– ఇరాన్లో పాఠశాల బాలికల మృతిపై కేటీఆర్
హైదరాబాద్, ప్రజాతంత్ర, మార్చి 4: ఇరాన్పై ఇజ్రాయెల్, అమెరికా దాడులతో మధ్యప్రాచ్యం అట్టుడుకుతోంది. ఇజ్రాయెల్, అమెరికా బలగాలు వైమానికి దాడులతో ఇరాన్ను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. ఇరాన్ కూడా ఇజ్రాయెల్పైన, తన పరిసర దేశాల్లోని అమెరికా సైనిక స్థావరాలపైన ప్రతిదాడులు చేస్తోంది. ఫలితంగా పశ్చిమాసియాలో పరిస్థితులు ఉద్రిక్తంగా మారాయి. ఈ నేపథ్యంలో ఈ మారణహోమంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కామెంట్ చేశారు. ఇరాన్పై అమెరికా, ఇజ్రాయెల్ సంయుక్తంగా జరిపిన దాడుల్లో ఓ బాలికల పాఠశాల నేలమట్టమవగా ఆ శిథిలాల కింద చిక్కుకుని 165 మంది బాలికలు ప్రాణాలు కోల్పోయారు. ఇవాళ వారి అంత్యక్రియలు విషాదకరంగా జరిగాయి. ఈ నేపథ్యంలో పాఠశాలపై ఇజ్రాయెల్, అమెరికా బలగాలు జరిపిన దాడుల్లో ప్రాణాలు కోల్పోయిన 165 మంది బాలికల అంత్యక్రియలకు సంబంధించిన భయంకరమైన, మనసును కలచివేసే దృశ్యాలు అని పేర్కొంటూ కేటీఆర్ ఆ బాలికల సామూహిక సమాధుల దృశ్యాన్ని తన ‘ఎక్స్’ ఖాతాలో షేర్ చేశారు. యుద్ధం ఆవశ్యకత గురించి చెబుతున్న ఉద్దేశాలు ఏవైనా ఇది మనిషి సృష్టించిన విషాదమేనని, ఈ యుద్ధం రాబోయే తరాలకు బాధను, విషాదాన్ని మాత్రమే మిగుల్చుతుందని తన పోస్టులో పేర్కొన్నారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్సైట్ ను సందర్శించండి. తాజా అప్డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.