– ఒకే కుటుంబంలో ముగ్గురి మృతి
వికారాబాద్, ప్రజాతంత్ర, ఏప్రిల్ 13: వికారాబాద్ జిల్లాలో తీవ్ర విషాదం నెలకొంది. పెద్దేముల్ మండలం తట్టేపల్లి దగ్గర ఓ ద్విచక్ర వాహనాన్ని లారీ ఢీకొట్టింది. ఈ ఘటనలో భార్యాభర్తలు సహా ఓ చిన్నారి దుర్మరణం చెందింది. మృతులు తాండూరు నుంచి జహీరాబాద్ వైపు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. కాగా, ప్రమాదం తర్వాత పారిపోయిన లారీ డ్రైవర్ పెద్దేముల్ పోలీస్ స్టేషన్లో లొంగిపోయినట్లు తెలుస్తోంది. పెద్దేముల్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం వికారాబాద్ జిల్లా పెద్దేముల్ మండల పరిధిలోని త్టటెపల్లి గ్రామ శివారులో జరిగిన ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు మృతిచెందారు. వికారాబాద్ జిల్లా రుక్మాపూర్ గ్రామానికి చెందిన పావని (35), ఆమె భర్త కవిరాజ్ (40) జహీరాబాద్లో నివసిస్తున్నారు. వీరు ఆదివారం సాయంత్రం జహీరాబాద్ నుంచి రుక్మాపూర్ గ్రామానికి వెళ్లారు. తిరిగి వస్తుండగా లారీ వీరి స్కూటీని ఢీకొంది. ఈ ప్రమాదంలో వారితోపాటు వారి కుమార్తె కీర్తన అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. కుమారుడు కార్తీక్ స్వల్ప గాయాలతో బయటపడ్డాడు. చికిత్స నిమిత్తం తాండూరు ప్రభుత్వ హాస్పిటల్కు తరలించారు. ప్రమాదానికి కారణమైన లారీ డ్రైవర్ మహమ్మద్ షరీఫ్పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పెద్దేముల్ పోలీసులు తెలిపారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్సైట్ ను సందర్శించండి. తాజా అప్డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.





