జీహెచ్ఎంసీ ఎన్నికలకు సిద్ధం కండి
దొంగవోట్లు, అక్రమాలతో కాంగ్రెస్ గెలుపు
గోపీనాథ్ కుటుంబానికి అండగా నిలిచాం
సమీక్షా సమావేశంలో మాజీ మంత్రులు కేటీఆర్, హరీష్ రావు
హైదరాబాద్, ప్రజాతంత్ర, నవంబర్ 19: గోపీనాథ్ మరణం తర్వాత ఆయన కుటుంబానికి పార్టీ అండగా నిలిచిందని, ఆయన సతీమణి సునీతమ్మ గెలుపు కోసం కేసీఆర్ నుంచి బూత్స్థాయి కార్యకర్త వరకు ప్రతి ఒక్కరూ కుటుంబ సభ్యుల్లా పనిచేశారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రశంసించారు. రాబోయే కార్పొరేటర్ ఎన్నికల్లో కార్యకర్తల గెలుపు కోసం ఎమ్మెల్యే ఎన్నికలో వారు పడ్డ కష్టానికి మించి తాము పని చేస్తామని, కాలికి బలపం కట్టుకొని తిరుగుతాం అని కార్యకర్తలకు భరోసా ఇచ్చారు. బుధవారం జరిగిన జూబ్లీహిల్స్ సమీక్షా సమావేశంలో ఆయన ప్రసంగించారు. ఇటీవలి ఎన్నికలో కాంగ్రెస్, బీజేపీలు అక్రమాలకు పాల్పడ్డాయని ఆరోపించారు. కర్ణాటక నుంచి మనుషులను తెచ్చి దొంగ ఓట్లు వేయించుకున్నారని,షేక్ పేట, ఎర్రగడ్డ వంటి ప్రాంతాల్లో రిగ్గింగ్ చేశారన్నారు. పోలీసులను అడ్డం పెట్టుకుని డబ్బు, మద్యం పంచి గెలిచారని, ఇది నైతిక గెలుపు కాదని విమర్శించారు. వ్యక్తిగత విషాదంలో ఉన్నా హరీష్ రావు పార్టీ కోసం అంకితభావంతో పనిచేశారని కొనియాడా రు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలే లక్ష్యం గా పనిచేయాలని కేటీఆర్ దిశానిర్దేశం చేశారు. డిసెంబర్ లోపు సర్పంచ్, జిల్లా పరిషత్ ఎన్నికలు పూర్తయ్యే అవకాశం ఉందని, ఆ వెంటనే పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్ర మం చేపడతామని తెలిపారు. జూబ్లీహిల్స్ లోని 407 బూత్లో ఒక్కో బూత్ కు 10 మంది చొప్పున మొత్తం నాలుగువేల మందితో పటిష్టమైన సైన్యాన్ని నిర్మించుకోవాలని సూచించారు. గతంలో నష్టపోయిన చోటే తిరిగి బలాన్ని పుంజుకోవాలని, ఎక్కడ పోగొట్టుకున్నామో అక్కడే వెతుక్కోవాలి అనే సామెతను గుర్తు చేస్తూ కార్యకర్తల్లో ధైర్యాన్ని నింపారు. ప్రజల సమస్యలపై ఇప్పటినుంచే పోరాటం మొదలుపెట్టాలని, జీహెచ్ఎంసీ ఎన్నికలకు ఇప్పటినుంచే గ్రౌండ్ వర్క్ స్టార్ట్ చేయాలని పిలుపునిచ్చారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ఫలితాలపై బీఆర్ఎస్ నాయకులు అధైర్యపడాల్సిన అవసరం లేదని, పోరాటస్ఫూర్తితో పని చేసిన కార్యకర్తలదే నైతిక విజయమని మాజీ మంత్రి హరీశ్ రావు స్పష్టం చేశారు. పార్లమెంట్ ఎన్నికల్లో 18,000 ఓట్లు మాత్రమే వచ్చిన జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో 75,000 ఓట్లు సాధించడం అనేది కార్యకర్తల కృషికి నిదర్శనమన్నారు. ఈ ఎన్నికలో కాంగ్రెస్ ప్రభుత్వం సాంకేతికంగా గెలిచి ఉండవచ్చని, కానీ నైతిక విజయం మాత్రం బీఆర్ఎస్ అభ్యర్థి సునీతమ్మదేనని హరీశ్ రావు అన్నారు. మైనారిటీల మద్దతు కోల్పోతున్నామని గుర్తించిన కాంగ్రెస్ చివరి నిమిషంలో హడావుడిగా అజారుద్దీన్కు మంత్రి పదవి ఇవ్వడాన్ని గుర్తు చేశారు. ఇది బీఆర్ఎస్ పోరాట ఫలితమేనని వ్యాఖ్యానిం చారు. దుబ్బాక, హుజూరాబాద్ ఎన్నికల్లోనూ తాత్కాలికంగా ఓటమి ఎదురైనా ఆ తర్వాత జరిగిన పరిణామాలు గెలుపును అందించాయని గుర్తు చేశారు. కేసీఆర్ మళ్లీ అధికారంలోకి వస్తారని, తమను ఇబ్బంది పెట్టిన వారిని ఎవరినీ వదిలే ప్రసక్తే లేదని హెచ్చరించారు. కేటీఆర్, తలసాని శ్రీనన్న సహా తామంతా కార్యకర్తలకు కుటుంబ సభ్యులుగా అండగా ఉంటామని, ఎవరూ అధైర్యప డాల్సిన అవసరం లేదని భరోసా ఇచ్చారు. ఉపఎన్నిక ఫలితాలపై అధైర్యపడొద్దని తలసాని శ్రీనివాస్ యాదవ్ వ్యాఖ్యానించారు. అధికార పార్టీ దుర్వినియోగం, పోలీసుల జోక్యం, విచ్చలవిడి డబ్బు పంపిణీ ఫలితాన్ని ప్రభావితం చేశాయన్నారు. కాంగ్రెస్ హయాంలో ఆర్థిక సంక్షోభం ఏర్పడిందని, మార్కెట్లో డబ్బు లేకపోవడంతో పండుగల సమయంలో కూడా వ్యాపారం జర గట్లేదని విమర్శించారు. ప్రజలు ఆరు గ్యారెంటీలను 420 హామీల’గా భావిస్తు న్నారని, నిరుపేదలు తప్పనిసరి పరిస్థితుల్లోనే ప్రలోభాలకు గురయ్యారని అభిప్రాయపడ్డారు. రూ.150 కోట్లు ఖర్చు పెట్టి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన కుర్చీని కాపాడుకోవడానికి ఈ ఎన్నికను గెలిచారని తీవ్ర ఆరోపణలు చేశారు. ప్రస్తుత ఫలితం ఓటమి కాదని, కేటీఆర్, హరీష్ రావుల నేతృత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని రోడ్ల మీదకు తీసుకొచ్చామని తెలి పారు. రాబోయే రెండేళ్ల తర్వాత బలమైన ‘తుఫాను’ వస్తుందని, అప్పుడు కాంగ్రెస్ ఉనికి ఉండదని జోస్యం చెప్పారు. సమావేశంలో ఇతర ఎమ్మెల్యేలు, నియోజకవర్గ ముఖ్య నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్సైట్ ను సందర్శించండి. తాజా అప్డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.





