– భూసేకరణకు రూ.205 కోట్లు విడుదల
హైదరాబాద్,ప్రజాతంత్ర,జూలై25: వరంగల్లోని మామునూరు ఎయిర్పోర్టు నిర్మాణం పనుల్లో మరో కీలక ముందడుగు పడింది. ఎయిర్పోర్టు భూసేకరణకు రాష్ట్ర ప్రభుత్వం నిధులు విడుదల చేసింది. రూ.205 కోట్లు విడుదల చేస్తున్నట్లు ఉత్తర్వులు జారీ అయ్యాయి. ఇప్పటికే భూములు కేటాయించలేదని ఆరోపణలు వచ్చాయి. మామునూరు వద్ద కొత్త బ్రౌన్ఫీల్డ్ ఎయిర్పోర్టు నిర్మాణానికి కేంద్ర పౌరవిమానయాన శాఖ మంత్రి కె.రామ్మోహన్నాయుడు మార్చి నెలలో పచ్చజెండా ఊపారు. ఈ విమానాశ్రయానికి అన్ని అనుమతులు ఇస్తూ.. ఎయిర్పోర్టస్ అథారిటీ నిర్మాణం ప్రారంభించడానికి వీలుగా సంబంధిత దస్త్రంపై సంతకం చేశారు. మరో 253 ఎకరాల భూమిని రాష్ట్ర ప్రభుత్వం సేకరించి ఇస్తే కొత్త విమానాశ్రయ నిర్మాణం మొదలుపెడతామని కేంద్రమంత్రి ప్రకటించారు. ఈ నేపథ్యంలోనే భూసేకరణ కోసం ప్రభుత్వం తాజాగా నిధులు విడుదల చేసింది. దీంతో పనుల్లో వేగం పుంజుకోనుంది. భూములను ఇచ్చేందుకు స్థానికులు వెనకాడడం కూడా ఓ కారణంగా చెప్పుకోవాలి





