– రెవెన్యూ, హౌసింగ్, సమాచార శాఖల మంత్రి పొంగులేటి\
హైదరాబాద్, ప్రజాతంత్ర, డిసెంబర్ 18: మహాత్మాగాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం(ఎంజీ నరేగా)లో గాంధీ పేరును తొలగించడం ఆయనను అవమానించినట్లేనని రెవెన్యూ, హౌసింగ్, సమాచార, పౌరసంబంధాల శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. నిరుపేద కుటుంబాలకు అండగా నిలవాలన్న లక్ష్యంతో 2005లో ఆనాటి యూపీయే ప్రభుత్వం చరిత్రాత్మకమైన ఉపాధి హామీ పథóకాన్ని తీసుకొస్తే గత పదేళ్లుగా బీజేపీ ప్రభుత్వం ఆ పథóకానికి తూట్లు పొడుస్తూ నీరుగారుస్తోందని ఒక ప్రకటనలో విమర్శించారు. మహాత్మా గాంధీ పేరును తొలగించి రాష్ట్రాలపై 40 శాతం భారాన్ని నెట్టడం పేదల పొట్ట కొట్టడమేనని దుయ్యబట్టారు. గురువారం పార్లమెంటులో ప్రవేశపెట్టిన బిల్లు అభివృద్ది తిరోగమనమేనని, రాష్ట్రాలపై మోయలేని భారమని అన్నారు. దేశ గ్రామీణ ఆర్థిక వ్యవస్థకు వెన్నెముకగా నిలిచిన ఉపాధి హామీ చట్టాన్ని వికసిత్ భారత్-గ్యారెంటీ ఫర్ రోజ్గార్ అండ్ ఆజీవిక మిషన్ (వీబీ-జీ-రామ్ జీ)గా మార్చడం అన్యాయమన్నారు. లోక్సభలో బలవంతంగా గురువారం ఆమోదించిన ఈ కొత్త బిల్లు పథకం స్వభావాన్ని, నిధుల సమీకరణను పూర్తిగా మార్చివేసిందని విమర్శించారు. పథకం పేరు మార్చడం వెనుక కేంద్ర పాలకుల సంకుచిత మనస్తత్వం కనిపిస్తోందని, పేరు మార్చినంత మాత్రాన వారి వైఫల్యాలను కప్పిపుచ్చుకోలేరన్నారు. వికసిత్ భారత్ అని నినాదాలు ఇస్తూ గ్రామీణ భారతానికి వెన్నెముకగా ఉన్న పథకాన్ని అగాధంలోకి నెడుతున్నారని మంత్రి పొంగులేటి ఆగ్రహం వ్యక్తం చేశారు. తక్షణమే కేంద్రం తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్సైట్ ను సందర్శించండి. తాజా అప్డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.



