అప్పట్లో కాంగ్రెస్ తెలంగాణ ప్రజల మనోభావాలను గుర్తిస్తున్నామని 2004 లో బహిరంగ ప్రకటన చేసి .. రాష్ట్ర హోదాను 2009 డిసెంబర్ 9న ప్రకటించినప్పటికీ, దీన్ని అమల్లోకి తెచ్చింది మాత్రం 2014 సాధారణ ఎన్నికల సమయంలో! అంటే ఇచ్చిన ప్రకటనకు, చేసిన అమలుకు మధ్య పది సంవత్సరాల సమయం పట్టింది! ఇంతగా ఆలస్యం చేయడం వల్ల పార్టీ తెలుగు రాష్ట్రాల్లో తీవ్రంగా నష్టపోయింది. పోనీ ప్రత్యేక రాష్ట్రం ఇవ్వకుండా నష్టపోయిందంటే అదివేరు! ఉమ్మడి రాష్ట్రాన్ని తెలంగాణ ప్రజల ఆకాంక్ష మేరకు విడగొట్టి, రెండు రాష్ట్రాల్లో జరిగిన ఎన్నికల్లో సోదిలో లేకుండా పోయింది! ప్రస్తుత బీసీ రిజర్వేషన్ల విషయంలో కూడా సరిగ్గా అటువంటి తప్పిదాన్నే కాంగ్రెస్ పునరావృతం చేస్తున్నది. ప్రత్యేక రాష్టం ఇవ్వడం కాంగ్రెస్ తీసుకున్న సరైన నిర్ణయమే అయినప్పటికీ, సమస్యను హ్యాండిల్ చేసిన విధానం, నిర్ణయం తీసుకున్న సమయం రాజకీయంగా ఎంతమాత్రం సరైనవి కావు.
తప్పులు చేయడమే కాంగ్రెస్ నైజమా ..!

ఒక తప్పు చేయడం. దాన్ని కప్పిపుచ్చుకోవడానికి మరో తప్పు…ఈ విధంగా పదే పదే కొనసాగడాన్ని చూస్తే ఏమనిపిస్తుంది? దేశంలో గ్రాండ్ వో ల్డ్ పార్టీగా పేరుపడ్డ కాంగ్రెస్ పార్టీ ఇదేమాదిరిగా పదే పదే ప్రాథమిక తప్పులు చేసుకుంటూ వెళితే? ఒక సువ్యవస్థాపిత పార్టీగా కాంగ్రెస్ తన తప్పుడు నిర్ణయాలకు, చేసే తప్పులకు ప్రజలకు జవాబుదారీగా వ్యవహరించక తప్పదు. అంతేకానీ వీటిని చిన్న పిల్లలు చేసే తప్పుల మాదిరిగా ఎప్పటికప్పుడు వీటిని పరిగణిస్తూ ముందుకు సాగడం అనేది సరైన పద్ధతి కాదు. కానీ తెలంగాణ కాంగ్రెస్ పార్టీ తన నిర్మాణ కార్యక్ర మంలో నిరంతరం పొరపాట్లు చేయడమే కాకుండా, అదేమంటే రాజకీయంగా అవి సరైనవేనని సమర్థించుకోవడం ఎంతవరకు సముచితమనేది ఇక్కడ అసలైన ప్రశ్న. ఈ విధమైన కాంగ్రెస్ నాయకత్వ వ్యవహారశైలి వల్ల పార్టీ వివిధ వర్గాల పౌరుల్లో తన విశ్వసనీయతను కోల్పోవడం తప్ప మరే విధంగాను ప్రయోజనకారి కాదు.
ప్రస్తుతం రాష్ట్రంలో బీసీ రిజర్వేషన్ల విషయంలో కాంగ్రెస్ అనుసరిస్తున్న వ్యవహారశైలిని గమనిస్తే, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ను విడగొట్టడానికి చేసిన తాత్సారం ఏవిధంగా చారిత్రక తప్పిదానికి పాల్పడిందో అదే మాదిరి పరిస్థితి ఇప్పుడు కనిపిస్తోంది. ప్రత్యేక తెలంగాణ సమస్యను అప్పట్లో కాంగ్రెస్ ఏవిధంగా హ్యాండిల్ చేసిందో, సరిగ్గా ఇప్పడు బీసీ రిజర్వేషన్ల సమస్యపై కూడా సరిగ్గా అదే రీతిలో ముందుకెళుతోంది. అప్పట్లో కాంగ్రెస్ తెలంగాణ ప్రజల మనోభావాలను గుర్తిస్తున్నామని 2004 లో బహిరంగ ప్రకటన చేసి ..
రాష్ట్ర హోదాను 2009 డిసెంబర్ 9న ప్రకటించినప్పటికీ, దీన్ని అమల్లోకి తెచ్చింది మాత్రం 2014 సాధారణ ఎన్నికల సమయంలో! అంటే ఇచ్చిన ప్రకటనకు, చేసిన అమలుకు మధ్య పది సంవత్సరాల సమయం పట్టింది! ఇంతగా ఆలస్యం చేయడం వల్ల పార్టీ తెలుగు రాష్ట్రాల్లో తీవ్రంగా నష్టపోయింది. పోనీ ప్రత్యేక రాష్ట్రం ఇవ్వకుండా నష్టపోయిందంటే అదివేరు! ఉమ్మడి రాష్ట్రాన్ని తెలంగాణ ప్రజల ఆకాంక్ష మేరకు విడగొట్టి, రెండు రాష్ట్రాల్లో జరిగిన ఎన్నికల్లో సోదిలో లేకుండా పోయింది! ప్రస్తుత బీసీ రిజర్వేషన్ల విషయంలో కూడా సరిగ్గా అటువంటి తప్పిదాన్నే కాంగ్రెస్ పునరావృతం చేస్తున్నది. ప్రత్యేక రాష్టం ఇవ్వడం కాంగ్రెస్ తీసుకున్న సరైన నిర్ణయమే అయినప్పటికీ, సమస్యను హ్యాండిల్ చేసిన విధానం, నిర్ణయం తీసుకున్న సమయం రాజకీయంగా ఎంతమాత్రం సరైనవి కావు.
ఒక నిర్ణయం తీసుకోవడంలో ఏళ్లతరబడి జరిగే ఆలస్యం వల్ల ప్రజల్లో విశ్వాసం కోల్పోవాల్సి వస్తుంది. బీసీలకు రిజర్వేషన్లు కల్పిస్తూ జీఓ జారీచేయడం సరిగ్గా ఇదే అంశాన్ని స్పష్టం చేస్తున్నది. ఈ జీఓ జారీ చట్టబద్ధత ఇప్పుడు ప్రశ్నార్థకంగా మారింది. ఎందుకంటే దీన్ని జారీ చేయడం వెనుక కాంగ్రెస్ విధానంలో స్పష్టత లోపించడం ప్రస్పుటంగా కనిపిస్తోంది. అసలు దీని అమలు ఎంతవరకు సాధ్యమనేది మిలియన్ డాలర్ల ప్రశ్న! రాజ్యాంగం, చట్టం ముందు ఈ జీఓ నిలవలేకపోతే, తన హామీని అమలు చేయడంలో ఒక విఫల ప్రభుత్వంగా కాంగ్రెస్ అపప్రధ మూటకట్టుకోక తప్పదు. అప్పుడు విపక్ష బీజేపీ, బీఆర్ ఎస్లు ఈ సమస్యను ప్రధానంగా ఎత్తిచూపి రాజకీయంగా ప్రయోజనం పొందే అవకాశం లేకపోలేదు. ప్రస్తుతం ఈ రిజర్వేషన్ సమస్య తెలంగాణ హైకోర్టులో పెండింగ్లో ఉంది . పొరుగునే ఉన్న మహారాష్ట్రలో కూడా ఇదేమాదిరిగా రిజర్వేషన్లు పెంచితే, 50% కంటే ఎక్కువ ఉన్నాయన్న కారణంగా అక్కడి హైకోర్టు కొట్టేసింది. తీర్పు ఈవిధంగా రావడం స్పష్టంగా కనిపిస్తున్నప్పుడు, కాంగ్రెస్ ప్రభుత్వం తాను పెంచిన రిజర్వేషన్లపై ఏవిధంగా ధైర్యంగా ముందుకెళ్లగలదు? కచ్చితంగా ఇదొక అనిశ్చిత పరిస్థితేనని చెప్పాలి.
ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు నిరన్యం ఆలస్యం విషయంలో తాను చేసిన తప్పిదాలనుంచి కాంగ్రెస్ పాఠాలు నేర్చుకోలేదనే అనుకోవాలి. ఎందుకంటే తెలంగాణలో అధికారంలోకి వొచ్చిన తర్వాత కూడా రిజర్వేషన్లపై నిర్ణయం తీసుకునే ముందు, వొనగూడే సంక్లిష్ట పరిణామాలపై ఎటువంటి అంతర్మథనం, మేధోమధనం చేయకుండా గుడ్డిగా ముందుకెళ్లడమే పార్టీ చేస్తున్న తప్పిదం. దీని పర్యవసానం ఎన్నికల్లో తన ప్రత్యర్థి పార్టీలకు ప్రయోజనం కలిగించడం తప్ప మరో ఫలితం వొచ్చే పరిస్థితి లేదు. గాంధీభవన్ నుంచి వొస్తున్న సమాచారం ప్రకారం, బీసీ రిజర్వేషన్లపై రేవంత్ వ్యవహారశైలిపై పార్టీలోని బీసీ నాయకులే కస్సుబుస్సు మంటున్నారు. అసలు తమను సంప్రదించకుండా, ముఖ్యమంత్రి ఈ బీసీ రిజర్వేషన్లకు, స్థానిక ఎన్నికలకు ముడిపెట్టి ఏకపక్షంగా ముందుకెళ్లడం ఎంతవరకు సమంజసమని వారు ప్రశ్నిస్తున్నారు.
బీసీ రిజర్వేషన్లపై పార్టీలో అంతర్గతంగా అందోళన రెండు రకాలుగా వ్యక్తమవుతోందని విశ్వసనీయ సమాచారం. మొదటిది బీసీ వర్గాలకు చెందిన మంత్రులు వ్యక్తం చేసేది కాగా రెండవది ఇతర వర్గాల మంత్రుల్లో వ్యక్తమవుతున్న అనుమానాలు! ఒకవేళ రేపు హైకోర్టు తీర్పు వ్యతిరేకంగా వొస్తే, ఈ రిజర్వేషన్ల సమస్య బూమరాంగ్ అయి పార్టీని స్థానిక ఎన్నికల్లో దారుణంగా దెబ్బతీస్తుందని బీసీ మంత్రులు, నాయకులు భయపడుతున్నారు. ముఖ్యంగా 2023 అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీకి దన్నుగా నిలిచిన బీసీలు దూరమైతే పార్టీ పుట్టి మునగడం ఖాయమన్నది వారు వ్యక్తం చేస్తున్న అభిప్రాయం.
ఇక పార్టీలోని అగ్రవర్ణాలకు చెందిన మంత్రుల ఆలోచన మరోలా వుంది. రేవంత్ తీసుకున్న బీసీ రిజర్వేషన్ నిర్ణయం వల్ల అగ్రవర్ణాలు ముఖ్యంగా రాజకీయ ప్రాబల్యం కలిగిన రెడ్డి వర్గం దూరమైందని, 50%కు పైగా రిజర్వేషన్ సదుపాయం కల్పించడం తమ ప్రయోజనాలను బాగా దెబ్బతీస్తుందని అగ్రవర్ణాలు ఒక నిశ్చితాభిప్రాయానికి వొస్తారని వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అయితే తెలంగాణలో 42% రిజర్వేషన్లను అమలు పరచడం ద్వారా, త్వరలో జరుగబోయే బీహార్ ఎన్నికల్లో ఈ అంశాన్ని బలంగా చూపించి, ఎన్నికల్లో ప్రయోజనం పొందాలన్నది కాంగ్రెస్ వ్యూహంగా కొందరు చెబుతున్నారు.
న్యాయపరంగా ఎదురుదెబ్బ తగిలితే, ఈ పాపం కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వానిదేనంటూ ఎదురుదాడికి దిగాలన్నది పార్టీ వ్యూహమని చెబుతున్నారు. ముఖ్యంగా బీజేపీ ఓబీసీ రిజర్వేషన్లకు వ్యతిరేకం కాబట్టే బిల్లును, ఆర్డినెన్స్ ను తొక్కిపట్టిందని ప్రచారం చేయవొచ్చన్నది కూడా కాంగ్రెస్ వ్యూహంగా కనిపిస్తోంది. ఇక విపక్షాల విషయానికి వొస్తే, రేవంత్ అడేదంతా రాజకీయ డ్రామా తప్ప మరోటి కాదని, ఈ రిజర్వేషన్లు ఎట్టిపరిస్థితుల్లో అమలు కావన్న సంగతి ప్రభుత్వానికి తెలుసునని చెబుతున్నాయి. మరి తప్పుల మీద తప్పులు చేస్తున్న కాంగ్రెస్ ఏవిధంగా తన తప్పిదాలనుంచి బయటపడటం అంత తేలికకాదనేది సుస్పష్టం.
-శామ్ సుందర్




