– త్వరలో సిఎం రేవంత్రెడ్డి శంకుస్థాపన
– అధికార్లతో సమీక్షించిన మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి
సంగారెడ్డి, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 2: ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి త్వరలోనే ఉమ్మడి మెదక్ జిల్లాలోని సంగారెడ్డి పట్టణంలో పర్యటించనున్న నేపథ్యంలో చేపట్టబోయే పనులకు సంబంధించి జిల్లా కలెక్టర్ ప్రావీణ్య, టిజిఐఐసి ఛైర్పర్సన్ నిర్మలారెడ్డితో కలిసి మాజీ ఎమ్మెల్యే, టిపిసిసి వర్కింగ్ ప్రెసిడెంట్ తూర్పు జయప్రకాష్రెడ్డి అలియాస్ జగ్గారెడ్డి మంగళవారం మహబూబ్సాగర్ సుందరీకరణ తదితర పనులను పరిశీలించిన అనంతరం సమీక్ష నిర్వహించారు. రూ.500కోట్లతో సంగారెడ్డిలోని మహబూబ్సాగర్ సుందరీకరణ పనులు, ఇతరత్రా పనులు శంకుస్థాపన, ప్రారంభోత్సవానకి త్వరలోనే ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి సంగారెడ్డిలో పర్యటించనున్నట్లు తెలిపారు. వొచ్చే వినాయక చవితి నిమజ్జనం, బతుకమ్మ పండుగలలోపు పనులన్నింటిని పూర్తి చేయాలని ఈ సమీక్ష సమావేశంలో నిర్ణయించారు. మహబూబ్ సాగర్ సుందరీకరికరణకు చేపట్టబోయే పనులకు సంబంధించి వీడియోను, పిపిటిని హెచ్ఎండిఏ అధికారులు ప్రదర్శించారు. రూ.500 కోట్లతో మహబూబ్ సాగర్ను అభివృద్ధి చేసేందుకు ప్రాజెక్ట్ రూపకల్పన చేసినట్లు కలెక్టర్కు హెచ్ఎండిఏ అధికారులు వివరించారు. మహబూబ్సాగర్ చెరువు మధ్యలో భారీ శివుడి విగ్రహం ఏర్పాటు, బయట నుండి వొచ్చే డ్రైనేజీ వాటర్ నేరుగా మహబూబ్ సాగర్లో కలవకుండా ఏర్పాటు, రానున్న 25 సంవత్సరాలకు సరిపోయేలా 23.5ఎంఎల్డి ట్రీట్మెంట్ ప్లాంట్ ఏర్పాటు చేసేలా డిజైన్ను సిద్దం చేసినట్లు కలెక్టర్కు అధికారులు వివరించారు. భవిష్యత్తు అవసరాలకు తగ్గట్టుగా ట్రీట్మెంట్ ప్లాంట్ సామర్ధ్యాన్ని పెంచుకునేలా ప్రణాళిక సిద్దం చేయాలని అధికారులకు కలెక్టర్ సూచించారు. మహబూబ్సాగర్ నీటి నాణ్యత పెంచేలా చర్యలు తీసుకోవాలనీ, మహబూబ్ సాగర్ను టూరిజం, రిక్రియేషన్ సెంటర్గా మార్చేలా ప్రాజెక్ట్కు రూప కల్పన చేయమన్నారు. నేషనల్ హైవే నుండి, ఐఐటి పక్క నుండి మహబూబ్ సాగర్ వరకు 100 ఫీట్ల లింక్ రోడ్ నిర్మాణానికి ప్రతిపాదనలు సిద్దం చేసినట్లు కలెక్టర్కు జగ్గారెడ్డి వివరించారు. ప్రాజెక్ట్ రెండో దశలో రూ.65 కోట్లతో డీషిల్టింగ్ చేసేలా ప్రణాళిక ఉందని హెచ్ఎండిఏ అధికారులు వివరించారు. చెరువు మధ్యలో ఉన్న సోమేశ్వర ఆలయం అభివృద్ధి, మహబూబ్ సాగర్ కట్ట వెడల్పు, సైకిల్ ట్రాక్, రెండు లేన్ల బిటి రోడ్ ఏర్పాటు, రూ.20 కోట్లతో శివుడి విగ్రహం, విగ్రహం వరకు కేబుల్ బ్రిడ్జి ఏర్పాటు, వాచ్ టవర్ ఏర్పాటు, రూ.9 కోట్ల తో సంగమేశ్వర ఆలయ అభివృద్ధి, ప్రాజెక్ట్ రెండవ దశలో ఐ లాండ్లు, వాటర్ థీమ్ పార్క్, బోటింగ్ డెక్ ఏర్పాటు, మరో రూ.9 కోట్లతో బతుకమ్మ ఘాట్, చిల్డ్రన్ ప్లే ఏరియా ఏర్పాటుకు ప్రాజెక్ట్లో రూపకల్పన చేయనున్నామన్నారు. దివ్యాంగులు, వృద్ధుల కోసం ప్రత్యేక ఏర్పాట్లు ఉండేలా చూడాలని అధికారులను కలెక్టర్ ఆదేశించారు. మహబూబ్ సాగర్ అభివృద్ధి కోసం రైతుల నుండి భూమిని తీసుకునే సమయంలో ప్రయివేట్ మార్కెట్ ధరను పరిగణలోకి తీసుకొని ప్రతిపాదనలు సిద్ధం చేయాలని జగ్గారెడ్డి ఆర్డీవోను కోరారు . అంతకుముందు సంబంధిత శాఖల అధికారులతో కలిసి మహబూబ్ సాగర్ను ఆయన పరిశీలించారు. నిధులు లేకుంటే 2012లో తన స్వంత డబ్బులు రూ.50లక్షలతో మునిసిపల్ డ్రైనేజీ వాటర్ కలవకుండా, సోమేశ్వర ఆలయం చేరుకునేలా రోడ్డు నిర్మాణం చేపట్టినట్లు కలెక్టర్కు వివరించారు. వీరి వెంట సంబంధిత అధికారులు , కాంగ్రెస్ పార్టీ నాయకులు తోపాజీ అనంతకిషన్, కూన సతీష్, సునీల్, కిరణ్గౌడ్ తదితరులు ఉన్నారు.





