– గోదావరి పుష్కరాలను మరింత ఘనంగా నిర్వహించాలి
–సమన్వయంతో పనిచేశారు…భేష్
–అధికార్లను ప్రశంసించిన మంత్రి దుద్దిళ్ల శ్రీధర్బాబు
రాబోయే గోదావరి పుష్కరాలను దృష్టిలో ఉంచుకుని ‘సరస్వతి పుష్కరాల’ నిర్వహణను ప్రభుత్వం ఒక సవాలుగా తీసుకోవడమే కాదు, అత్యంత ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించేందుకు రూ. 40 కోట్లు కేటాయించిందని ఐ.టి.శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్బాబు అన్నారు. శనివారం కాళేశ్వరంలో ఏర్పాటు చేసిన “సరస్వతి పుష్కరాలు – డే ఆఫ్ థ్యాంక్స్” లో ఆయన మాట్లాడారు. ప్రభుత్వం ఆలోచన మాత్రమే చేస్తుంది. ఆచరణలో పెట్టాల్సింది అధికార్లు మాత్రమే. మీరు క్షేత్రస్థాయిలో చిత్తశుద్ధితో పనిచేస్తేనే అది విజయవంతమవుతుందన్నారు. ప్రభుత్వానికి మంచి పేరు వస్తుందన్నారు. నిజానికి పుష్కరాల నిర్వహణ అంత తేలిక కాదు. ఏ చిన్న పొరపాటు జరిగినా, నిర్లక్ష్యంగా ఉన్నా జరిగే నష్టం అంతా ఇంతా కాదు. పైగా ఎన్నికల కోడ్ కూడా అమల్లోకి వచ్చింది. మనకు చాలా తక్కువ సమయం మాత్రమే దొరికింది. అయినా మీరంతా కష్టపడి ఒకరికొకరు సమన్వయం చేసుకుని ఒక టీం వర్క్ లా పనిచేసి పుష్కరాలను అత్యంత విజయవంతంగా నిర్వహించారని అధికార్లను ప్రశంసించారు. సుమారు 30 లక్షల మంది భక్తులు పుణ్యస్నానాలు ఆచరించి ఆ కాళేశ్వర ముక్తీశ్వర స్వామి వారిని ఎలాంటి ఇబ్బందులు లేకుండా దర్శించుకున్నారంటే మీరు చూపిన చొరవ, శ్రమ మాత్రమే కారణమన్నారు. జిల్లా కలెక్టర్, ఎస్పీ మార్గ నిర్దేశనంలో 33 శాఖలకు చెందిన అటెండర్ నుంచి జిల్లా, రాష్ట్ర స్థాయి అధికారి వరకూ ప్రతి ఒక్కరూ మూడు నెలలు కష్టపడ్డారు.
పుష్కరాలు విజయవంతం కావడంలో కీలక పాత్ర పోషించారంటూ అందరికీ అభినందనలు తెలిపారు.భద్రత, నీటి సరఫరా, అన్నదానం, మెడికల్ సౌకర్యాలు, శౌచాలయాలు, విద్యుత్, పారిశుధ్యం ఇలా అన్ని ఏర్పాట్లను పకడ్బందీగా చేసి భక్తులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా చేశారన్నారు. మీ చొరవ వల్లే తెలంగాణలో తొలిసారిగా కాశీ పండితుల చేతుల మీదుగా ప్రతి రోజు సాయంత్రం నిర్వహించిన ‘‘సరస్వతి నవరత్న మాలా హారతి‘‘ కార్యక్రమం మొత్తం పుష్కరాలకే ప్రధాన ఆకర్షణగా నిలిచింది. ఇందుకు మీ అందరికీ మరోసారి ప్రత్యేక అభినందనలు తెలుపుతున్నానన్నారు. ఈ పుష్కరాల ద్వారా ఆర్టీసీకి సుమారు రూ.10 కోట్ల ఆదాయం వచ్చింది. ఆర్టీసీ బస్సుల్లో “ఉచిత ప్రయాణం” అవకాశాన్ని వినియోగించుకొని లక్షలాది మంది సోదరీమణులు పుష్కరాలకు విచ్చేశారు. కొందరూ సరస్వతి పుష్కరాలు విజయవంతం కాకుండా చేయాలని కుట్రలు పన్నారు. చిన్న చిన్న అంశాలను భూతద్దంలో చూపించి మమ్మల్ని బద్నాం చేసే ప్రయత్నం చేశారు.
మీడియా మిత్రుల సహకారం గురించి ఈరోజు ప్రత్యేకంగా చెప్పుకోవాలి. ఎప్పటికప్పుడు పుష్కరాలకు సంబంధించిన సమాచారాన్ని భక్తులకు తెలియజేసి విజయవంతం కావడంలో కీలక పాత్ర పోషించారు. ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా మిత్రులకు పేరుపేరునా ధన్యవాదాలన్నారు. మీ సహకారం ఎప్పటికీ ఇలాగే కొనసాగాలన్నారు. స్వచ్ఛంద సంస్థల కృషి ప్రశంసనీయం. వారికి ప్రభుత్వం తరఫున ధన్యవాదాలు. ఇది మొదటి అడుగు మాత్రమే. 2027లో రానున్న గోదావరి పుష్కరాలను మరింత ఘనంగా నిర్వహించాలన్నదే మా ప్రభుత్వ సంకల్పం. ఈ విషయంలో అసలు రాజీ పడబోం. ఈ పుష్కరాల్లోని లోటుపాట్లను గుర్తించి అవి పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాల్సిన గురుతర బాధ్యత మనపై ఉంది. ముఖ్యంగా మీ పాత్ర కీలకం. ప్రభుత్వం మీవెంట వుంటుందన్నారు. కాళేశ్వరానికి వెళ్లే జాతీయ రహదారిని నాలుగు లేన్లుగా అభివృద్ధి చేసేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. త్వరలో కాళేశ్వరం, ఇతర ప్రాంతాల్లో కొత్త బస్సు డిపోల నిర్మాణానికి శ్రీకారం చుడతామన్నారు. ఈ పుష్కరాల స్ఫూర్తితో అధికారులు మరింత జోష్ తో, టీం వర్క్ తో ప్రభుత్వ సంక్షేమ పథకాలు, ఆలోచనలు, ప్రాధాన్యాలు, అభివృద్ధి పనులను క్షేత్రస్థాయిలో విజయవంతంగా అమలు చేసి ప్రభుత్వానికి మంచి పేరు తీసుకురావాలన్నారు.





