– మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి
నల్లగొండ, ప్రజాతంత్ర, నవంబర్ 12: ప్రసవాల నిర్వహణలో నల్గొండ జిల్లా ప్రభుత్వ ప్రధాన హాస్పిటల్ రాష్ట్రంలోనే ముందుందని రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు. జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ప్రధాన హాస్పిటల్లో రూ.30 లక్షల వ్యయంతో నూతనంగా నిర్మించిన ప్రత్యేక వైకల్య గుర్తింపు కార్డుల జారీ కేంద్రాన్ని ఆయన బుధవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ రాష్ట్రంలో ఉస్మానియా, గాంధీ తర్వాత ఎక్కువగా ప్రసవాలు నిర్వహించే అతిపెద్ద హాస్పిటల్గా నల్గొండ జీజీహెచ్ పేరుపొందిందని, ప్రతినెలా 700 నుండి 800 వరకు ప్రసవాలు జరుగుతున్నాయని తెలిపారు. గతంలో ఉన్న సదరం శిబిరం కేంద్రంలో సౌకర్యాల లేమితో వైకల్యం కలిగిన వారు అనేక ఇబ్బందులను ఎదుర్కోవడాన్ని దృష్టిలో ఉంచుకుొని రూ.30 లక్షల వ్యయంతో నూతన భవనాన్ని నిర్మించి తాగునీరు, టాయిలెట్స్, ర్యాంపు, ఇతర అన్ని రకాల సౌకర్యాలను ఏర్పాటు చేసినట్లు చెప్పారు. వైకల్యం కలిగిన వారు ఇక ప్రతివారం ఎలాంటి ఇబ్బంది లేకుండా సర్టిఫికెట్లు పొందవచ్చన్నారు. ఇప్పటివరకు ధ్రువపత్రాలు రాని వారికి వాటిని జారీ చేస్తామని, సదరం ధ్రువపత్రాల ఆధారంగా పెన్షన్ రాని వారికి పెన్షన్ ఇస్తామని చెప్పారు. ఈ హాస్పిటల్లో ఉన్న సౌకర్యాలు ఏ ఇతర ఆస్పత్రిలో లేవని, అన్ని అధునాతన సౌకర్యాలు ఏర్పాటు చేస్తున్నామని, ఇందులో భాగంగా ఇటీవలే బేబీ వార్మ్స్, లాప్రోస్కోపిక్ మిషన్ వంటివి ఏర్పాటు చేశామని, రూ.2-3లక్షల విలువ చేసే ఆపరేషన్లు సైతం ఉచితంగా చేస్తున్నట్లు, వీటిని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఇంకా అవసరమైన సౌకర్యాలను కల్పిస్తామని, అవసరమైతే ప్రతీక్ ఫౌండేషన్ ద్వారా సహకారం అందిస్తామని చెప్పారు. ప్రసవాల కోసం ప్రజలు ప్రైవేట్ హాస్పిటల్స్కు వెళ్లకుండా ప్రభుత్వ ప్రధాన హాస్పిటల్కు రావాలని పిలుపునిచ్చారు. ఇందుకు ఆశ, అంగన్వాడీ, హాస్పిటల్ సిబ్బంది, అంబులెన్స్ డ్రైవర్లు, వైద్యులు కృషి చేయాలని మంత్రి సూచించారు. వైద్య సేవలలో నల్గొండ ప్రధాన హాస్పిటల్ రాష్ట్రంలో నంబర్ వన్గా నిలపాలన్నదే తమ లక్ష్యమన్నారు. కార్యక్రమంలో
జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి, డీఆర్డీవో శేఖర్ రెడ్డి, ఆర్డీవో వై.అశోక్ రెడ్డి, హాస్పిటల్ సూపరింటెండెంట్ అరుణ కుమారి, ఆర్ఎంవో, ఇతర అధికారులు పాల్గొన్నారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్సైట్ ను సందర్శించండి. తాజా అప్డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.





