సామాన్యుల‌పై మ‌ధ్య‌ప్రాచ్య యుద్ధ మంట‌ల భారం!!

ఇరాన్‌, అమెరికా-ఇజ్రాయిల్ ల మ‌ధ్య జ‌రుగుతున్న యుద్ధం ఎంత‌కాలం కొన‌సాగుతుందో తెలియ‌డంలే దు. దీనివ‌ల్ల మ‌ధ్య‌ప్రాచ్యాన్ని యుద్ధాగ్నిజ్వాల‌లు ద‌హించి వేస్తుంటే, ఇంధ‌నంపైనే ఆధార‌ప‌డిన మాన‌వ పురోగ‌తి ఇప్పుడు చ‌మురు సంక్షోభాగ్నిలో విల‌విల‌లాడుతోంది. ఇరాన్‌ను తేలిగ్గా లొంగ‌దీసుకోవొచ్చ‌నుకున్న ట్రంప్‌కు ఇప్పుడు ఇరాన్ స‌త్తా ఏంటో తెలిసొస్తున్నది . త‌ర్వాతి కాలంలో లొంగుతుందా లేదా అన్న‌ది త‌ర్వాతి సంగ‌తి, ప్ర‌స్తుతానికి మాత్రం ఇష్టం వొచ్చిన రీతిలో స‌హ‌చ‌ర ముస్లిందేశాల‌పైనే దాడులు చేస్తూ, వారిని నిద్ర పోనివ్వడంలేదు. ఫ‌లితంగా మొత్తం గ‌ల్ఫ్ దేశాలు, అవి ఉత్ప‌త్తి చేసే చ‌మురుపై ఆధార‌ప‌డిన దేశాల ప‌రిస్థి తి క్ర‌మంగా ద‌య‌నీయంగా మారుతోంది.

   యుద్ధం మ‌రో నెల‌రోజులు కొన‌సాగితే ప్ర‌పంచ ఆర్థిక వ్య‌వ‌స్థ‌లు పూర్తిగా ప‌త‌నం అంచుకు చేరుకోవ‌డం ఖాయంగా క‌నిపిస్తున్న‌ది. యుద్ధం ప్రారంభ‌మ‌యి వారం పూర్తి కాక మునుపే పెట్రోల్ ధ‌ర‌లు బ్యార‌ల్‌కు 114-119 డాల‌ర్లు ప‌ల‌కుతుండ‌టం రాబోయే కాలం ఎంత దుర్భ‌రంగా ఉండబోతున్న‌దీ తెలియ‌జేసే ప్ర‌మాద ఘంటిక‌గా భావించాలి. ఇప్ప‌టికే ప‌లు దేశాల్లో పెట్రోల్ ధ‌ర‌లు విప‌రీతంగా పెర‌గ‌డంతో సామాన్యులు విల‌విల‌లాడుతున్నారు. మార్చి 9 నాటికి అమెరికాలో పెట్రోల్ ధ‌ర‌లు గ్యాల‌న్‌కు 23 నుంచి 50 సెంట్ల‌కు, డీజిల్ ధ‌ర 80 సెట్ల‌కు పెర‌గ‌డం తాజా ప‌రిణామం.ఇప్ప‌టికే ట్రంప్ అడ్డగోలుగా విధిస్తున్న టారిఫ్‌ల పుణ్య‌మాని ద్ర‌వ్యోల్బ‌ణం పెరిగిపోయి అల్లాడుతున్న అమెరిక‌న్ల‌కు ఈ ప‌రిణామం మ‌రింత క‌ష్టాల్లోకి నెట్ట‌నుంది. స‌హ‌జ‌వాయు ధ‌ర‌లు పెరిగిన ప్ర‌భావంతో కేవ‌లం వారం రోజుల్లోనే యు.కె. వంటి దేశాల్లో  విద్యుత్‌, హీటింగ్ బిల్లులు రెట్టింపు వొస్తుండ‌టంతో ప్ర‌జ‌లు గ‌గ్గోలు పెడుతున్నారు. ర‌వాణాకు ఇంధ‌నం అత్య‌వ‌స‌రం క‌నుక‌,  ర‌వాణా చార్జీలు పెర‌గ‌డం వ‌ల్ల నిత్యావ‌స‌ర స‌రుకుల ధ‌ర‌లు కూడా ఆకాశ‌న్నంట‌డం ఖాయం.
    మ‌ధ్య‌ప్రాచ్య దేశాల్లో ర‌సాయ‌న ఎరువుల‌కు సంబంధిచింన నైట్రోజ‌న్‌, ఫాస్ఫేట్‌, పోటాష్‌ల ఉత్ప‌త్తి అధికంగా జ‌రుగుంది. యుద్ధం పుణ్య‌మాని ఇప్ప‌టికే యూరియా (నైట్రోజ‌న్‌) ధ‌రల్లో 21% పెరుగుద‌ల న‌మోదైంది. ఇది ఆహార ఉత్ప‌త్తిపై ప్ర‌తికూల ప్ర‌భావం చూప‌క‌మాన‌దు. భార‌త్ వంటి దేశాల్లో నిర్మాణ రంగంపై ఈ పెరుగుద‌ల ప్ర‌భావం తీవ్రంగా ఉండనుంది. ముఖ్యంగా సిమెంట్‌, ఇత‌ర నిర్మాణ సామ‌గ్రి ర‌వాణా ఖ‌ర్చులు విప‌రీతంగా పెరిగే ప్ర‌భావం కొత్త‌గా ఇళ్లు నిర్మించుకునేవారికి, రియ‌ల్ ఎస్టేట్ రంగంలో నిర్మాణ వ్యయం విప‌రీతంగా పెరిగి, మ‌ధ్య‌త‌ర‌గ‌తి వారికి సొంతిల్లు అనేది ఒక క‌ల‌గానే మిగిలిపోయే ప్ర‌మాద‌ముంది. దీంతోపాటు చ‌మురు దిగుమ‌తిపై అత్య‌ధికంగా ఆధార‌ప‌డే భార‌త్ వంటి దేశాల క‌రెన్సీ విలువ ప‌డిపోయి, ఇంపోర్టెడ్ వ‌స్తువుల రేట్లు భ‌గ్గుమ‌నే స్థాయికి చేరుకునే అవ‌కాశాలున్నాయి.
యుద్ధం కార‌ణంగా మ‌ధ్య‌ప్రాచ్య దేశాలు త‌మ గ‌గ‌న‌త‌లాన్ని మూసివేయ‌డంతో, వివిధ విమాన‌యాన సంస్థ లు త‌మ విమానాల రూట్ల‌ను మార్చుకోవాల్సి రావ‌డం, పెరుగుతున్న ధ‌ర‌ల‌కు అనుగుణంగా చ‌మురుకు చెల్లింపులు జ‌ర‌పాల్సి రావ‌డంతో,  విమానాల రాక‌పోక‌ల్లో ఆల‌స్యంతో పాటు, త‌మ క‌స్ట‌మ‌ర్ల‌పై పెరిగిన ధ‌ర‌ల మేర‌ రేట్ల బాదుడు మొదలు పెడ‌తాయి. ఫ‌లితంగా విమాన‌యానం సామాన్యుల‌కు మ‌రింత భారం కానుంది. ఈ నేప‌థ్యంలో కొన్ని దేశాలు ఇప్ప‌టికే క‌ఠిన‌చ‌ర్య‌ల‌కు ఉప‌క్రమించాయి. ఉదాహ‌ర‌ణ‌కు బంగ్లాదేశ్ ఇంధ‌న సంక్షోభాన్ని త‌ట్టుకునేందుకు పాఠ‌శాల‌ల‌కు సెల‌వులు ప్ర‌క‌టించింది. విద్యుత్ పొదుపు కోస‌మే ఈ చ‌ర్య తీసుకున్న‌ద‌ని వేరే చెప్పాల్సిన అవ‌స‌రం లేదు.  పాకిస్తాన్‌లో లీట‌రు పెట్రోల్ కు 55 పైసలు పెరిగి రూ.321.17కు, హైస్పీడ్ డీజిల్ ధ‌ర రూ.335.86కు చేరుకుంది.  యూర‌ప్ దేశాల్లో డీజిల్ ధ‌ర‌లు రెట్టింప‌య్యాయి. ఉత్త‌ర ఐర్లాండ్‌లో హీటింగ్ ఆయిల్ ధర‌లు కొద్ది రోజుల్లోనే 1/3వ వంతు పెరిగాయి. గ‌త  30 ఏళ్ల‌లో తొలిసారి ద‌క్షిణ కొరియా చ‌మురు ధ‌ర‌ల‌పై ప‌రిమితి విధించింది. ముఖ్యంగా వినియోగ‌దారుల‌ను పెరుగుతున్న చ‌మురు ధ‌ర‌ల నుంచి కాపాడ‌టం కోసం ఈ చ‌ర్య తీసుకున్న‌ట్టు అధికార వ‌ర్గాలు తెలిపాయి. మ‌న‌దేశంలో మాత్రం చ‌ము రు ఇప్ప‌టివ‌ర‌కు ఎటువంటి పెరుగుద‌ల న‌మోదు చేయ‌లేదు. మ‌న‌వ‌ద్ద ఉన్న  చ‌మురు నిల్వ‌లు, ర‌ష్యా నుంచి మ‌రింత చ‌మురు కొనుగోలుకు చ‌ర్య‌లు తీసుకోవ‌డం ఇందుకు కార‌ణం.  మ‌న‌దేశానికి చెందిన ప్రైవేటు కంపెనీలు యు.ఎస్‌. ఆంక్ష‌ల భ‌యంతో ర‌ష్యా నుంచి చ‌మురు కొనుగోలు చేయ‌డంలేదు. ప్ర‌భుత్వ చ‌మురు కంపెనీలు య‌దేచ్ఛ‌గా చమురు కొనుగోలు జ‌రుపుతుండ‌టం గ‌మ‌నార్హం.  ఇండొనేసియా ప్ర‌భుత్వం కూడా చ‌మురు ధ‌ర‌లు పెర‌గ‌కుండా, బ‌డ్జెట్‌లో త‌గిన కేటాయింపులు జ‌రిపేందుకు నిర్ణ‌యించింది.  ఇక వియ‌త్నాం పెట్రోలియం దిగుమ‌తుల‌పై విధించే ప‌న్నును పూర్తిగా ఎత్తివేసింది. ప్ర‌పంచ మార్కెట్‌లో చ‌మురు ధ‌ర‌ల ప్ర‌భావం దేశ ప్ర‌జ‌లు, ఆర్థిక వ్య‌వ‌స్థ‌పై ప‌డ‌కుండా చేసేందుకు ఈ చ‌ర్య తీసుకుంది.
యుద్ధం ఇలాగే కొన‌సాగి, చ‌మురు ధ‌ర‌లు బ్యార‌ల్‌కు 120 డాల‌ర్ల‌కు చేరిన‌ట్ల‌యితే, ప్ర‌పంచంలోని అనేక దేశాల ఆర్థిక‌వ్య‌వస్థ‌లు కుప్ప‌కూలిపోయే ప్ర‌మాద‌ముంద‌ని ఆర్థిక విశ్లేష‌కులు హెచ్చ‌రిస్తున్నారు.  పాకిస్తాన్‌, శ్రీ‌లంక‌, అర్జంటీనా, ఈజిప్టు, ట్యునీసియా, ట‌ర్కీ వంటి దేశాల్లో ద్ర‌వ్యోల్బ‌ణ ప్ర‌భావంతో తీవ్ర ఇబ్బందుల‌కు గురయ్యే అవ‌కాశ‌ముంది. మ‌న‌దేశం విష‌యానికి వొస్తే చ‌మురు ధ‌ర‌ల పెరుగుద‌ల వ‌ల్ల వాణిజ్య‌లోటు విప‌రీతంగా పెరిగిపోయి, రూపాయి విలువ గ‌ణ‌నీయంగా ప‌డిపోయే ప్ర‌మాద‌ముంది.
ఇక థాయ్‌లాండ్‌, ఫిలిప్పీన్స్ దేశాలు చ‌మురు దిగుమ‌తుల‌పై తీవ్రంగా ఆధార‌ప‌డ‌టం వ‌ల్ల వాటి ఆర్థిక ప‌రిస్థితి కోలుకోలేని రీతిలో దెబ్బ‌తినే ద‌శ‌కు చేరుకుంది.  ద‌క్షిణ కొరియా, జ‌పాన్‌లు 80% చ‌మురు దిగుమ‌తుల‌పైనే ఆధార‌ప‌డుతున్నాయి. ప‌శ్చిమాసియా సంక్షోభంతో ఇప్ప‌టికే జ‌పాన్‌కు చెందిన  నిక్కీ ఇండెక్స్ 5% ప‌డిపోయింది.  యుద్ధం అంతూపొంతూ లేకుండా కొన‌సాగితే భ‌విష్య‌త్తులో బ్యార‌ల్ ధ‌ర 150 డాల‌ర్ల‌కు చేర‌కుంటుంద‌ని ఖ‌తార్  ఇప్ప‌టికే హెచ్చ‌రించింది. ఇదే జ‌రిగితే ప్ర‌పంచం మ‌రో ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయే ప్ర‌మాదముంది. అదీకాకుండా ఆసియా దేశాల‌కు అవ‌స‌ర‌మైన చ‌మురులో 80% హార్ముజ్ జ‌ల‌సంధి ద్వారానే ర‌వాణా అవుతుంది. ఇప్పుడు దాన్ని మూసివేయ‌డంతో దీని ప్ర‌తికూల ప్ర‌భావం ఆయా దేశాల్లో ఇప్పుడిప్పుడే క‌నిపిస్తోంది. మొత్తంమీద చెప్పాలంటే ఇరాక్‌, వెనిజులా, లెబ‌నాన్ వంటి దేశాల మాదిరిగానే ఇరాన్‌ను గుప్పిట్లోకి తెచ్చుకోవాల‌న్న ట్రంప్ అహంకార‌పూరిత వైఖ‌రి ఇప్పుడు ప్ర‌పంచాన్ని సంక్షోభం దిశ‌గా నెట్టుతున్నది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *