మేడారం పనులపై సాంకేతిక కమిటీ

-ఉన్నతాధికారులకు సీఎం రేవంత్‌రెడ్డి సూచనలు
– 23న మేడారం వెళ్లనున్న ముఖ్యమంత్రి
– క్షేత్రస్థాయిలో సందర్శించి అభివృద్ధిపై అక్కడే సమీక్ష

హైదరాబాద్‌, ప్రజాతంత్ర, సెప్టెంబర్‌ 20: మేడారం అభివృద్ధికి చేపట్టాల్సిన పనుల గురించి క్షేత్రస్థాయిలో పరిశీలించేందుకు ఈనెల 23న ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి మేడారం సందర్శించనున్నారు. అక్కడి సమ్మక్క`సారలమ్మ పూజారులతో మాట్లాడి వారి సూచనల మేరకు వారి ఆమోదంతో అభివృద్ధికి సంబంధించి డిజైన్లను విడుదల చేయనున్నారు. మేడారం అభివృద్ధి ప్రణాళికపై శనివారం సమీక్షా సమావేశం నిర్వహించారు. జాతర పనులకు సంబంధించి సాంకేతిక కమిటీని ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు. పూజారులు కోరిన విధంగా ప్రస్తుతం ఉన్న ఆలయ ఆవరణను మరింత విస్తరించాలని ప్రభుత్వం ఆలోచిస్తున్నది. గద్దెలను యథాతథంగా ఉంచి సంప్రదాయాలను తూ.చా తప్పకుండా గౌరవించాలని ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించారు. సీఎం గిరిజన సంప్రదాయం ఉట్టిపడేలా స్వాగత తోరణం డిజైన్లు ఉండాలని, ఆలయం పరిసర ప్రాంతాల్లో ఆ ప్రాంత సంప్రదాయ వృక్షాలు ఉండేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. సమావేశానికి మంత్రులు పొంగులేటి శ్రీనివాస్‌ రెడ్డి, సీతక్క, కొండా సురేఖ, అడ్లూరి లక్ష్మణ్‌, సీఎం సలహాదారు వేం నరేందర్‌ రెడ్డి, ఎంపీ బలరాం నాయక్‌, సీఎం ప్రిన్సిపల్‌ సెక్రటరీ శ్రీనివాసరాజు, దేవాదాయ శాఖ ప్రిన్సిపల్‌ సెక్రటరీ శైలజా రామయ్యర్‌, ఉన్నతాధికారులు హాజరయ్యారు. కాగా, ఈనెల 23న సీఎం రేవంత్‌రెడ్డితోపాటు మంత్రులు, గిరిజన ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, సంబంధిత అధికారులు మేడారం వెళ్లనున్నారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *