మాల్దీవుల్లో మోదీకి ముయిజ్జు ఘన స్వాగతం

ప్రజాతంత్ర ఇంటర్నెట్‌ డెస్క్‌ : ప్రధానమంత్రి నరేంద్రమోదీ రెండు రోజుల మాల్దీవుల పర్యటనకు వెళ్లారు. ఎయిర్‌పోర్టులో ఆ దేశాధ్యక్షుడు మహ్మద్‌ ముయిజ్జు, విదేశాంగ శాఖ, రక్షణ, ఆర్థిక, హోంశాఖల మంత్రులతో కలిసి స్వాగతం పలికారు. ఇది దక్షిణాసియా దేశానికి భారత నాయకుడి మూడవ పర్యటన. ముఖ్యంగా అధ్యక్షుడు ముయిజ్జు పదవీకాలంలో ఏ దేశాధినేత లేదా ప్రభుత్వం చేసిన మొదటి పర్యటన అవుతుంది. ముయిజ్జు అధ్యక్షుడైన మొదట్లో చైనా అనుకూల విధానాలు అవలంబిస్తూ ’ఇండియా ఔట్‌‘ నినాదాన్ని తీసుకొచ్చారు. ఇందులో భాగంగా మాల్దీవులకు భారత్‌ అందిస్తున్న సైనిక సాయాన్ని వెనక్కి తీసుకోవాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి. అంతేకాక భారత్‌తో కలిసి నిర్వహిస్తున్న ప్రాజెక్టులను కూడా నిలిపివేయాలని మాల్దీవులు నిర్ణయించింది. తన నిర్ణయాల ప్రభావం ఆయనకు త్వరలోనే తెలిసొచ్చింది. దాంతో మనతో సంబంధాలు మెరుగుపర్చుకోవడానికి మొగ్గుచూపడమేగాక గత ఏడాది మన దేశ పర్యటనకు వచ్చిన ఆయన ప్రధాని మోదీని మాల్దీవులకు ఆహ్వానించారు. ఈ నేపథ్యంలో మోదీ పర్యటన ప్రాధాన్యం సంతరించుకుంది. కాగా, అంతకుముందు మోదీ బ్రిటన్‌ పర్యటన విజయవంతమైంది. రెండు దేశాల మధ్య గురువారం చరిత్రాత్మక వాణిజ్య ఒప్పందం (ఎఫ్‌టీఏ) లాంఛనప్రాయంగా కుదిరింది. పహల్గాం దాడిని ఖండిరచినందుకు బ్రిటన్‌కు మోదీ కృతజ్ఞతలు తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *