సరూర్ నగర్ విక్టోరియా హోమ్ లోని సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూల్ విద్యార్థులతో గురువారం మిస్ వరల్డ్ కాంటెస్టర్లు కలిసి ముచ్చటించారు. తమ లక్ష్యాలు సాధించే దిశగా వసతి గృహం విద్యార్థులలో ఆత్మవిశ్వాసాన్నికలిగించారు. మిస్ వరల్డ్ పోటీల్లో పాల్గొంటున్న 107 మంది కాంటెస్టర్లు, ప్రస్తుత మిస్ వరల్డ్ క్రిస్టినా జేకొవా తోకలసి గురువారం ఉదయం సరూర్ నగర్ లోని విక్టోరియా హోమ్ సందర్శించి ఇక్కడి ప్రభుత్వ హాస్టల్లో ఉంటున్న విద్యార్థులను కలిసి వారితో ముచ్చటించారు. కష్టపడే తత్వం విజ్ఞాన సముపార్జనతోపాటు విద్యలో రాణిస్తేనే శక్తివంతంగా మారతారని పేర్కొన్నారు.
ఉన్నత స్థానాలకు చేరుకోవాలన్న పటిష్టమైన కలలు ఉంటేనే తమ లక్ష్యాలను చేరుకుంటారని కంటెస్టర్లు విద్యార్థులతో అన్నారు. ఈ సందర్భంగా విక్టోరియా హోమ్ విద్యార్థినులకు పలు బహుమతులను, వారికి నిత్య జీవితంలో ఉపయోగపడే వస్తువులను మిస్ వరల్డ్ ప్రతినిధులు బహుకరించారు. ఈ సందర్భంగా విక్టోరియా హోమ్ విద్యార్థినులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాల్లో మిస్ వరల్డ్ కాంటెస్టర్లు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన కంప్యూటర్ లాబ్ ను వారు ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మిస్ వరల్డ్ చైర్మన్ మోర్లే పర్యాటకశాఖ డైరెక్టర్ హనుమంతు, రాచకొండ సిపి, ఎస్సీ వెల్ఫేర్ అడిషనల్ డైరెక్టర్ ఉమాదేవి శ్రీనివాస్ రెడ్డి, జిహెచ్ఎంసి జోనల్ కమిషనర్ లతోపాటు వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.



