– మేడారం అభివృద్ధిపై ముఖ్యమంత్రి ప్రత్యేక దృష్టి
– నిర్మాణంలో ఉట్టిపడే గిరిజన సంస్కృతి
– పూజారుల ఆమోదంతోనే ముందుకు
– నాణ్యతలో రాజీ లేదు
– కోయల తాళపత్ర గ్రంథాల్లోని విశేషాలకు శిల్పరూపం
– మంత్రి సీతక్క
మేడారం, ప్రజాతంత్ర, డిసెంబర్ 26: ప్రపంచ చరిత్రలోనే సమ్మక్క సారలమ్మ మహా జాతర నిర్మాణ పనులు ఒక మైలు రాయిగా నిలిచిపోతాయనీ ,నిర్మాణ పనులు 200 ఏళ్లపాటు చెక్కుచెదరకుండా ఉండేలా చేపడుతున్నామని రాష్ట్ర స్త్రీ శిశు సంక్షేమ ,పంచాయతీ రాజ్ శాఖ మంత్రి ధనసరి సీతక్క అనసూయ పేర్కొన్నారు. 4 వేల టన్నుల గ్రానైట్ పై ఆదివాసీ చరిత్ర సంస్కృతి తెలియజేసే 7,000 బొమ్మలతో సమ్మక్క సారలమ్మ నిర్మాణం పనులు వేగవంతంగా సాగుతున్నాయన్నారు. శుక్రవారం ములుగు జిల్లా మేడారంలో సమ్మక్క సారలమ్మ పునర్ నిర్మాణ పనులు పరిశీలించేందుకు హైదరాబాదు నుంచి మీడియా ప్రతినిధుల బృందం వచ్చింది. సమ్మక్క సారలమ్మ చరిత్ర ,పునర్నిర్మాణ నిర్మాణ పనులు ఆదివాసీల మూలాలు జాతర చరిత్రను మీడియా బృందానికి ఆమె వివరించారు. ఈ సందర్భంగా మంత్రి సీతక్క మాట్లాడుతూ మేడారం సమ్మక్క-సారలమ్మ మహా జాతరను ఈసారి కొత్త రూపుతో.. వైభవంగా నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టిందని పేర్కొన్నారు.. వచ్చే ఏడాది జనవరి 28 నుంచి 31 వరకు జరిగే జాతరకు తెలంగాణతోపాటు పొరుగు రాష్ట్రాల నుంచి కోటి మందికి పైగా భక్తులు తరలి వస్తారని అంచనా వేస్తున్నామన్నారు. ఈసారి ఎప్పుడూ కల్పించే తాత్కాలిక సౌకర్యాలతోపాటు శాశ్వత నిర్మాణాలపై ప్రభుత్వం దృష్టి పెట్టిందని, ఎన్నడూ లేనివిధంగా రూ.251 కోట్లతో మేడారం అభివృద్ధికి చర్యలు తీసుకుంటున్నదని చెప్పారు. ఇందులో ప్రధానంగా వనదేవతల గద్దెల విస్తరణ ప్రత్యేక ఆకర్షణగా నిలవనుందనీ ఈ పనులకే రూ.101 కోట్లు ఖర్చు చేస్తోందన్నారు. పునరుద్ధరణ పనులు చేపట్టే సమయంలో గిరిజన పూజారులతో అనేకసార్లు సమావేశాలు నిర్వహించి పూజారుల సంఘం అభిప్రాయం తీసుకుని పూజారులను ఒప్పించామన్నారు. ఓకే లైన్లో వన దేవతలు ఉండడం వలన భక్తులు దర్శనాలు చేసుకోవడానికి సులువుగా ఉంటుందని పేర్కొన్నారు. పూర్వకాలంలో గిరిజనులకు పసుపుతో ఎంతో బంధం ఉందని, శాస్త్రీయంగా పసుపుతో పలు వ్యాధులను నయం చేసుకునే అవకాశం ఉందని దీనిని వాడకం చేయడం వలన పూర్వం లో ఆదివాసులు ఎలాంటి వ్యాధుల బారిన పడిన పసుపును వాడుకున్నారని తెలిపారు. సమ్మక్క తల్లి గోత్రం బండారి గోత్రమని, తమ ఆదివాసీల సాంప్రదాయం ప్రకారం ప్రతి పనిని కుడి నుండి ఎడమవైపు నడుస్తుందని, నవగ్రహాలు సైతం కుడి నుండి ఎడమవైపే తిరుగుతున్నాయని వివరించారు. స్వస్తిక్ ఏర్పాటు చేసే విషయంలో సైతం పకృతి సిద్ధాంతాన్ని ఆచరించామని పేర్కొన్నారు. జాతరకు వచ్చే భక్తులు ఓకే వరుస క్రమంలో సులభతరంగా దర్శనం చేసుకునే అవకాశం ఉంటుందని తెలిపారు. జాతర కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా జరుపుతామని మంత్రి తెలిపారు. ఈ పనులు తుది దశకు చేరుకున్నాయని త్వరలో పూర్తికానున్నాయని. తెలిపారు. గతంలో రేవంత్ రెడ్డి పాదయాత్ర సందర్భంగా మేడారం సందర్శించారని గుర్తు చేశారు. ఆ సమయంలో ప్రజలు ఆదివాసీలు ఆలయాన్ని విస్తరించాలని కోరగా అధికారంలోకి రాగానే తప్పకుండా ఆలయాన్ని పునర్నిర్మిస్తామని మాట ఇచ్చి నేడు నిలుపుకుంటున్నారని తెలిపారు. ఇందులో భాగంగానే ముఖ్యమంత్రి రూ.251 కోట్లు మంజూరు చేశారని మేడారం అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి పెట్టారని పనులను వేగవంతం చేస్తున్నారని నిత్యం నిర్మాణం పనులను సమీక్ష చేస్తున్నారని చెప్పారు. గద్దెల ప్రాంగణాన్ని చారిత్రక కట్టడాల మాదిరిగా పటిష్ఠంగా ఉండేలా రాతితో పునర్నిర్మిస్తున్నామని. 46 పిల్లర్లతో 271 చదరపు మీటర్ల విస్తీర్ణంలో ఈ ప్రాకారం ఉండనుందన్నారు. వీటి మధ్య 40 అడుగుల వెడల్పుతో మూడు, 30 అడుగుల వెడల్పుతో ఐదు స్వాగత తోరణాలుంటాయి అని వివరించారు గద్దెల ప్రాంగణానికి ఎదుట 50 అడుగుల వెడల్పున ప్రధాన స్వాగత తోరణం ఉంటుందని తెలిపారు. వృత్తాకారంలో ఉండే గద్దె చుట్టూ 8 స్తంభాలు, మధ్యలో వెదురు బొంగులతో తీర్చిదిద్దుతున్నామని పేర్కొన్నారు.
శిలలపై ఆదివాసుల సంస్కృతికి పెద్దపీట వేస్తున్నామని మంత్రి వివరించారు. తాళపత్రాల్లోని కోయ వంశీయుల చరిత్రను ప్రాంగణం గోడలపై చిహ్నాలుగా, బొమ్మలుగా వివరించారు. ప్రధాన స్వాగత తోరణంపై సమ్మక్క వంశీయుల చరిత్ర తెలిపే 59 బొమ్మలు చెక్కించామని పేర్కొన్నారు. దాదాపు 750 మంది కోయ వంశీయుల పేర్లకు సంబంధించి ఏడు వేల బొమ్మలుంటాయని పేర్కొన్నారు. డాక్టర్ హరిప్రసాద్ ఆధ్వర్యంలో 250 మంది శిల్పులు పనిచేశారనీ, స్థపతులు ఈమని శివనాగిరెడ్డి, డాక్టర్ మోతీలాల్ పర్యవేక్షిస్తున్నారనీ చెప్పారు సమ్మక్క-సారలమ్మ ఆర్కియాలజీ రీసెర్చ్ ఇన్ స్టిట్యూట్కు చెందిన 15 మంది విద్యార్థులు ఈ చిత్రాల రూపకల్పనలో సాయం అందించారని పేర్కొన్నారు. గద్దెల ప్రాంగణానికి సమీపంలో ఇదివరకు ఉన్న చెట్లను దాదాపు తొలగించకుండానే అభివృద్ధి పనులు చేపట్టామన్నారు. వనదేవతల పూజల్లో విశిష్టత కలిగిన బండారి, మర్రి, వెదురు, బూరుగ, వేప, ఇప్ప, కస్తు వంటి 12 రకాల చెట్లు, 140 రకాల ఆయుర్వేద మొక్కలు నాటనున్నామని పేర్కొన్నారు.
మేడారం ఆలయంలో పునర్నిర్మాణ పనులు వేగవంతానికి మంత్రుల బృందం ప్రతిరోజు సమీక్ష నిర్వహిస్తున్నది. పనులను పరిశీలిస్తూ అధికారులకు దిశా నిర్దేశం చేస్తున్నది. పనుల్లో పూర్తి నాణ్యత పాటించేలా ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు. ఏది అవసరం పడిన వెంటనే తెప్పిస్తున్నారు. అధికారుల పురమయిస్తూ పనులు వేగవంతానికి ఎప్పటికప్పుడు చర్యలు తీసుకుంటున్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హైదరాబాద్ నుంచి ప్రతి రోజు పనుల వేగవంతం పై అడిగి తెలుసుకుంటున్నారు. ప్రస్తుతం పనులు తుది దశలో ఉన్నాయి. త్వరలో అన్ని పనులు పూర్తీ అవుతాయి.మంత్రుల బృందాన్ని ఎప్పటికప్పుడు అప్రమత్తం చేస్తూ అధికారులకు ఆదేశాలిస్తూ ముఖ్యమంత్రి ముందుకు సాగుతున్నారు. ఈసారి సమ్మక్క సారలమ్మ జాతరను బ్రహ్మాండంగా విజయవంతం చేసేందుకు ముఖ్యమంత్రి ప్రత్యేక దృష్టి సారించారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్సైట్ ను సందర్శించండి. తాజా అప్డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.





