సుప్రీంకోర్టు సీజేఐ గవాయ్
హైదరాబాద్, ప్రజాతంత్ర, జులై 12: న్యాయవాదులు ఎప్పటికప్పుడు తమను తాము నిరూపించుకోవాలని, కోర్టు తీర్పులకు సంబంధించి సమగ్ర అవగాహన కలిగి ఉండాలని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బి.ఆర్.గవాయ్ అన్నారు. నల్సార్ యూనివర్సిటీ స్నాతకోత్సవ కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీజేఐ జస్టిస్ గవాయ్ మాట్లాడుతూ ప్రస్తుతం న్యాయ విద్యలో ప్రవేశించేవారి సంఖ్య పెరుగుతోందన్నారు. ఏఐ, డేటా ప్రైవసీ విషయంలో అనుకూల, ప్రతికూల ప్రయోజనాలున్నాయని, సరైన మార్గదర్శకత్వం ఉంటేనే నైపుణ్యం సాధించగలమని అన్నారు. వృత్తిని, చేసే పనిని ప్రేమించాలని, అప్పుడే సరైన ఫలితాలు పొందగలుగుతామని గవాయ్ చెప్పారు. ప్రస్తుతం న్యాయవ్యవస్థలో ఎన్నో సవాళ్లు ఉన్నాయని, కొన్ని కేసుల విచారణ దశాబ్దాలపాటు సాగుతుండడం ఆందోళనకరమని అన్నారు. కార్యక్రమంలో సీఎం రేవంత్రెడ్డి, సుప్రీం కోర్టు జడ్జి జస్టిస్ పీఎస్ నరసింహ, రాష్ట్ర హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సుజయ్పాల్ తదితరులు హాజరయ్యారు.





