యుద్ధప్రాతిపదికన మేడారం పనులు

– మంత్రి సీతక్కతో కలిసి సమీక్ష
– ఉమ్మడి వరంగల్‌ ఇన్‌చార్జి మంత్రి పొంగులేటి

హైదరాబాద్‌, ప్రజాతంత్ర, సెప్టెంబర్‌ 8: ఆసియాలోనే అతి పెద్దదైన గిరిజన జాతర, తెలంగాణ కుంభమేళాగా పేరుగాంచిన మేడారం సమ్మక్క, సారలమ్మ జాతరకు అవసరమైన ఏర్పాట్లను యుద్ధప్రాతిపదికన చేపడుతున్నామని ఉమ్మడి వరంగల్‌ జిల్లా ఇన్‌చార్జ్జి మంత్రి, రాష్ట్ర రెవెన్యూ, హౌసింగ్‌, సమాచార పౌరసంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి సూచనల మేరకు సచివాలయంలోని తన కార్యాలయంలో పంచాయతీరాజ్‌ శాఖ మంత్రి దనసరి అనసూయ సీతక్కతో కలిసి ఆయన సోమవారం సమీక్షించారు. ఈ సందర్భంగా పొంగులేటి మాట్లాడుతూ గిరిజన సంస్కృతి సంప్రదాయాలు ఉట్టిపడేలా గిరిజనుల మనోభావాలకనుగుణంగా ఆలయ ఆధునీకరణను చేపడుతున్నామని, ఈ పనులను ఈనెల 15వ తేదీ నుంచి ప్రారంభించి జనవరి మొదటి వారంలోగా పూర్తయ్యేలా కార్యాచరణ రూపొందించాలని అధికారులను ఆదేశించారు. ఇప్పటికే మేడారం ఆలయాలకు సంబంధించిన మాస్టర్‌ ప్లాన్‌ను ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి పరిశీలించారని, మూడు నెలల వ్యవధిలో పనులు పూర్తయ్యేలా ఆదేశించారని తెలిపారు. వారం రోజుల్లో ముఖ్యమంత్రి స్వయంగా క్షేత్రస్ధాయి పరిశీలనకు వస్తున్నందున తగు ప్రణాళికలు, సమాచారంతో సిద్దంగా ఉండాలని అధికారులను ఆదేశించారు. సమావేశంలో సీఎం ప్రిన్సిపల్‌ సెక్రటరీ శ్రీనివాసరాజు, దేవాదాయ శాఖ ప్రిన్సిపల్‌ సెక్రటరీ శైలజా రామయ్యర్‌, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *