– మరో రెండు కేసుల్లో హాజరీ నుంచి మినహాయింపు
– హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు
హైదరాబాద్, ప్రజాతంత్ర, జులై 16 అసెంబ్లీ ఎన్నికలప్పుడు ఎన్నికల ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించారంటూ మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డిపై నమోదైన కేసుల్లో హైకోర్టులో వెసులుబాటు లభించింది. నమోదైన మూడు కేసుల్లో ఒకదానిని కొట్టివేసింది. మిగిలిన రెండు కేసుల్లో విచారణకు వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపు ఇచ్చింది. విచారణను ఈ నెల 18కి వాయిదా వేస్తూ ప్రతివాదులు కౌంటర్లు దాఖలు చేయాలని నోటీసులు జారీ చేసింది. ఈమేరకు న్యాయమూర్తి జస్టిస్ కె.లక్ష్మణ్ బుధవారం మధ్యంతర ఉత్తర్వులను వెలువరించారు. 2019 హుజూర్నగర్ ఉప ఎన్నిక సందర్భంగా తన భార్య పద్మావతికి మద్దతుగా ప్రచారం చేసే క్రమంలో ఎన్నికల నిబంధనలను ఉల్లంఘించి రోడ్ షో నిర్వహించారని, మఠంపల్లి చౌరస్తాలో భారీ జనసమీకరణ జరిగిన సమావేశంలో ప్రసంగించారని పోలీసులు వేర్వేరు కేసులు నమోదు చేశారు. నేరేడుచర్లలో, మఠంపల్లిలో మూడు కేసులను నమోదు చేయడాన్ని ఉత్తమ్కుమార్రెడ్డి హైకోర్టులో సవాలు చేశారు. రాజకీయ కక్షతో గత బీఆర్ఎస్ ప్రభుత్వం కేసు నమోదు చేసిందని ఆయన తరపు న్యా యవాది వాదనలు వినిపించారు. నేరేడుచర్లలో నమోదైన కేసు కొట్టివేసిన హైకోర్టు మరో రెండు కేసుల్లో ప్రతివాదులకు నోటీసులు చేసింది.





