– వోటర్ల జాబితా విడుదలకు ఈసీ నోటిఫికేషన్
– 28లోపు ముసాయిదా జాబితా ప్రకటన
హైదరాబాద్,ప్రజాతంత్ర,ఆగస్ట్26: తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికల కోసం రాష్ట్ర ఎన్నికల సంఘం కసరత్తును ముమ్మరం చేసింది. అందులో భాగంగా మంగళవారం గ్రామ పంచాయతీ ఎన్నికల నిర్వహణ కోసం పోలింగ్ కేంద్రాలు, తుది వోటర్ల జాబితా విడుదలకు నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆ క్రమంలో నోటిఫై చేయబడిన అన్ని గ్రామ పంచాయతీల్లోని ఫోటో వోటర్ల జాబితాను తయారు చేసి ప్రచురించాలని పంచాయతీ అధికారులను రాష్ట్ర ఎన్నికల సంఘం ఆదేశించింది. గ్రామ పంచాయతీల వోటర్ల జాబితా తయారీ ప్రచురణ కోసం షెడ్యూల్ సైతం విడుదల చేసింది. ఆగస్టు 28వ తేదీ లోపు గ్రామ పంచాయతీల ముసాయిదా వోటర్ల జాబితా తయారీ చేసి గ్రామ పంచాయతీ, మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో వార్డుల వారీగా వోటర్ల జాబితాలను ప్రదర్శించాలని జారీ చేసిన నోటిఫికేషన్లో స్పష్టం చేసింది. ఇక ఆ మరునాడే.. అంటే ఆగస్ట్ 29వ తేదీన ఎంపీడీవోల ద్వారా మండల స్థాయిలో వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశాలు నిర్వహించనున్నారు. ఆగస్టు 30వ తేదీన వోటర్ల జాబితాపై అభ్యంతరాల స్వీకరిస్తామని ఎన్నికల సంఘం వెల్లడించింది. అలాగే ఆగస్టు 31వ తేదీన జిల్లా పంచాయతీ అధికారి గ్రామ పంచాయతీల వార్డుల వారీగా ఫోటో వోటర్ల తుది జాబితాలను ప్రచురణకు ఆదేశించింది. ఇదిలావుంటే తెలంగాణ కేబినెట్ సమావేశం ఆగస్ట్ 29న మద్యాహ్నం 3:30గంటలకు జరగనుంది. సెక్రటేరియట్లో సీఎం రేవంత్ అధ్యక్షతన ఈ భేటీ జరగనుంది. బీసీ రిజర్వేషన్లు, అసెంబ్లీ సమావేశాల తేదీ ఖరారు, సర్పంచ్ ఎన్నికలు,కాళేశ్వరం నివేదికపై ప్రధానంగా ఈ భేటీలో చర్చించనున్నారు. ముఖ్యంగా అందరు ఎదురు చూస్తోన్న పంచాయతీ ఎన్నికల నిర్వాహణపై ఈ కేబినెట్ భేటీలో క్లారిటీ రానుంది. సెప్టెంబర్ 30 లోపు పంచాయతీ ఎన్నికలు నిర్వహించాలని హైకోర్టు ఆదేశించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో పంచాయతీ ఎన్నికలపై స్పష్టత కోసం అందరూ ఎదురుచూస్తున్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42 శాతంరిజర్వేషన్లు కల్పించే బిల్లు, పంచాయతీ రాజ్ చట్ట సవరణ ఆర్డినెన్స్ కేంద్రం వద్ద పెండింగ్లో ఉండటంతో రిజర్వేషన్లపై ఇప్పటికే న్యాయ నిపుణుల సలహా తీసుకుంది సబ్ కమిటీ. ఆగస్టు 28 లోపు ప్రభుత్వానికి రిపోర్ట్ ఇవ్వనుంది. సబ్ కమిటీ ఇచ్చే నివేదికపై కేబినెట్ లో చర్చించి..స్థానిక సంస్థల ఎన్నికల్లో రిజర్వేషన్లపై నిర్ణయం తీసుకోనుంది.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం Prajatantra వెబ్సైట్ను సందర్శించండి. తాజా అప్డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ను ఫాలో కండి. అలాగే మా ప్రజాతంత్ర యూట్యూబ్ చానల్ను సబ్ స్క్రైబ్ చేసుకోండి. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మరిచిపోవద్దు.




