– డిపిఆర్ లేదు..ప్రణాళిక లేకుండా ఎలా?
– మూసీ ప్రక్షాళనపై స్పష్టత లేని ప్రభుత్వం
– పేదల ఇళ్లు కూల్చివేత దారుణం
– బఫర్ జోన్ నిర్ణయంలోనూ అస్పష్టత
– అసెంబ్లీలో మూసీ ప్రక్షాళనపై నిలదీసిన కెటిఆర్
- ప్రభుత్వ తీరుకు నిరసనగా బిఆర్ఎస్ వాకౌట్
హైదరాబాద్,ప్రజాతంత్ర,మార్చి
పారదర్శకత లేని నిర్ణయాలను తీవ్రంగా వ్యతిరేకిస్తాం
మూసీ ప్రాజెక్ట్ పేరిట ప్రజల ఆస్తులు, ఇళ్లు, జీవనోపాధిపై దెబ్బతీసే చర్యలను బీఆర్ఎస్ ఎట్టి పరిస్థితుల్లోనూ అంగీకరించబోదని, పారదర్శకత లేకుండా తీసుకునే ప్రతి నిర్ణయాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తామని కేటీఆర్ స్పష్టం చేశారు. కేటీఆర్ మాట్లాడుతూ.. ప్రభుత్వం వద్ద డీపీఆర్ ఉందా లేదా అన్న విషయానికే స్పష్టమైన సమాధానం లేదని విమర్శించారు. మూసీ రివర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఎండీ సైతం డీపీఆర్ లేదని చెబుతున్నారని తెలిపారు. ఎన్ని ఇళ్లు కూల్చివేస్తున్నారు అనే విషయానికీ ప్రభుత్వం సరైన వివరాలు ఇవ్వడం లేదన్నారు. ప్రభుత్వం ఫైవ్ స్టార్ హోటళ్లలో ప్రజెంటేషన్లు చేయకుండా, బాధితులతో ప్రజల మధ్యే ప్రజెంటేషన్ ఇవ్వాలని తాము డిమాండ్ చేసినట్లు తెలిపారు. ఈ కారణంగానే ప్రభుత్వం ఏర్పాటు చేసిన పవర్ పాయింట్ ప్రజెంటేషన్కు బీఆర్ఎస్ హాజరుకాలేదని స్పష్టం చేశారు. మూసీ నదిని మురికి కూపంగా మార్చింది కాంగ్రెస్ పార్టీయేనని కేటీఆర్ ఆరోపించారు. ఇప్పుడు అదే పార్టీ ప్రజల పేరుతో భారీ ప్రాజెక్ట్ పేరుతో అవినీతి చేయాలని చూస్తోందని అన్నారు. ప్రభుత్వం వద్ద డీపీఆర్ ఉంటే వెంటనే సభలో ప్రవేశపెట్టాలని డిమాండ్ చేశారు. 50 టర్ల బఫర్ జోన్ అని చెప్పి, ఐదు కిలోటర్ల దూరంలో ఉన్న హనుమాన్ నగర్కు నోటీసులు ఇవ్వడం ప్రభుత్వ అస్పష్టతకు నిదర్శనమని విమర్శించారు. మొదట 1,400 ఇళ్లు కూల్చివేస్తామని చెప్పి, ప్రస్తుతం 10,000 ఇళ్లకు పైగా నోటీసులు ఇవ్వడం ఎలా జరిగిందో ప్రభుత్వం చెప్పాలని డిమాండ్ చేశారు. ఖమ్మం జిల్లా వెలుగుమట్లలో సొంత జిల్లాలోనే ఇళ్లు కూల్చివేస్తున్నా ఉప ముఖ్యమంత్రికి కనీస సమాచారం లేదని పేర్కొన్నారు. ప్రభుత్వం వద్ద నిధులు లేవని, సరైన ప్రణాళిక లేదని, ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ లోన్ కూడా లేదని కేటీఆర్ స్పష్టం చేశారు. మూసీ ప్రాజెక్ట్ డీపీఆర్ తయారీని ’మెయిన్ హార్ట్’ అనే కంపెనీకి అప్పగించారని, ఈ కంపెనీని సింగపూర్, పాకిస్తాన్, భారతదేశంలోని అనేక సంస్థలు బ్యాన్ చేశాయని తెలిపారు. గతంలో ఇదే అసెంబ్లీలో డీపీఆర్ తయారీకి కనీసం 18 నెలలు పడుతుందని చెప్పి, ఇప్పుడు కేవలం రెండు నెలల్లో డీపీఆర్ సిద్ధమైందని చెబుతుండటం అనుమానాస్పదమని అన్నారు. రెండు నెలల్లో అద్భుతంగా డీపీఆర్ తయారు చేసి ఉంటే, దాన్ని ప్రజల ముందుంచాలని డిమాండ్ చేశారు. మూసీ ప్రాజెక్టుకు ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ రుణం ఇవ్వడానికి అంగీకరించిందని మంత్రి శ్రీధర్ బాబు సభలో చెప్పారని, కానీ బ్యాంక్ అధికారులను సంప్రదించగా జనవరి 23 నాటికి ఎలాంటి డీపీఆర్ తమకు అందలేదని, కాబట్టి రుణంపై ఎలాంటి అంగీకారం లేదని స్పష్టం చేశారని తెలిపారు. మార్చి 11న కూడా అదే విషయాన్ని ఏడీబీ మరోసారి స్పష్టం చేసిందని అన్నారు. ప్రభుత్వం తన సమాచారాన్ని సరిదిద్దుకోవాలి లేదా కావాలనే ప్రజలను, సభను తప్పుదోవ పట్టిస్తున్నదా అనే అనుమానం కలుగుతోందని కేటీఆర్ వ్యాఖ్యానించారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్సైట్ ను సందర్శించండి. తాజా అప్డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.




