– రెవెన్యూ యంత్రాంగానికి ఆదేశాలు
– భారీ వర్షాల నేపథ్యంలో కలెక్టర్లతో మంత్రి పొంగులేటి
హైదరాబాద్, ప్రజాతంత్ర, ఆగస్టు 13: భారీ వర్షాల వలన జనజీవనానికి ఆటంకం లేకుండా తక్షణ చర్యలు చేపట్టాలని రెవెన్యూ, విపత్తుల నిర్వహణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి రెవెన్యూ అధికారులను ఆదేశించారు. రాష్ట్రంలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలు మరో నాలుగు రోజులపాటు కొనసాగుతాయన్న వాతావరణ శాఖ హెచ్చరికల నేపధ్యంలో రెవెన్యూ యంత్రాంగం పూర్తిస్ధాయిలో అప్రమత్తంగా ఉండాలన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సూచనలకనుగుణంగా భారీ వర్షాల వల్ల ప్రజలకు ఇబ్బంది కలగకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని సూచించారు. లోతట్టు ప్రాంతాలు, వరద ముంపు ప్రాంతాల్లో ప్రత్యేకంగా చర్యలు చేపట్టాలన్నారు. ముఖ్యంగా విపత్తుల నిర్వహణ శాఖ ఆయా జిల్లాల్లో ఇరిగేషన్, విద్యుత్, పంచాయతీరాజ్, రహదారులు, పోలీస్ విభాగాలతో కలిసి సమన్వయంతో పనిచేయాలని సూచించారు. ప్రతి జిల్లా కేంద్రంలో కంట్రోల్ రూమ్లు నిరంతరం పనిచేసేలా చూడాలన్నారు. రాష్ట్రంలోని వివిధ జిల్లాల్లో పరిస్ధితి గురించి ఆరా తీశారు. భారీ వర్షాలు కురుస్తున్న హనుమకొండ, వరంగల్, జనగాం, మహబూబాబాద్, భూపాలపల్లి తదితర జిల్లాలపై ఎక్కువ దృష్టి సారించాలన్నారు. ప్రజలతో నేరుగా సంబంధం ఉండే రెవెన్యూ విభాగం నిరంతరం పనిచేసే విధంగా చర్యలు తీసుకోవాలని, ప్రజాజీవనానికి ముఖ్యంగా రాకపోకలకు ఆటంకం లేకుండా చేయాలని అధికారులను మంత్రి పొంగులేటి ఆదేశించారు.





