– పలు నిర్మాణ పనుల పరిశీలన
అందోల్, ప్రజాతంత్ర, జులై 24: రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ ఆందోల్ నియోజకవర్గంలో గురువారం పర్యటించారు. పర్యటనలో భాగంగా చౌటుకూరు మండల కేంద్రంలో ఓ హోటల్లో స్థానిక నాయకులతో మాట్లాడారు. హోటల్లో ఆకస్మిక తనిఖీ చేసి వంటకాలను పరిశీలించారు. ఫుడ్ సేఫ్టీ నిబంధలను పాటించాలని నిర్వాహకులకు సూచించారు. నిర్మాణంలో ఉన్న కేజీబీవీ స్కూల్ పనులను పరిశీలించి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం, పోలీస్ స్టేషన్ నిర్మాణాల కోసం స్థల పరిశీలన చేశారు. అనంతరం సుల్తాన్పూర్ జేఎన్టీయూ కాలేజీ ప్రహరీగోడ నిర్మాణ పనులను పరిశీలించారు. జేఎన్టీయూ విద్యార్థులకు మంత్రి సహకారంతో అందించిన వంద సైకిళ్లను పరిశీలించారు. ఈ సందర్బంగా మంత్రి దామోదర స్వయంగా సైకిల్ నడిపి ఆనందం వ్యక్తం చేశారు. కాలేజీలో అధునాతన ఆడిటోరియంను, 200 అడుగుల టవర్ను, అత్యాధునిక సైన్స్ ల్యాబ్లను నిర్మిస్తున్నామన్నారు. అనంతరం జోగిపేటలో నర్సింగ్ కాలేజీ నిర్మాణాన్ని పరిశీలించి పనులను శరవేగంగా పుర్తిచేయాలని అధికారులను ఆదేశించారు. ఈ పర్యటనలో మంత్రి వెంట ఆర్డీవో పాండు, మండల రెవెన్యూ అధికారులు, ఇంజనీరింగ్ అధికారులు ఉన్నారు.





