– ఆయన బోధన, సాహిత్య సేవలపై జాతీయ సదస్సు
హన్మకొండ, ప్రజాతంత్ర, మార్చి 5 : విద్య, సాహిత్య రంగాల్లో ప్రొఫెసర్ ఎస్.లక్ష్మణమూర్తి చేసిన కృషి కొనియాడదగినదని కో-చైర్మన్ డాక్టర్ ఎ.శ్రీనాథ్ అన్నారు. హన్మకొండలోని కాకతీయ ప్రభుత్వ కళాశాల ఇంగ్లీష్ విభాగం, సహృదయ సాహిత్య సాంస్కృతిక సంస్థ సంయుక్త ఆధ్వర్యంలో దివంగత ప్రొఫెసర్ ఎస్.లక్ష్మణమూర్తి బోధన, సాహిత్య సేవలపై కాకతీయ కళాశాలలో గురువారం జాతీయ సదస్సు నిర్వహించారు. రాష్ట్రంలో అత్యంత గౌరవనీయులైన విద్యావేత్త, సాహిత్యవేత్తలలో ఒకరైన ప్రొఫెసర్ లక్ష్మణమూర్తి జీవితానికి, ఆయన చేసిన కృషికి ఈ సదస్సు తగిన నివాళిగా నిలిచింది. కార్యక్రమ అధ్యక్షుడు, కాకతీయ ప్రభుత్వ కళాశాల ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ జి.శ్రీనివాస్ స్వాగతోపన్యాసం చేశారు. కన్వీనర్ డాక్టర్ పి.దినకర్ మాట్లాడుతూ ప్రొఫెసర్ మూర్తి సాహిత్య విద్య, అనువాద రంగాల్లో చేసిన విశేష కృషిని సభికులకు గుర్తు చేశారు. కళాశాల ఇంగ్లీష్ అసోసియేట్ ప్రొఫెసర్ డాక్టర్ ఇ.రామభాస్కర్ రాజు రూపొందించిన ప్రశంసా పత్రాన్ని లక్ష్మణమూర్తి కుటుంబ సభ్యులకు అందజేశారు. వివిధ సెషన్లలో ప్రముఖ వక్తలు ప్రొఫెసర్ లక్ష్మణమూర్తి వారసత్వంపై తమ ఆలోచనలను పంచుకున్నారు. అకడమిక్, సాహిత్య వర్గాలను తీర్చిదిద్దడంలో ఆయన పాత్రను జి.గిరిజా మనోహరబాబు కొనియాడారు. ఆధునిక విద్యను ప్రభావితం చేసిన ఆయన బోధనా పద్ధతులపై అంపశయ్య నవీన్ మాట్లాడారు. ప్రొఫెసర్ మూర్తి సాహిత్య సేవల శాశ్వత ప్రభావాన్ని రాజగోపాల చారి గుర్తు చేసుకున్నారు. తెలుగు సాహిత్యాన్ని, సంప్రదాయాలను ప్రోత్సహించడంలో ఆయన చేసిన అలుపెరగని కృషి గురించి కె.దామోదర్ రావు మాట్లాడగా ఆర్.మేఘనా రావు ప్రొఫెసర్ లక్ష్మణమూర్తి మార్గదర్శకత్వంలోని వ్యక్తిగత అనుభవాలను పంచుకున్నారు. కుందవజ్జల కృష్ణమూర్తి తన విద్యా ప్రయాణంలో ప్రొఫెసర్ మూర్తి అందించిన సహకారాన్ని స్మరించుకున్నారు. బోధనలో ఆయన ప్రవేశపెట్టిన వినూత్న పద్ధతులను మల్హల్రావు ప్రశంసించగా యువతలో సాహిత్యం పట్ల ఆసక్తిని పెంచడంలో లక్ష్మణమూర్తి పాత్రను బైరెడ్డి కృష్ణారెడ్డి వివరించారు. సవాళ్లను ఎదుర్కోవడంలో ఆయన చూపే స్థైర్యాన్ని ఐ.వి.రమణారావు గుర్తుచేశారు. విద్యా వ్యవస్థపై ఆయన చూపిన గాఢమైన ప్రభావాన్ని టి.రామ్మోహన్ రావు, సాహిత్యం, బోధన పట్ల ఆయనకున్న తాత్విక దృక్పథాన్ని కేశవరావు వివరించారు. ప్రొఫెసర్ మూర్తి సాహిత్య రచనల్లోని లోతును అనంతం విశ్లేషించారు. విద్య, సాహిత్యంపై ఆయనకు గల అచంచలమైన మక్కువను కొనియాడుతూ అంజనీదేవి ప్రసంగించారు. ప్రొఫెసర్ లక్ష్మణమూర్తి కేవలం సాహిత్య రంగాన్నే కాక బోధనా పద్ధతులలో కూడా విప్లవాత్మక మార్పులు తెచ్చారని ఆర్తి పరంకుశం, రాజేశ్వరి శాస్త్రిలు అభిప్రాయపడ్డారు. విమర్శనాత్మక ఆలోచనను, సృజనాత్మకతను ప్రోత్సహించే ఆయన శైలిని తుమ్మూరు లక్ష్మణరావు గుర్తు చేశారు. సాహిత్యంలో సంప్రదాయానికి, ఆధునికతకు మధ్య వారధిగా నిలవడం ఆయన గొప్పతనమని ప్రొఫెసర్ మల్లం నవీన్ కొనియాడారు. సదస్సులో పాల్గొన్న ఇతరులు ప్రొఫెసర్ మూర్తితో తమకున్న అనుబంధాన్ని, జ్ఞాపకాలను పంచుకున్నారు. కార్యక్రమంలో కళాశాల ఆంగ్ల అధ్యాపకులు డాక్టర్ ప్రవీణ్, డాక్టర్ శ్రీనివాస్, శ్రీకాంత్, జయకర్, డాక్టర్ రాజేష్, కిరణ్మయి తదితరులు పాల్గొన్నారు. రాష్ట్రం నలుమూలల నుండి విద్వాంసులు, విద్యార్థులు, ప్రముఖులు విచ్చేశారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్సైట్ ను సందర్శించండి. తాజా అప్డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.




