హైదరాబాద్,ప్రజాతంత్ర, డిసెంబర్ 17: లగచర్ల రైతులకు సంఘీభావంగా బీఆర్ఎస్ ఎమ్మెల్యే వినూత్న పద్ధతిలో నిరసన తెలిపారు. నల్ల రంగు చొక్కాలు, చేతులకు బేడీలు వేసుకుని ఎమ్మెల్యేలు అసెంబ్లీకి హాజరయ్యారు. ఇదేమి రాజ్యం.. ఖాకీ రాజ్యం.. దోపిడీ రాజ్యం, లాఠీ రాజ్యం.. లూఠీ రాజ్యం, రైతులకు సంకెళ్లా సిగ్గు సిగ్గు అంటూ అసెంబ్లీ లాబీల్లో నినాదాలు చేశారు. లగచర్ల రైతులకు రాష్ట్ర ప్రభుత్వం క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.
అదేవిధంగా శాసనమండలి సభ్యులు కూడా మండలిలో నల్లరంగు దుస్తులు ధరించి నిరసన తెలిపారు. అంతకుముందు పరిశ్రమల పేరుతో బలవంతపు భూసేకరణ, రైతుల అరెస్టుపై బీఆర్ఎస్ వాయిదా తీర్మానం ఇచ్చింది. ఈ అంశాలపై సభలో చర్చించడానికి అనుమతించాలంటూ స్పీకర్కు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీఆర్ వాయిదా తీర్మానం అందజేశారు.





