– బస్సు ప్రమాద బాధిత కుటుంబాలకు అండ
– సహాయక చర్యలను సమన్వయం చేస్తున్న మంత్రి
మదీనా/న్యూదిల్లీ, నవంబర్ 19: సౌదీ అరేబియాలో ఇటీవల జరిగిన బస్సు ప్రమాదంపై వివరాలు తెలుసుకునేందుకు బాధితులకు బాసటగా ఉండేందుకు రాష్ట్ర మైనారిటీ సంక్షేమం, పబ్లిక్ ఎంటర్ప్రైజెస్ మంత్రి మొహమ్మద్ అజారుద్దీన్ సోమవారం రాత్రి మదీనా చేరుకున్నారు. అక్కడ సహాయక చర్యలను సమన్వయం చేస్తున్నారు. మైనారిటీ సంక్షేమ కార్యదర్శి బి.షఫియుల్లా, ఎమ్మెల్యే మాజిద్ హుస్సేన్లతో కలిసి జెడ్డాలోని భారత కాన్సుల్ జనరల్ ఫహద్ అహ్మద్ ఖాన్ సూరి, సౌదీలోని సీనియర్ అధికారులతో నిరంతర మాట్లాడుతున్నారు. అంతకుముందు రియాద్లో సౌదీ అరేబియాలోని భారత రాయబారి డాక్టర్ సుహెల్ అజాజ్ ఖాన్ను కూడా కలిశారు. పరిస్థితిని వివరించి సహకారం కోరారు. మంత్రి అజారుద్దీన్ సౌదీ అరేబియాలో తనకున్న వ్యక్తిగత పరిచయాలను ఉపయోగించి అన్ని లాంఛనాలు, అనుమతులు, లాజిస్టికల్ అవసరాలు ఆలస్యం లేకుండా వేగవంతంగా చేస్తున్నారు. క్షేత్రస్థాయిలో వివిధ ఏజెన్సీలతో సమన్వయం చేస్తున్నారు. బస్సు ప్రమాదంలో ప్రాణాలతో బయటపడిన షోయెబ్ కుటుంబ సభ్యుడిని కూడా కలిశారు. అతనికి అన్ని విధాల అండగా ఉంటామని హామీ ఇచ్చారు. అంత్యక్రియల్లో పాల్గొనడానికి మదీనాకు చేరుకున్న మృతుల కుటుంబ సభ్యులను మంత్రి కలిసి మట్లాడారు. ఆ కుటుంబ సభ్యులతోపాటు రాష్ట్ర మైనారిటీ సంక్షేమ శాఖ అధికారులు కూడా మదీనా చేరుకొని వారి ప్రయాణం, వసతి, ఇతర ఏర్పాట్లను పర్యవేక్షించారు. అంతేకాక వారు మృతదేహాల గుర్తింపు, డీఎన్ఏ మ్యాచింగ్ ప్రక్రియను కూడా సులభతరం చేస్తున్నారు. సాధ్యమైనంత త్వరగా లాంఛనాలను పూర్తి చేయడానికి, స్థానిక విధానాలు, కుటుంబ ప్రాధాన్యతలకు అనుగుణంగా అంత్యక్రియలు నిర్వహించడానికి వీలుగా రాష్ట్ర ప్రభుత్వ ప్రతినిధి బృందం సౌదీ అధికారులతో 24 గంటలూ కలిసి పనిచేస్తోంది. మంత్రి అజారుద్దీన్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో నిరంతరం మాట్లాడుతూ అక్కడ తీసుకుంటున్న చర్యల గురించి వివరిస్తున్నారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్సైట్ ను సందర్శించండి. తాజా అప్డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.





