– ఐటీ శాఖ మంత్రి శ్రీధర్బాబు
హైదరాబాద్, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 20 : హెచ్-1బి వీసా ఛార్జీలను పెంచుతూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీసుకున్న నిర్ణయం తెలంగాణ యువతకు తీవ్ర నష్టం చేకూరుస్తుందని ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్బాబు అన్నారు. సచివాలయంలో శనివారం విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ దీనిని రాష్ట్ర ప్రభుత్వం ఖండిస్తున్నదన్నారు. భారత దేశానికి ముఖ్యంగా అమెరికాలో చిన్నచిన్న వ్యాపారాలు నడిపిస్తున్న వారికి అమెరికా నష్టం కలిగించే నిర్ణయాలు తీసుకుంటోందని అన్నారు. అమెరికా నిర్ణయాలపై భారత ప్రభుత్వం ఎందుకు మౌనంగా ఉంటున్నదని ప్రశ్నించారు. హెచ్-1బి వీసాలో మొదటి స్థానంలో ఇండియా, తర్వాత చైనా ఉందని తెలిపారు. హెచ్`1బి వీసాదారులకు తాత్కాలిక ఉపశమనం కలిగే విధంగా కేంద్రం నిర్ణయం తీసుకోవాలని కోరారు. తెలంగాణ వారు అమెరికాలో చాలామంది ఉన్నారని, ఇక్కడి వారి కుటుంబాల వాళ్ళు తమ వారు పంపించే డబ్బులపైనే ఆాధారపడి ఉంటారని తెలిపారు. టీసీఎస్లో లక్షమంది, విప్రోలో 80 వేలు, ఇన్ఫోసిస్లో 60 వేలమంది అమెరికాలో ఉన్నారని ఆయన వెల్లడిరచారు. ట్రంప్ నిర్ణయం టాలెంట్కు వ్యతిరేకంగా తీసుకున్న నిర్ణయం అంటూ అక్కడ వ్యాపారవేత్తలు వ్యతిరేకిస్తున్నారన్నారు. ట్రంప్ నిర్ణయంపై కేంద్ర ప్రభుత్వం దౌత్యపరంగా నిర్ణయాలు తీసుకోవాలని, లేకుంటే ఇండియాకు నష్టం జరుగుతుందని పేర్కొన్నారు. అమెరికా వెళ్ళాలనుకునే యువతకు ట్రంప్ నిర్ణయం పెనుభారమవుతుందన్నారు. ట్రంప్ నిర్ణయం వల్ల మన ఆర్థిక వ్యవస్థపై ముఖ్యంగా రియల్ ఎస్టేట్, బంగారం కొనుగోలు, ఇతర రంగాలపై ప్రభావం చూపుతుందన్నారు. చిన్న, మధ్యతరగతి కంపెనీల గురించి కేంద్రం ఆలోచించి నిర్ణయం తీసుకోవాలని, అమెరికాతో చర్చలు జరపాలని మంత్రి శ్రీధర్బాబు కోరారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్సైట్ ను సందర్శించండి. తాజా అప్డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.





