అధికారులకు సీఎస్ ఆదేశం
హైదరాబాద్, జూలై 1 : తెలంగాణ రైజింగ్-2047 లక్ష్యం దిశగా ప్రభుత్వ యంత్రాంగాన్ని సమాయత్తం చేసేందుకు విభాగాల వారీగా కార్యాచరణ ప్రణాళికను సిద్ధం చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.రామకృష్ణారావు అధికారులను ఆదేశించారు. సచివాలయంలో కేంద్ర ప్రభుత్వ సంస్థ ‘మిషన్ కర్మయోగి’ అధికారుల బృందం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నేతృత్వంలో రాష్ట్ర ప్రభుత్వ సీనియర్ ఐఎఎస్, ఐపిఎస్, ఐఎఫ్ఎస్ అధికారులతో మంగళవారం సమావేశమయింది. దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలలో ప్రభుత్వ ఉద్యోగులు, అధికారులు, సిబ్బందికి వారిలో నైపుణ్యాభివృద్ధి పెంచేందుకు మిషన్ కర్మయోగి చేపట్టిన శిక్షణ కార్యక్రమాలను, కెపాసిటీ బిల్డింగ్ కమిషన్ అడ్మినిస్ట్రేషన్ సభ్యురాలు డాక్టర్ అల్కా మిట్టల్ వివరించారు. ఈ సందర్భంగా సీఎస్ రామకృష్ణారావు మాట్లాడుతూ మిషన్ కర్మయోగి సహకారంతో రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, అధికారులు, సిబ్బందికి పలు శిక్షణ కార్యక్రమాలు చేపట్టేందుకు ఆయా శాఖల వారీగా తగు కార్యాచరణ రూపొందించాలని అధికారులను ఆదేశించారు. సమాచార పౌర సంబంధాల శాఖ ఆధ్వర్యంలో మీడియా అకాడమి తరపున ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియా జర్నలిస్టులకు ప్రత్యేక శిక్షణ కార్యక్రమాలు చేపట్టామని ప్రత్యేక కమిషనర్ సిహెచ్.ప్రియాంక వివరించారు. సమాచార శాఖ అధికారులకు, సిబ్బందికి కూడా వృత్తి నైపుణ్యం పెంచే శిక్షణా కార్యక్రమాలు చేపడతామని తెలిపారు. పశుసంవర్ధక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సబ్యసాచి ఘోష్, హోంశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రవి గుప్తా, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి ఎన్.శ్రీధర్, రెవెన్యూ (సిటి అండ్ ఎక్సైజ్) ముఖ్య కార్యదర్శి ఎస్ఎఎం రిజ్వీ, జీఎడి (సర్వీసెస్) కార్యదర్శి మహేష్దత్ ఎక్కా, జిఎడి కార్యదర్శి రఘునందన్రావు, రెవెన్యూ కార్యదర్శి డి.ఎస్.లోకేష్ కుమార్, పిసిసిఎఫ్ సువర్ణ, మహిళా సంక్షేమ కార్యదర్శి అనితారామచంద్రన్, హెచ్ఎండిఎ మెట్రోపాలిటన్ కమిషనర్ సర్ఫరాజ్ అహ్మద్, సెర్ప్ సిఇఒ దివ్య, హౌసింగ్ ప్రత్యేక కార్యదర్శి వి.పి. గౌతమ్ తదితరులు పాల్గొన్నారు.



