– సహకరించే ప్రభుత్వం వద్ద లొంగిపోతాం
– ఈసారి పీఎల్జీ వారోత్సవాలు జరపబోము
– స్పెషల్ జోనల్ కమిటీ ప్రతినిధి అనంత్ లేఖ
తమకు ఏప్రభుత్వం సహకరిస్తే వారివద్దే లొంగిపోవడానికి తాము సిద్దంగా ఉన్నామని మావోయిస్టు పార్టీ స్పెషల్ జోనల్ కమిటీ (ఎంఎంసి) ప్రతినిధి అనంత్ లేఖ విడుదలచేసారు.ఆయుధాలను వొదిలేసేందుందుకు భారత కమ్యూనిస్ట్ పార్టీ మావోయిస్ట్ నిర్ణయించుకుంది. ఎంఎంసి సహచరులందరూ జనవరి 1, 2026న సాయుధ పోరాటాన్ని తాత్కాలికంగా నిలిపివేసి ప్రభుత్వాలకు ఆయుధాలు అప్పగించేందుకు సిద్ధంగా ఉన్నామని చెప్పారు.ఈ మేరకు మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్ రాష్ట్రాల ముఖ్యమంత్రులకు స్పెషల్ జోనల్ కమిటీ (ఎంఎంసి) ప్రతినిధి అనంత్ మరో లేఖ రాశారు. ప్రభుత్వ పునరావాసం కల్పిస్తే లొంగిపోయేందుకు తాము సిద్ధంగా ఉన్నామని స్పష్టం చేశారు.అప్పటి వరకు, 3 రాష్ట్రాల ప్రభుత్వాలు సంయమనం పాటించాలని, భద్రతా కార్యకలాపాలను పూర్తిగా నిలిపివేయాలని కోరారు.. దండకారణ్యంలో ఎక్కడా భద్రతా దళాలుఎన్కౌంటర్లు వంటి అవాంఛనీయ ఘటనలకు పాల్పడకూడదని లేఖలో పేర్కొన్నారు. దండకారణ్యంలో ఉన్న మా సహచరులందరితో సంబంధాలు ఏర్పరచుకోవడానికి మేం ప్రయత్నిస్తామని, భద్రతా దళాల కార్యకలాపాలను కొనసాగించడం మాకు అంతరాయం కలిగిస్తుందని లేఖలో వివరించారు. ప్రభుత్వ పునరావాస ప్రణాళికను ఒకేసారి లేదా పెద్ద సంఖ్యలో జన జీవన స్రవంతిలో చేరాలనుకుంటున్నామని వేడుకున్నారు. ఛత్తీస్గడ్ సతీష్ దాదా, మహారాష్ట్రలో సోను దాదా విషయంలో జరిగినట్లుగా, మేం ఆయుధాలను అప్పగించి, 3 రాష్ట్రాలలో ఒక ముఖ్యమంత్రి లేదా హోం మంత్రి ముందు లొంగిపోతామని లేఖలో తెలిపారు. తాము ఆయుధాలను అప్పగించి, వొచ్చే నెలలో ఈ మొత్తం ప్రక్రియను శాంతియుతంగా పూర్తి చేయడంలో సపోర్ట్ చేసే రాష్ట్ర ప్రభుత్వం ముందు జన స్రవంతిలో చేరడానికి సిద్ధంగా ఉన్నామని పేర్కొన్నారు. ఈ మొత్తం ప్రక్రియ శాంతియుతంగా పూర్తి కావడానికి అనుకూలమైన వాతావరణాన్ని సృష్టించాలని ముఖ్యమంత్రులను అభ్యర్థిస్తున్నాను. భద్రతా దళాలు ఆ తేదీ వరకు కార్యకలాపాలను నిలిపివేసి, ఎన్కౌంటర్లుకు పాల్పడకుండా ఉంటేనే ఇది సాధ్యమవుతుందని తెలిపారు. విజయ్ శర్మ (ఛత్తీస్గడ్ రాష్ట్ర హోంమంత్రి) రేడియోలో మాట్లాడటం మేం విన్నాము. ఈ ప్రయోజనం కోసం 10 నుండి 15 రోజులు సరిపోతాయని అన్నారు. ఆయన ప్రతిస్పందనను మేం గౌరవిస్తాము, కానీ అంత తక్కువ సమయం సరిపోదు. ఆయుధాలను వొదులుకుని ప్రధాన స్రవంతిలోకి తిరిగి రావడానికి మేము నిర్ణయించిన ఖచ్చితమైన తేదీకి (జనవరి 1, 2026) ఎలాంటి అభ్యంతరం ఉండకూడదని కోరారు.మా ప్రతిపాదనలు, డిమాండ్లు చేయాలనుకుంటే, ప్రభుత్వం వాటిని వింటుందని.. అందుకు ప్రయత్నాలు చేస్తుందని తన ప్రకటనలో పేర్కొన్నందుకు విజయ్ శర్మకు మా కృతజ్ఞతలు తెలిపారు. మిగిలిన రెండు రాష్ట్రాల (మహారాష్ట్ర, మధ్యప్రదేశ్) ప్రభుత్వాల నుండి మా అభ్యర్థనపై మాకు భరోసా రాలేదు. ఇందుకోసం చూస్తున్నామని తెలిపారు.ఈ ప్రక్రియ అయ్యే వరకు జోన్ అంతటా ఉన్న మా సహచరులు తమ కార్యకలాపాలన్నింటినీ నిలిపివేయాలి. దానికి అంతరాయం కలిగించే ఎటువంటి ప్రేరణ లేదా చర్యలో పాల్గొనవద్దు. ఈసారి మేము పిఎల్జి వారోత్సవాన్ని పాటించబోమని లేఖలో చెప్పారు. ఈ వారంలో తన భద్రతా దళాల గస్తీని నిలిపివేయాలని ప్రభుత్వాన్ని అభ్యర్థించారు. జోన్ అంతటా ఉన్న అన్ని సహచరులకు మేం ఆడియో విజ్ఞప్తిని జారీ చేస్తాము. దీని గురించి విన్న లేదా తెలుసుకున్న వెంటనే ఒకరినొకరు సంప్రదించడానికి ప్రయత్నించాలని కామ్రేడ్లను అభ్యర్థించారు. స్వయంగా వెళ్లి లొంగిపోవద్దని కూడా కామ్రేడ్లను అభ్యర్థిస్తున్నాము. మనమందరం దీన్ని కలిసి చేయాలి’ అని మూడు రాష్ట్రాల ముఖ్యమంత్రులకు రాసిన లేఖలో మావోయిస్టు ప్రతినిధి అనంత్ స్పష్టం చేశారు.





