మోదీ గొప్ప వ్యక్తి , నా మిత్రుడు

– 2026లో భారత్‌లో పర్యటిస్తా
– వాణిజ్య సంబంధాలను పటిష్టం చేస్తా
– డొనాల్డ్‌ ట్రంప్‌ కీలక వ్యాఖ్యలు

న్యూదిల్లీ,నవంబర్‌7: అమెరికా- భారత్‌ మధ్య టారిఫ్‌ ఉద్రిక్తతలు నెలకొన్న వేళ ప్రధాని నరేంద్ర మోదీని ఉద్దేశించి అగ్రరాజ్యం అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రధాని మోదీ గొప్ప వ్యక్తి, తన మిత్రుడు అంటూ కొనియాడారు. అలాగే, ఇరు దేశాల మధ్య వాణిజ్య సంబంధాలను పటిష్టం చేసే ప్రయత్నాల్లో భాగంగా, వచ్చే ఏడాది తాను భారత్‌ను సందర్శించే అవకాశం ఉందని ట్రంప్‌ ప్రకటించారు. వైట్‌హౌస్‌లో  ట్రంప్‌ విలేకరులతో మాట్లాడారు. ఈ సందర్భంగా భారత్‌తో వాణిజ్య చర్చలపై విలేకరులు ప్రశ్నలు అడిగారు. ఈ క్రమంలో మోదీతో తన చర్చలు అద్భుతంగా సాగుతున్నాయని ట్రంప్‌ సమాధానం చెప్పారు. ప్రధాని మోదీ రష్యా నుంచి ఇంధన కొనుగోలును చాలా వరకు ఆపేశారు. ఆయన నాకు మిత్రుడు, మేము మాట్లాడుతుంటాం. మోదీ గొప్ప వ్యక్తి. ఆయన నాకు మిత్రుడు, ఆయన నన్ను అక్కడికి రావాలని ఆహ్వానించారు. నేను తప్పకుండా వెళతాను. పర్యటనను ఖరారు చేస్తామని అన్నారు. తాను భారత్‌కు వెళతానని ట్రంప్‌ చెప్పిన నేపథ్యంలో వొచ్చే ఏడాది వెళ్లే అవకాశం ఉందా? అని విలేకరులు అడిగారు. దీనికి ట్రంప్‌ బదిలిస్తూ ‘ అవును, వచ్చే ఏడాది ఉండొచ్చు’ అని సమాధానం చెప్పారు. వాస్తవానికి భారత్‌?లో జరగాల్సిన క్వాడ్‌ మీటింగ్‌కు ట్రంప్‌ రావాల్సి ఉంది. అయితే ట్రంప్‌ ఇకపై క్వాడ్‌ సమ్మిట్‌ కోసం భారత్‌కి రాకపోవచ్చని అన్నారు. ఈ ఏడాది ఆగస్టులో ఒక వ్యాసంలో పేర్కొంది. భారత్‌తో వాణిజ్య సుంకాల (టారిఫ్‌) వివాదాల నేపథ్యంలో ఆ ప్రయాణాన్ని వాయిదా వేసినట్లు ఆ రిపోర్ట్‌ తెలియజేసింది. అయితే ట్రంప్‌ తాజాగా చేసిన వ్యాఖ్యలు రెండు దేశాల మధ్య సంబంధాలు మళ్లీ సానుకూల దిశలో సాగుతున్నాయనే సంకేతంగా భావించవచ్చు. ప్రస్తుతం భారత్‌ – అమెరికా మధ్య వాణిజ్య చర్చలు కీలక దశలో ఉన్నాయి. ఈ క్రమంలో ట్రంప్‌ నుంచి ఇలాంటి కామెంట్స్‌ రావడం ప్రాధాన్యత సంతరించుకొన్నది. రష్యా చమురును భారత్‌ కొనుగోలు చేస్తున్న నేపథ్యంలో అమెరికా అదనంగా 25 శాతం సుంకాలని విధించిన విషయం తెలిసిందే. ఉక్రెయిన్‌తో యుద్ధం నేపథ్యంలో రష్యాను ఆర్థికంగా ఒంటరి చేయాలని భారత్‌పై ట్రంప్‌ అదనపు సుంకాలను విధించారు. అయితే, తాజాగా భారత్‌ రష్యా నుంచి ఇంధన కొనుగోళ్లను తగ్గించుకోవాలని నిర్ణయించినట్లు ఇటీవల ట్రంప్‌ స్వయంగా ప్రకటించారు. అంతేకాకుండా, ఆగిపోయిన వాణిజ్య చర్చలు కూడా ఫలప్రదంగా సాగుతున్నట్లు వెల్లడిరచారు. దీపావళి రోజు కూడా మోదీకి కాల్‌ చేసి ట్రంప్‌ శుభాకాంక్షలు చెప్పారు. ఈ సందర్భంగా ఇరువురు నేతలు రష్యా చమురు కొనుగోలు, వాణిజ్యంపై చర్చించినట్లు ట్రంప్‌ మరోసారి పునరుద్ఘాటించారు. వైట్‌హౌస్‌ ప్రెస్‌ సెక్రటరీ కరోలిన్‌ లీవిట్‌ కూడా దీనిపై క్లారిటీ ఇచ్చారు. అధ్యక్షుడు ట్రంప్‌ భారత్‌-అమెరికా సంబంధాలపై సానుకూలంగా ఉన్నారని, వైట్‌హౌస్‌లో జరిగిన దీపావళి వేడుకల సందర్భంగా ప్రధాని మోదీతో నేరుగా మాట్లాడారని ధృవీకరించారు. అయితే రష్యా నుంచి భారత్‌ ఇంధన కొనుగోళ్లను తగ్గించుకుంటుందన్న ట్రంప్‌ వ్యాఖ్యలపై భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ ఈ నెల ప్రారంభంలో స్పందించింది. తమ దేశం ఇంధన విధాన నిర్ణయాలు జాతీయ ప్రయోజనాలు, వినియోగదారుల సంక్షేమం ఆధారంగా మాత్రమే ఉంటాయని విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి రణధీర్‌ జైస్వాల్‌ స్పష్టం చేశారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *