– స్పీకర్ను కలిసిన ఎమ్మెల్యే కడియం శ్రీహరి
హైదరాబాద్, ప్రజాతంత్ర,నవంబర్ 21:ఎమ్మెల్యే కడియం శ్రీహరి స్పీకర్ గడ్డం ప్రసాద్ను కలిశారు. ఈ నెల 23 లోపు పార్టీ ఫిరాయింపు ఆరోపణలపై వివరణ ఇవ్వాలని స్పీకర్ నోటీసులు ఇచ్చిన నేపథ్యంలో ఆయన కలిశారు. పార్టీ ఫిరాయింపు ఫిర్యాదులకు సమాధానాలు ఇవ్వాల్సిందిగా ఎమ్మెల్యేలు దానం నాగేందర్, కడియం శ్రీహరిలకు శాసన సభాపతి గడ్డం ప్రసాద్కుమార్ మరోసారి నోటీసులు జారీ చేశారు. ఈ నెల 23వ తేదీలోగా సమాధానాలను అఫిడవిట్ రూపంలో స్పీకర్ కార్యాలయంలో అందజేయాలని వాటిలో సూచించారు. గత ఆగస్టులో ఫిర్యాదులొచ్చిన 10 మంది ఎమ్మెల్యేలకు స్పీకర్ నోటీసులు జారీ చేశారు. వారిలో దానం, కడియం మినహా మిగిలిన ఎనిమిది మంది తమ సమాధానాలను అఫిడవిట్ రూపంలో అసెంబ్లీ కార్యదర్శికి దాఖలు చేశారు.ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లపై తక్షణమే వివరణ ఇవ్వాలని కోరుతూ స్టేషన్ ఘన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి, ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్కు స్పీకర్ గడ్డం ప్రసాద్కుమార్ గురువారం మరోసారి నోటీసులు జారీ చేసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో శుక్రవారం ఉదయం స్పీకర్ గడ్డం ప్రసాద్ను ఎమ్మెల్యే కడియం శ్రీహరి కలిశారు. వివరణ ఇచ్చేందుకు మరింత సమయం కావాలని స్పీకర్ను కడియం శ్రీహరి కోరారు. దిల్లీ నుండి రాగానే స్పీకర్ను దానం నాగేందర్ కలవనున్నారు. ఆయన కూడా మరింత సమయం కోరుతారా లేదా రాజీనామా చేస్తారా అనే అంశంపై సందిగ్ధత నెలకొంది.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్సైట్ ను సందర్శించండి. తాజా అప్డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.





