– టి-వర్క్స్ వేదికగా తయారవుతున్న ఫైటర్ జెట్ సిమ్యులేటర్లు
– ఇప్పటికే దేశం దృష్టిని ఆకర్షిస్తున్న హైదరాబాద్
– ఆర్డర్లు సాధించినందుకు మంత్రి శ్రీధర్బాబు అభినందన
హైదరాబాద్, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 25: డ్రోన్లు, క్షిపణులు, విమానాల విడిభాగాలు, రక్షణరంగ ఉత్పత్తులతో దేశం దృష్టిని ఆకర్షిస్తున్న హైదరాబాద్ మరో భారీ ఆవిష్కరణకు సిద్ధమైంది. రాష్ట్ర ప్రభుత్వ ఆధీనంలో టీ-వర్క్స్ వేదికగా యుద్ధ విమానాల సిమ్యులేటర్ రూపుదిద్దుకుంటోంది. ఎయిర్ఫోర్స్, నేవీ యుద్ధ విమానాల పైలట్ల శిక్షణ కోసం అవసరమయ్యే సిమ్యులేటర్లను ఇప్పటిదాకా భారీ వ్యయంతో అమెరికా, యూరప్లనుంచి దిగుమతి చేసుకుంటుండగా ఇకపై ఆ అవసరం ఉండదు. పైగా మనమే అగ్రదేశాలకు ఎగుమతి చేయగలిగే సాంకేతికతత వృద్ధి చెందుతుంది. ఎయిర్ ఫోర్సులో పైలట్లుగా ఎంపికైన అభ్యర్థులకు మొదట ఫ్లైట్ సిమ్యులేటర్లలో శిక్షణ ఇస్తారు. విమానం ఎగిరే కృత్రిమ వాతావరణాన్ని సృష్టించే సిమ్యులేటర్లు నిజంగా ఎయిర్ క్రాఫ్ట్ను గాలిలో నడిపిన అనుభూతిని, అనుభవాన్ని ఇస్తాయి. కాక్ పిట్లో కూర్చుని బయటినుంచి శిక్షకులు ఇచ్చే సూచనల ప్రకారం ఎలక్ట్రానిక్ వ్యవస్థను నియంత్రించాల్సి ఉంటుంది. విమానం టేకాఫ్, ల్యాండింగ్, తలకిందులుగా ఎగరడం వంటి అన్ని రకాల విన్యాసాల శిక్షణ సిమ్యులేటర్ ద్వారా లభిస్తుంది. యుద్ద విమానాల్లో ఉండే ఎలక్ట్రానిక్, ఆటోమేటిక్ నియంత్రణ వ్యవస్థలన్నీ ఇందులో ఉంటాయి. ఎదురుగా అర్ధచంద్రాకారంలో ఉండే స్క్రీన్పైన ఫైటర్ జెట్ కదులుతున్న దృశ్యాలు ఆవిష్కృతమవుతుంటాయి. యాక్సియల్ ఏరో ప్రైవేట్ లిమిటెడ్ అనే సంస్థ ఈ సిమ్యులేటర్ల తయారీకి అన్ని అనుమతులు సాధించి వాణిజ్య ఉత్పత్తి మొదలుపెట్టింది. వచ్చే మూడేళ్లలో ఐదు సిమ్యులేటర్లను సరఫరా చేయడానికి రక్షణ మంత్రిత్వ శాఖ నెలకొల్పిన ఇన్నోవేషన్స్ ఫర్ డిఫెన్స్ ఎక్స్లెన్స్తో భారీ ఒప్పందాలు కుదుర్చుకుంది. ప్రస్తుతం మన ఎయిర్ఫోర్స్ దిగుమతి చేసుకుంటున్న ఒక్కో ఫైటర్ జెట్ సిమ్యులేటర్ వ్యయం రూ.50 కోట్ల దాకా ఉండగా, యాక్సియల్ ఏరో రూ.25-30 కోట్లకే అందజేస్తుంది. టీ-వర్క్స్లో పరిశోధనలు సాగిస్తున్న ఈ సంస్థ ఎయిర్ఫోర్స్, నేవీ అవసరాలకు తగిన విధంగా ఫ్లైట్ సిమ్యులేటర్లను తయారు చేయడానికి సర్వం సిద్ధం చేసుకుంది. ఇటీవల టీ-వర్క్స్ను సందర్శించిన ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్బాబు దాదాపు రెండు గంటలసేపు పరిశోధనల పురోగతిని పరిశీలించి ఇంజనీర్లనతో సమీక్షించారు. తక్కువ సమయంలో క్లిష్టమైన పరిశోధనలను పూర్తి చేసి ఆర్డర్లు సాధించినందుకు ప్రత్యేకంగా ప్రశంసించారు. సాధ్యమైనంత త్వరలో అత్యాధునిక సిమ్యులేటర్లను రూపొందించి విశ్వనగరం హైదరాబాద్ కీర్తిని జెట్ వేగంతో గగనతలానికి తీసుకెళ్లాలని సూచించారు.
వీటి మరో ప్రత్యేకత ఏమిటంటే దిగుమతి చేసుకునే వాటికంటే అత్యున్నత ప్రమాణాలు కలిగి ఉంటాయి. దిగుమతి చేసుకునేవి పీఠం నుంచి అన్ని వైపులా 30 డిగ్రీల మేర మాత్రమే వంగడం లేవడం చేయగలుగుతాయి. యాక్సియల్ ఏరో రూపొందిస్తున్న సిమ్యులేటర్లు 360 డిగ్రీల మేర తిరగగలిగే స్టివార్టు ప్లాట్ఫామ్ను కలిగి ఉంటాయి. దీనివల్ల యుద్ధ క్షేత్రంలో శత్రువుకు దొరకకుండా తప్పించుకునేందుకు ఫైటర్ జెట్లను నడిపించే పైలట్లు అనుసరించే విన్యాసాలన్నీ ఇందులో సాధ్యమవుతాయి. సిమ్యులేటర్ల వాణిజ్య ఉత్పత్తి ప్రారంభమైతే విడిభాగాలు అందించే అనుబంధ పరిశ్రమలు పుట్టుకొస్తాయి. ఎంఎస్ఎంఇ రంగం కూడా ప్రయోజనం పొందుతుంది. విదేశీ పెట్టుబడులు వచ్చే అవకాశాలు పెరుగుతాయి.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్సైట్ ను సందర్శించండి. తాజా అప్డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.





