జపాన్‌లో కొనసాగుతున్న మోదీ పర్యటన

– టోక్యోలో భారత్‌-జపాన్‌ వార్షిక శిఖరాగ్ర సమావేశం
– క్రిటికల్‌ మినరల్స్‌, రేర్‌ ఎర్త్‌ ఎలిమెంట్స్‌ రంగాల్లో సహకారంపై చర్చలు
-వివరాలు వెల్లడిరచిన కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి

న్యూదిల్లీ, ఆగస్టు 29: భారత్‌-జపాన్‌ మధ్య మైత్రి మరింత బలోపేతం చేసే దిశగా జపాన్‌లో భారత ప్రధాన మంత్రి నరేంద్రమోదీ పర్యటన కొనసాగుతోంది. భారత్‌-జపాన్‌ 15వ వార్షిక శిఖరాగ్ర సమావేశంలో పాల్గొనేందుకు టోక్యో చేరుకున్న ప్రధాని మోదీ జపాన్‌ ప్రధాన మంత్రి షిగేరు ఇషిబాతో కలిసి ద్వైపాక్షిక సంబంధాలపై చర్చించినట్లు కేంద బొగ్గు, గనుల శాఖ మంత్రి కిషన్‌రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. ఇందులో భాగంగా ఆర్థిక, ఆరోగ్య, మొబిలిటీలో భాగస్వామ్యం, ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌, సైన్స్‌ అండ్‌ టెక్నాలజీతోపాటు క్రిటికల్‌ మినరల్స్‌, రేర్‌ ఎర్త్‌ ఎలిమెంట్స్‌ రంగాల్లో పరస్పర సహకారంపై ఇరు దేశాల ప్రతినిధులు కీలకమైన చర్చలు జరిపారన్నారు. అంతర్జాతీయంగా మారుతున్న పరిస్థితుల నేపథ్యంలో ప్రస్తుతం కొనసాగుతున్న ద్వైపాక్షిక సహకారాన్ని మరింత బలోపేతం చేసుకోవాలని నిర్ణయించారన్నారు. కేంద్రం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన నేషనల్‌ క్రిటికల్‌ మినరల్‌ మిషన్‌ను మరింత ముందుకు తీసుకెళ్లే ప్రయత్నంలో భాగంగా భారత గనుల శాఖ, జపాన్‌ ఆర్థిక, వాణిజ్య, పరిశ్రమల మంత్రిత్వ శాఖ మధ్య పరస్పర సహకార ఒప్పందం కుదిరిందని, ఇందులో భాగంగా క్రిటికల్‌ మినరల్స్‌కు సంబంధించి ఓ బలమైన సప్లయ్‌ చైన్‌ను ఏర్పాటు చేసేందుకు భారత్‌ చేస్తున్న ప్రయత్నాలకు మరింత సహకారం అందనుందని వివరించారు. దీని ద్వారా భారత ఇంధన భధ్రత (ఎనర్జీ సెక్యూరిటీ), జాతీయ భద్రత (నేషనల్‌ సెక్యూరిటీ), ఆహార భద్రత (ఫుడ్‌ సెక్యూరిటీ) లక్ష్యాలను చేరుకోవడంతోపాటు 2070 నాటికి నెట్‌ జీరో లక్ష్యాలను చేరుకునేందుకు చేస్తున్న కృషికి సహకారం అందుతుందన్నారు. ఇరు దేశాల మధ్య సన్నిహితమైన సహకారం కోసం మినరల్‌ రిసోర్సెస్‌కు సంబంధించిన సమాచార మార్పిడితోపాటు విధానాలు, నిబంధనలు, క్రిటికల్‌ మినరల్స్‌ ప్రాజెక్టులకు సంబంధించి సంయుక్తంగా చేపట్టాల్సిన కార్యాచరణ, మైనింగ్‌ వేలం, సుస్థిరమైన పద్ధతిలో డీప్‌ సీ మైనింగ్‌, మినరల్స్‌ వెలికితీతకు సంబంధించిన సమాచారం, మినరల్‌ ప్రాసెసింగ్‌, క్రిటికల్‌ మినరల్స్‌ నిల్వ చేసుకోవడం తదితర అంశాలకు సంబంధించిన సహకారంపై చర్చ జరగనుందని పేర్కొన్నారు. క్రిటికల్‌ మినరల్స్‌కు సంబంధించి ఇరు దేశాలు సంయుక్తంగా భారత దేశంలో ఎక్స్‌ప్లొరేషన్‌, మైనింగ్‌, ప్రాసెసింగ్‌ కార్యక్రమాలను చేపట్టడం, సహకారం అందించడం, దీంతోపాటు ఇతర సహకారం విషయంలోనూ పరస్పరం అంగీకారంతో పనిచేయడం తదితర అంశాలు ఈ ఒప్పందంలో ఉన్నాయని కిషన్‌రెడ్డి తెలిపారు.


 

తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *