– ఒక్క ఇంటికీ నీరు ఇచ్చిన దాఖలాలు లేవు
– రాష్ట్రాన్ని అప్పుల్లో ముంచిన కెసిఆర్ ప్రభుత్వం
– మంత్రి వివేక వెంకటస్వామి విమర్శలు
మంచిర్యాల,ప్రజాతంత్ర,సెప్టెంబర్23: గత బీఆర్ఎస్ ప్రభుత్వం తీసుకొచ్చిన మిషన్ భగీరథ పథకం అట్టర్ ఫ్లాప్ అని మంత్రి వివేక్ వెంకటస్వామి విమర్శించారు. రూ.42 వేల కోట్లతో పథకం తీసుకొచ్చి ఒక్క ఇంటికీ చుక్క తాగు నీరు అందించలేదని అన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వం పథకాల పేరుతో వేల కోట్ల ప్రజా ధనాన్ని దోచుకుందని విమర్శించారు. మందమర్రి కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో 82 మంది లబ్ధిదారులకు మంగళవారం కల్యాణలక్ష్మి, షాది ముభారక్ చెక్కులను మంత్రి వివేక్ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత పదేండ్ల బీఆర్ఎస్ పాలనలో అక్రమ కేసులు, అక్రమ అరెస్ట్లతో కేసీఆర్ రాచరిక పాలన సాగించాడని విమర్శించారు. రాష్ట్రాన్ని రూ.8 లక్షల కోట్ల అప్పుల్లో ముంచాడని ఆగ్రహం వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన అప్పుకు నెలకు రూ.5 వేల కోట్ల వడ్డీ కాంగ్రెస్ ప్రభుత్వం చెల్లిస్తుందని తెలిపారు. కేసీఆర్ తీసుకున్న అనాలోచిత నిర్ణయాలతో తెలంగాణ రాష్ట్ర ఖజానా ఖాలీ అయిందని ఫైర్ అయ్యారు. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో ఇచ్చిన హాలను ఒక్కొక్కటిగా అమలు చేస్తుందన్నారు. గత ప్రభుత్వంలో కేవలం బీఆర్ఎస్ లీడర్లకే డబుల్ బెడ్ రూమ్ ఇండ్లను కేటాయించారని.. కానీ కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక అర్హులైన పేదలకు డబుల్ బెడ్ రూం ఇళ్లు ఇవ్వాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశానని తెలిపారు. రూ.9 వేల కోట్ల ఖర్చు చేసి పేదలకు సన్న బియ్యం పంపిణీ చేస్తున్నామన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో పదేండ్లలో ఒక్క రేషన్ కార్డు, డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు ఇవ్వలేదని విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక 17 లక్షల రేషన్ కార్డులు ఇచ్చామని తెలిపారు. బీఆర్ఎస్ ప్రభుత్వం సింగరేణి బొగ్గు గనుల ఆక్షన్లో పాల్గొనకుండా చేసిందని.. దీంతో ఈ ప్రాంత ప్రజలు ఉద్యోగాలు కోల్పోయారని ఆగ్రహం వ్యక్తం చేశారు. గతంలో మందమర్రి ప్రాంతంలో రోడ్లు, డ్రైనేజీలు అధ్వానంగా ఉండేవని.. తానొచ్చాక రూ.50 కోట్లతో అభివృద్ధి చేపట్టానని తెలిపారు. కమీషన్ల కోసమే గత ప్రభుత్వం పెద్ద పెద్ద కట్టడాలు నిర్మించిందని ఆరోపించారు.అమృత్ స్కీంతో మందమర్రి ప్రజలకు శాశ్వత మంచినీటి సౌకర్యం కలుగుతుందని చెప్పారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్సైట్ ను సందర్శించండి. తాజా అప్డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.




