ దేశం అలాగే భావిస్తోందని కౌంటర్ ఇచ్చారు. అనంతరం టీఎంసీ ఎంపీ సౌగతా రాయ్ మాట్లాడుతూ రాముడి పేరుతో కేంద్రం దోపిడీకి పాల్పడుతోందని దుయ్యబట్టారు. ఉద్దేశపూర్వకంగా గాంధీ పేరును తొలగించే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు.
విపక్షాల ఆరోపణలను కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహన్ తిప్పికొట్టారు. మహాత్మాగాంధీ అంటే తమకు ఎంతో గౌరవమని, ఆయన సిద్దాంతాలను తమ ప్రభుత్వం పాటిస్తోందని తెలిపారు. గ్రామీణ ప్రాంతాల అభివృద్ధి కోసం గత ప్రభుత్వాల కంటే మోదీ సర్కారు ఎంతో కృషి చేసిందని తెలిపారు. పేదల సంక్షేమం, ఉపాధి పెంపు కోసమే ఈ బిల్లును తీసుకొచ్చినట్లు తెలిపారు. ఈ బిల్లుపై లోక్సభలో గందరగోళ వాతావరణం నెలకొంది. కేంద్రం తీరును నిరసిస్తూ విపక్షాలు వెల్లోకి దూసుకెళ్లి ఆందోళన చేపట్టాయి. అనంతరం గాంధీజీ ప్లకార్డులు ప్రదర్శిస్తూ సభ నుంచి వాకౌట్ చేశాయి. అంతకుముందు కాంగ్రెస్ ఎంపీ శశిథరూర్ కూడా ఈ బిల్లును వ్యతిరేకించారు. ఈ పథకానికి గాంధీ పేరును తొలగించడం అనైతికమన్నారు. అంతేగాక రాముడి పేరును అపవిత్రం చేయొద్దంటూ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. సోమవారం కూడా థరూర్ ఈ పేరు మార్పుపై ఎక్స్ వేదికగా స్పందించారు.ఎంజీనరేగా పేరు మార్చి కేంద్రం కొత్తగా బిల్లు తీసుకురావడంపై జరుగుతున్న వివాదం దురదృష్టకరం.. గ్రామ స్వరాజ్ సిద్దాంతాలు, రామరాజ్య ఆదర్శాలు ఎన్నటికీ ఒకదానితో ఒకటి పోటీపడేవి కాదు.. గాంధీజీ దృక్పథానికి అవి రెండు మూలస్తంభాల్లాంటివి. ఇప్పుడు పథకానికి పేరు మార్చడం అంటే ఆయన ఆదర్శాలను విస్మరించినట్లే.. ఆయన వారసత్వాన్ని అగౌరపర్చే ప్రయత్నం చేయొద్దు అని థరూర్ అన్నారు. కాగా, శశిథరూర్ కొంతకాలంగా కాంగ్రెస్ తో విభేదిస్తూ మోదీ ప్రభుత్వంపై బహిరంగంగానే ప్రశంసలు కురిపిస్తోన్న సంగతి తెలిసిందే. దీంతో సొంత పార్టీ నేతల ఆగ్రహానికి గురవుతున్నారు. ఈ క్రమంలో తాజాగా బిల్లు విషయంలో కాంగ్రెస్కు మద్దతుగా మాట్లాడటం ప్రాధాన్యం సంతరించుకుంది.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్సైట్ ను సందర్శించండి. తాజా అప్డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.


