– టీవీ నటుడు లోబోకు ఏడాది జైలు
జనగామ,ఆగస్ట్ 29: రోడ్డు ప్రమాదంలో ఇద్దరి మృతితోపాటు- పలువురు గాయపడటానికి కారణమైన టీవీ నటుడు ఖయూమ్ అలియాస్ లోబోకు ఏడాది జైలు శిక్ష విధిస్తూ జనగామ కోర్టు తీర్పునిచ్చింది. జనగామ జిల్లా రఘునాథపల్లి పోలీసుల కథనం ప్రకారం.. 2018 మే 21న ఓ టీవీ ఛానల్ తరఫున వీడియో చిత్రీకరణ కోసం లోబో బృందం రామప్ప, లక్నవరం, భద్రకాళి చెరువు, వేయిస్తంభాల ఆలయం తదితర ప్రాంతాల్లో పర్యటించింది. అనంతరం లోబో స్వయంగా కారు నడుపుతూ వరంగల్ నుంచి హైదరాబాద్కు వెళ్తుండగా.. రఘునాథపల్లి మండలం నిడిగొండ వద్ద ఎదురుగా వచ్చిన ఆటోను ఢీకొట్టారు. ఆటోలో ప్రయాణిస్తున్న ఖిలాషాపురం గ్రామానికి చెందిన మేడె కుమార్, పెంబర్తి మణెమ్మలు తీవ్ర గాయాలతో మృతి చెందారు. పలువురికి గాయాలయ్యాయి. కారు కూడా బోల్తా పడటంతో లోబోతో పాటు- బృంద సభ్యులకు స్వల్ప గాయాలయ్యాయి. మృతుల కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు అప్పట్లో రఘునాథపల్లి పోలీసులు కేసు నమోదు చేశారు. ఇద్దరి మృతికి కారణమైన లోబోకు ఏడాది జైలు శిక్షతో పాటు- రూ.12,500 జరిమానా విధిస్తూ కోర్టు తీర్పునిచ్చినట్లు- పోలీసులు వివరించారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్సైట్ ను సందర్శించండి. తాజా అప్డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.



